ENGLISH | TELUGU  

ఇసుమంత కూడా ఇంగితం లేకుండా..!

on Aug 14, 2017

హిచ్ కాక్ ఓ సినిమాకు సంబంధిచిన స్క్రిప్ట్ ని పూర్తి చేశారట. అలాంటి సమయంలో తన మిత్రుడొచ్చి... ‘సినిమా ఎప్పుడు పూర్తి చే్స్తావ్?’ అనడిగాడట. ‘సినిమా పూర్తయిపోయింది. తెరకెక్కించడమే తరువాయి’ అని సమాధానమిచ్చారట హిచ్ కాక్. 

దీన్ని బట్టి అర్థమైందేంటి? పేపర్ వర్క్ పూర్తయితే... సినిమా కూడా పూర్తయినట్టే లెక్క. దాన్ని తెరకెక్కించడం సాధారణ ప్రక్రియ. కానీ..ఇప్పుడు పరిస్థితి అలా లేదు. చిత్ర పరిశ్రమలో రచయిత అంటే ‘విలువ లేని మనిషి’. గ్రంధ చౌర్యం చిత్ర పరిశ్రమలో రాజ్యమేలుతోంది. డైలాగ్స్ ఎవరైనా రాయనీయండి... కథ ఎవరిదైనా కానీయండి...  స్క్రీన్ ప్లే ఎవరైనా చేయనీయండి... ధైర్యంగా, నిస్సిగ్గుగా, ఇసుమంత కూడా ఇంగితం లేకుండా ‘కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం’ అని టైటిల్ కార్డ్ వేసుకునే దర్శక మహానుభావులు ఇక్కడ చాలామందే ఉన్నారు. ‘రచన చేసింది నేనైతే... టైటిల్ వేసుకోడానికి నువ్వెవరు? అని అడిగే ధైర్యం కూడా చేయలేని నిస్సహాయులైన రచయితలు కూడా ప్రస్తుతం ఫిలింనగర్ లో కోకొల్లలు. 

హోటల్ లో సూట్ తీసే విషయంలోనూ... ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కి ఇచ్చిన విలువ కూడా రచయితకి ఇవ్వరంటే మీరు నమ్ముతారా? అంతెందుకు రెమ్యునరేషన్ల విషయంలో కూడా రైటర్లపై చిన్న చూపే. ఈ రోజున రచయిత లందరూ మెగాఫోన్ పట్టుకుంటున్నారంటే.. కారణం ఇదే కదా!.

అసలు ఈ పరిస్థితికి కారణం పూజనీయులైన పూర్వపు రచయితలే అని పలువురి అభిప్రాయం. ఆత్రేయ, ఆరుద్ర తదితర మహా రచయితలు... ఎంతిస్తే అంత తీసుకొని, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని రాసేసి.. భావి రచయితల గౌరవాన్ని తుంగలో తొక్కారని చాలామంది చెబుతుంటారు. ఓ వైపు మరువలేని అద్భుతాలను తమ కలాలతో సృష్టిస్తూనే... మరో వైపు ‘దినం గడిస్తే చాలు’ అనే రీతిగా వాళ్లు ప్రవర్తించడమే ఈ రోజు రైటర్ల అధోగతికి కారణమని పలువురి అభిప్రాయం. అయితే... ఈ రోజుకీ రచయితలపై కాస్తో కూస్తో గౌరవం ఉందంటే కారణం కేవలం ‘పరుచూరి బ్రదర్స్’. కానీ.. ‘మర్రి వృక్షం క్రింద మొక్కలు పెరగవ్’ అన్నట్లు... పరుచూరివారి హయాంలో పెద్దగా రచయితలెవరూ ఎదగలేకపోయారన్నది వాస్తవం.  

అయితే... పరుచూరివారు పరోక్షంగా రగిలించిన స్పూర్తి... ఇప్పుడు రచయితలపై బాగానే పనిచేస్తోంది. గతంలో శ్రీను వైట్ల విషయంలో  కోన వెంకట్ పేపర్ ఎక్కాడం... ‘సింహా’ సినిమా వ్యవహారంలో బోయపాటి శ్రీనుని... దర్శకుడయ్యాక కొరటాల శివ దుయ్యబట్టడం... ఇత్యాది విప్లవాలకి కారణం ఆ స్ఫూర్తే.  లోతుగా వెళితే ఇలాంటి ఉదాంతాలు చాలా దొరుతుకుతాయ్ మనకు. 

రీసెంట్ గా దర్శకుడు తేజా విషయంలో కూడా ఇలాంటి ఓ వార్త ఫిలింనగర్ లో వినిపిస్తోంది. విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న తేజా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా కథ తేజాది కాదనేది ఈ వార్త సారాంశం. తిమ్మారెడ్డి అనే రచయిత ఈ కథ తయారు చేసుకున్నాడనీ, తేజా కొన్ని రోజులు తిమ్మారెడ్డితో కలిసి జర్నీ కూడా చేశాడనీ, కథ క్రెడిట్ తనకే ఇస్తానని మాటిచ్చి చివర్లో హ్యాండిచ్చాడనీ ఫిలింనగర్లో టాక్. 

ఇదే నిజమైతే ఆ తిమ్మారెడ్డి ఎవరో బయటకొచ్చి విషయం చెప్పాలి కదా. కానీ... అలాంటిదేమీ జరగలేదు. తేజా చాలారోజుల తర్వాత ఒక మంచి హిట్ ఇచ్చాడు. దాంతో కావాలనే అతనిపై కొందరు ఇలాంటివి సృష్టిస్తున్నారని కూడా పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. మరి ఇందులో నిజం ఏంటి? అబద్ధం ఏంటి? ఈ ప్రశ్నలకు కాలమే  సమాధానం చెప్పాలి. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.