
ఇళయరాజాను అవమానించారు బెంగుళూరు ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు. ఆయనతో పాటు కుటుంబాన్ని కూడా పక్కన నిలబెట్టితనిఖీలు చేశారు. విషయంలోకి వెళ్తే, తన కుటుంబసభ్యులతో కలిసి మంగుళూరులోని దేవాలయాల్ని దర్శించుకున్న ఇళయరాజా, చెన్నైకు వెళ్లడానికి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే అక్కడి అధికారులు ఆయన్ని ఆపి తనిఖీ చేశారు. రాజా వద్ద ఉన్న దేవుని ప్రసాదాన్ని కూడా వదిలిపెట్టకుండా శోధించారు. ఇళయరాజా ఏదో చెప్పబోయినా వినకుండా ఆయన్ను, ఆయన కుటుంబసభ్యులను పక్కన నిలబెట్టారు. అదే సమయంలో అక్కడున్న ఒక ఛానెల్ రిపోర్టర్, ఇళయరాజా గురించి అధికారులకు వివరించి చెప్పడంతో ఆయన్ను లోపలికి అనుమతించారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారి రాజాను కలిసి క్షమాపణ కోరారు. ఇళయరాజా పట్ల అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు ఎండీఎంకే నేత వైగో. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇళయారాజాను ఇలా అవమానించడం దురదృష్టకరమని, సంఘటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.






