Home » Bhakti Content » Kala Gnanam » Kalagnana- 15

పోతులూర్ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం - 15

Sri Potuluri Veerabrahmendra Swamy Kalagnana- 15

 

ఇప్పుడు మీకు కుండలినీ శక్తి గురించి వివరిస్తాను. కుండలినీ శక్తిని జాగృతం చేయగలిగినవారు ఈ సృష్టిలో ఏదైనా సాధించగలుగుతారు. ఈ సృష్టిలో అతి కొద్ది మందికి మాత్రమే ఇది సాధించే శక్తి వుంటుంది. అది రకరకాల కారణాల వల్ల సాధ్యం కావచ్చు. యోగులు వేలమంది వుండవచ్చు. కానీ కుండలినీశక్తిని జాగృతం చేయగలిగినవారు అతి తక్కువ.

 

కఠోరమైన సాధన ద్వారా కుండలినీ శక్తిని మేల్కొలపగలుగుతారు. ఇది హఠ యోగం వల్ల సాధ్యపడుతుంది. లేదా మంత్ర జపం వల్ల కూడా సాధ్యమే! మన ఋషులలో ఎక్కువమంది ఈ శక్తిని సాధించనవారే! అందువల్లే వారు భూత భవిష్యత్ కాలాలను గురించి చెప్పగలిగేవారు. వివిధ మహిమలను ప్రదర్శించేవారు.

 

మన మనస్సు సాధారణ వాంఛల వేపే మొగ్గుతుంది.ఎంతటి సన్యాసి అయినా, యోగి అయినా కొద్ది క్షణాలసేపు అయినా కామ వాంఛలకు లొంగని వాడుండడు. అంతటి చంచలమైన మనస్సుపై అదుపు సాధించి ధ్యానంలో నిమగ్నం చేయటం అనేది అతి కొద్దిమంది సాధకులకే సాధ్యపడుతుంది. వారిలో కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగినవారు చాలా తక్కువ.

 

హఠయోగం ప్రకారం కుండలినీ శక్తి పీఠం గుదస్థానం మర్మస్థానం మధ్యలో వుంటుంది. స్త్రీలకు యోని స్థానంలో వుంటుంది. ఇది అండం ఆకారంలో వుంటుంది. సర్పం చుట్టలు చుట్టుకుని నిద్రిస్తున్న విధంగా ఈ శక్తి వుంటుంది. ఈ సృష్టిని ఏ శక్తి అయితే శాసిస్తుందో ఆ శక్తి అంశమే కుండలిని. ఈ శక్తిని మేల్కొలిపితే ఆ భౌతికకాయం జీవంతో వున్నంతవరకు శక్తి వుంటుంది. శరీరంలోని నాడులన్నిటినీ మహాశక్తితో నింపుతుంది కుండలిని. మహా శక్తివంతమైన కుండలినీ శక్తిని జాగృతం చేయడమే యోగాభ్యాసంలోని అత్యున్నత స్థితి. మానవ శరీరమే దేవుని నిలయం. మన శరీరంలోనే ఎన్నో అధ్బుతాలున్నాయి. యోగ సాధన ద్వారా మాత్రమే వీటిని మనం దర్శించగలం" అని వివరించారు.

 

వీరబ్రహ్మంగారు తన శిష్యుడు సిద్దయ్యకి శరీరం గురించి, కుండలినీ శక్తిని గురించి వివరిస్తుండగా, కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా రహాస్యంగా విన్నాడు. అతడు తన అమాయకత్వంతో "బ్రహ్మంగారు చెప్పినదాని బట్టి శరీరం లో చాలా అధ్బుతాలు వున్నాయి. వాటిని నేను చూడాలి” అనుకుని ఇంటికి వెళ్లాడు.

 

అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్నికత్తితో నరికివేసి, అందులోతనకు ఏమైనా అద్భుతాలు కనబడతాయేమోనని చూశాడు. కానీ, కక్కయ్యకు రక్త మాంసాదులు తప్ప ఏమీ కనబడలేదు.

