ఓ భక్తురాలి విజయం – గోదా కళ్యాణం!

 

విష్ణుమూర్తి దివ్యస్వరూపం సాధారణమైనది కాదు. ఎన్ని అవతారాలలో చూసినా, ఎన్ని జన్మల పాటు ఆరాధించినా ఆయన పట్ల తన్మయత్వం తనివి తీరదు. శాశ్వతంగా అయనలో ఐక్యమైతే తప్ప ఆ కోరికకి అంతముండదు. అదే సాధించిన ఓ భక్తురాలు. మానవకాంతగా జన్మించి కూడా, ఆ రంగనాథుని తన నాథునిగా చేసుకుంది. అదెలా జరిగిందంటే…

 

శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ (వటపత్రశాయి) లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుచిత్తుడు. నిజానికి విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు. అయితే నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. అంతేకాదు! విష్ణుచిత్తుడు సాక్షాత్తూ ఆ విష్ణమూర్తిని దర్శించి ఆయనకు మంగళాశాసనాలు అర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది. అందుకనే ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు (పెద్ద ఆళ్వారు) అన్న గౌరవాన్ని అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకనాడు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది. ఆమెను సాక్షాత్తూ ఆ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ (పూలమాల) అన్నపేరు పెట్టి గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది.

 

గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుని లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే కానీ, యుక్తవయసు వచ్చేనాటికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా, తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. రాన్రానూ తన చుట్టూ ఉన్న చెలురంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి వ్రజపురమనీ భావించసాగింది గోదా. అంతేకాదు! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందుగా తానే ధరించి తనలో తానే ఆ శ్రీకృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని కృంగిపోయాడు విష్ణుచిత్తుడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ ఆ భూదేవి అవతారమేననీ, ఆమె స్పృశించిన మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.

 

 

అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా రగిల్చాయి. తనకు వివాహం అంటూ జరిగితే ఆయనతోనే అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఆహారానికీ, అలంకారానికీ సంబంధించిన కఠినమైన నియమనిష్టలతో కూడిన కాత్యాయని వ్రతంలో ఆచారాలని పాటించడం ఎంత ముఖ్యమో, సత్ప్రవర్తనకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాదు తన చెలికత్తెలని కూడా తనతో కలిసి వచ్చేందుకు ప్రేరేపించింది. తన చెలులను మేల్కొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలిపేందుకు, తనలోని కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై!

 

 

ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణుచిత్తునికి కనిపించి, తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మనీ అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహమాడతాననీ చెప్పాడు. మరోపక్క శ్రీరంగంలోని ఆలయ అర్చకులకూ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన ఆలయ అర్చకులు ఘనంగా వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవాలయంలోనూ భోగినాడు గోదాదేవికి ఆ రంగనాథునితో అంగరంగ వైభవంతా కళ్యాణాన్ని జరుపుతారు. ఆ రంగనాథుడు అందరికీ నాథుడే! ఆ పరమాత్మునిలో ఐక్యమవ్వాలని తపించేవారందరూ గోదాదేవికి ప్రతిరూపాలే! గోదాదేవి భక్తి ఇతరులకి స్ఫూర్తిగా నిలిచినన్నాళ్లూ ఆమెకి నిత్య కళ్యాణమే!

- నిర్జర.

 


More Sankranti