
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya)కు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా సరైన థియేట్రికల్ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు, తాజాగా విడుదలైన ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘వీరభద్రుడు’ (తమిళంలో 'కరుప్పు') పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో త్రిష కథానాయికగా మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ 'వీరభద్రుడు' (Veerabhadrudu) బాక్సాఫీస్ వద్ద ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, మొదటి వారం ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ మార్కును దాటి క్లీన్ హిట్ స్టేటస్ వైపు దూసుకెళ్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ చిత్రానికి రూ. 7.2 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరగగా, రూ. 7.5 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ సినిమా బరిలోకి దిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదలై.. మొదటి రోజు నుంచే మాస్ ఎలిమెంట్స్, సూర్య వన్-మ్యాన్ షో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనితో ఇప్పటికే ఈ సినిమా తెలుగునాట రూ.13 కోట్ల షేర్ రాబట్టి, భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది.
గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల్లోనే రూ.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రస్తుత జోరు చూస్తుంటే, తెలుగునాట రూ.30 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఒక్క తెలుగులోనే కాకుండా, తమిళ ఒరిజినల్ వెర్షన్ ‘కరుప్పు’ (Karuppu) కోలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. అక్కడ గత తొమ్మిది నెలలుగా ఉన్న బాక్సాఫీస్ డ్రై స్పెల్ను బ్రేక్ చేస్తూ, కేవలం 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఇప్పటిదాకా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 235 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.
వరుస పరాజయాల తర్వాత సూర్య బాక్సాఫీస్ స్టామినా ఏంటో 'వీరభద్రుడు' నిరూపించింది. ప్రస్తుతం థియేటర్లలో పెద్దగా పోటీ లేకపోవడంతో, ఈ వారం కూడా ‘వీరభద్రుడు’ మరిన్ని లాభాలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.





