అప్పుడు తిట్టుకున్నారు... ఇప్పుడు కలుసుకున్నారు
on Jul 14, 2017
రాజకీయాల్లో బద్ధ శత్రువులూ ఉండరూ... ఆప్త మిత్రులూ ఉండరూ అంటారు. ఈ మాట సినీ రంగానికి కూడా వర్తిస్తుంది. ఓ సారి గొడవ జరగడం.. విడిపోవడం. మళ్లీ ఏదో సందర్భంలో కలవడం, కలిసి పనిచేయడం... ఇదంతా సినీ రంగంలోనే కామనే. అందుకు ఉదాహరణగా చాలామందిని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్, బోయపాటి శ్రీను నే తీసుకోండి. రామానాయుడు స్టూడియోలో జరిగిన ‘లెజెండ్’సక్సెస్ మీట్ లో బోయపాటి మాట్లాడిన తీరు చూసి... వేదిక మీదే మీడియా సాక్షిగా ఖండించాడు దేవిశ్రీ ప్రసాద్. ‘‘దేవిశ్రీ చాలా లేజీ. ఈ సినిమాకు మ్యూజిక్ చేయించుకునే విషయంలో దేవిశ్రీని నేను నిద్రపోనివ్వలేదు. దగ్గరుండి నాకు నచ్చే వరకూ మ్యూజిక్ చేయించుకున్నాను’’ అన్నాడు బోయపాటి. దానికి దేవిశ్రీ వేదిక మీదే బోయపాటి మీద అంతెత్తు లేచాడు. ‘‘ఒకరితో చెప్పించుకుని చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒక్కడినే చెన్నయ్ లో ఈ పాటలు ట్యూన్ చేశాను. మీరు నా దగ్గర లేరు. అనవసరపు మాటలు ఎందుకు? ఇప్పటివరకూ ఎవరితో నేను ఇలా అనిపించుకోలేదు’’ అని ఘాటుగా స్పందించారు దేవిశ్రీ.
ఆ తర్వాత వీరిద్దరూ కలసి పనిచేయడం ఇక జరగదని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టే... బోయపాటి తన తర్వాత సినిమ ‘సరైనోడు’కు తమన్ తో సంగీతం చేయించుకున్నారు. కానీ... తర్వాత ఏమైందో ఏమో... మళ్లీ దేవిశ్రీ, బోయపాటి కలిశారు. ‘జయ జానకి నాయక’ సినిమాకు దేవిశ్రీప్రసాద్ తోనే సంగీతం చేయించున్నారు బోయపాటి శ్రీను. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ విధంగా చిత్ర సీమలో కూడా శాశ్వత శత్రువులు ఉండరు. ఇక్కడ క్రియేటివిటీనే ముఖ్యం. ఏమంటారు.