 

'అయ్యో ఆ అయ్యవారు చెప్పిన మాటలు విని నేను, నా భార్యను చంపాను. నాకు దేవుళ్ళు ఎవరూ కనబడకపోగా, పెండ్లాము ప్రాణం తీసిన వాడయ్యాను. దీనికంతటికీ కారణం బ్రహ్మంగారే! ఇదంతా నేను వెళ్లి ఆయననే అడుగుతాను. సమాధానం చెప్పకపోతే ఈ స్వామి దొంగోడు అని అందరికి చెబుతా' - అనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్లాడు. తర్వాత కక్కయ్య బ్రహ్మంగారికి జరిగినదంతా వివరించి, ఆయనను దూషించడం మొదలు పెట్టాడు.

 

కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపోయారు బ్రహ్మంగారు. తర్వాత "కక్కయ్యా! నేను చెప్పినదేదీ అసత్యం కాదు. నేను అసత్యాలేవి చెప్పను. దానికి ఋజువుగా మరణించిన నీ భార్యను నేను బతికిస్తాను ” అని అభయమిచ్చి అతని వెనుక బయల్దేరారు.

 

కక్కయ్య ఇంటికి చేరిన తరువాత కక్కయ్య భార్య శరీరంపై మంత్రజలం చల్లారు. ఆశ్చర్యకరంగా ఆమె పునర్జీవితురాలైంది.

 

ఆ అద్భుతాన్ని చూసి బ్రహ్మానందభరితుడైన కక్కయ్య బ్రహ్మంగారి కాళ్ళమీద పడ్డాడు. “నన్ను క్షమించండి ప్రభూ ! నేను మిమ్ముల్ని తెలుసుకోలేకపోయాను. ఇక ఎప్పటికీ నేను మీ శిష్యుడిగానే వుండిపోతాను” అని ప్రార్థించాడు.

 

“నా శిష్యులు ఎవ్వరూ నన్ను పూజించకూడదు. వారందరూ ఆ సర్వేర్వరుని కోసం అన్వేషిస్తూ వుండాలి. నువ్వు కూడా అదే విధంగా జీవించు" అని కక్కయ్యను ఆయన ఆదేశించి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయారు.

 

యధా ప్రకారం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన దేశాటనను కొనసాగించారు. గ్రామాల్లో తిరుగుతూ, ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపటం మొదలుపెట్టాడు.

 

తన మార్గాంతరంలో నంద్యాల చేరుకున్నారు. ఆ దగ్గరలో వున్నఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భోజనం చేసే సమయంలో దాహం వేసి, ఆ ఊరిలో వున్నఒక విశ్వబ్రాహ్మణుని యింటికి వెళ్లి, కొద్దిగా మంచినీరు ఇవ్వమని అడిగారు.

 

ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై వున్నందువల్ల, ఇంటిలో ఎవ్వరూ లేనందువల్ల పక్కనే వున్న బావి వద్దకు వెళ్లి నీరు తాగమని చెప్పాడు. కానీ బ్రహ్మంగారు ఆ మాటలను పట్టించుకొనక మళ్ళీ మంచినీరు ఇవ్వమని అడిగారు. దాంతో ఆ విశ్వబ్రాహ్మణుడు కోపం తెచ్చుకుని కొలిమిలో కరుగుతున్న లోహాన్ని మూసతో సహా తీసుకువచ్చి, బ్రహ్మంగారికి ఇచ్చి దాహం తీర్చుకోమని ఎగతాళి చేశాడు. అతని అహంకారమును పోగొట్టాలని నిర్ణయించుకున్న బ్రహ్నంగారు ఆ మూసను చేతితో పట్టుకుని మంచి నీటి వలె తాగేశారు.

 

ఇది చూసిన ఆ విశ్వబ్రాహ్మణునికి భయం వేసింది. తర్వాత బ్రహ్మంగారు మామూలు మనిషి కాదని గ్రహించుకుని, ఆయన పాదాలపై పడి, తన తప్పును క్షమించమని ప్రార్థించాడు.

 

Potuluri predictions, brahmam gari kalagnanam, potuluri, kandimallayapalle, Sri Potuluri Veerabrahmendra Swamy Kalagnanam - 15, brahmam gari bodhanalu

google-ad-img