ENGLISH | TELUGU  

ఆ అగ్ర నిర్మాత ఓటు ‘అమరావతి’కేనట!

on Aug 17, 2017

ఇది వరకు ఒకే తెలుగు రాష్ట్రం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు. కానీ చిత్ర పరిశ్రమ మాత్రం ఒక్కటే. చెన్నయ్ లో ఉన్న సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడటానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఈ లోపు రాష్ట్ర విభజన జరిగి, తెలుగు నేల రెండు ముక్కలైంది. దాంతో తెలుగు సినిమా ఆంధ్రావారి సొత్తా.. లేక తెలంగాణ సొత్తా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. భౌగోళికంగా చూస్తే... తెలుగు సినిమా తెలంగాణలో ఉంది. కానీ.. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులంతా 90  శాతం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు. అంతేకాదు... చిత్ర పరిశ్రమలో పని చేసే వేలాదిమందిలో కూడా 60 శాతం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. దాంతో ఇరు ప్రాంతాల వారి మధ్య ‘సినిమా పరిశ్రమ మాదంటే మాది’అని అంతర్గత యుద్ధం జరుగుతూనే ఉంది. 


ఆంధ్రాలో సినిమాను అభివృద్ధి చేయాలని కాంక్షిస్తున్న కొందరు సినిమా పెద్దలైతే... ఇప్పటికే వైజాగ్ లో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే స్వర్గీయ డి.రామానాయుడు నిర్మించిన సినిమా స్టూడియో వైజాగ్ లో ఉండనే ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ కి ఇటీవల స్థలం కూడా కేటాయించారు. దానికి తగ్గట్టుగా మరో వైపు సినిమా ప్రారంభోత్సవాలన్నీ హైదరాబాద్ లో, షూటింగులన్నీ వైజాగ్ లో జరుగుతున్నాయ్. ఈ విధంగా కర్రా విరక్కుండా, పామూ చావకుండా.. తెలివిగా సినిమా పెద్దలు ముందుకెళ్తున్నారు. 


ఇదిలావుంటే... 
తెలుగు సినిమా రెండు రాష్ట్రాలకు చెందినదే అయినా.. భౌగోళికంగా మాత్రం తెలంగాణలో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయర్ కూడా చిత్ర పరిశ్రమకు అనుకూలంగానే ఉన్నారు. వారికి కావల్సిన సౌకర్యాలను కల్పించడంలోనూ, రాయితీలు అందించడంలోనూ ఆయన వెనుకాడటం లేదు. తెలుగు సినిమా పెద్దలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారు. అయితే... భవిష్యత్తు కచ్చితంగా ఇలా ఉండదు. ఎందుకంటే... సినిమా రంగానికి చెందిన పన్నులన్నీ తెలంగాణ ప్రభుత్వానికే చెందుతున్నాయ్. కానీ... తెలంగాణతో పోలిస్తే... ఆదాయ పరంగా ఆంధ్ర ప్రాంతం నుంచి తెలుగు సినిమాకు వచ్చే ఆదాయం ఎక్కువ. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే...  రాష్ట్ర విభజన తర్వాత తెలుగు చిత్ర సీమలోని కింది స్థాయి కళాకారుల్లో ఆంధ్రవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. తెలంగాణకు చెందిన వారికే అవకాశాలు ఇక్కడ వరిస్తున్నాయ్. ఈ కారణాల వల్ల అక్కడి ప్రభుత్వం ఏదైనా బలమైన నిర్ణయం తీసుకుంటే... పరిస్థితులు మారే అవకాశం లేకపోలేదు. 


ఈ విషయంపై ఓ టీవీ షోలో...  నిర్మాత డి.సురేశ్ బాబు  ఆస్తకికరమైన విషయాలను ప్రస్తావించి చిత్ర పరిశ్రమలో పెద్ద రచ్చకే దారితీశారు. సురేశ్ బాబు మాటలు ఇలా సాగాయ్. ‘చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రాంతంలో కూడా అభివృద్ధి చేందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే... ఆంధ్రలో ఎక్కడ అభివృద్ధి చేయాలి? అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. అద్భుతమైన ప్రకృతి వనరులు ఉన్న సుందర నగరం వైజాగ్ అయితే.. కరెక్టా? లేక  చెన్నయ్ కి అతి చేరువలో ఉన్న తిరుపతి అయితే కరెక్టా? ఈ రెండూ కాక ఆంధ్ర రాజధాని ‘అమరావతి’ అయితే కరెక్టా? అనే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నాం. దీనిపై నా అభిప్రాయం అడిగితే మాత్రం నా ఓటు కచ్చితంగా అమరావతికే. మాకు వైజాగ్ లో స్టూడియో ఉంది. అయినా... నేను మాత్రం అమరావతికే ఓటు వేస్తా. ఎందుకంటే... అమరావతి ఆంధ్రుల రాజధాని. అది అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా చూడటానికి చిన్నదే అయినా... గ్లామర్ పరంగా అంతులేనిది. అందుకే... అలాంటి పరిశ్రమ అక్కడ స్థిరపడితే.. ఆ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంతేకాదు. అక్కడి చాలామందికి సినిమా పరిశ్రమలో అవకాశాలు కూడా లభిస్తాయ్. అందుకే... అమరావతిలో పరిశ్రమ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు సురేశ్ బాబు. 


మరి ఈ అగ్ర నిర్మాత ఆశ నెరవేరుతుందో.. లేదో కాలమే సమాధానం చెప్పాలి. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.