LATEST NEWS
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తాను పనిచేసే ఆస్పత్రిలోని రోగులకు ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి 17 మందిని హత్య చేసినందుకు ప్రెస్డీకి కోర్టు ఈ శిక్ష విధించింది. 2020-2023 మధ్యకాలంలో అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రాంతంలో ఈ నర్సు వివిధ ఆస్పత్రుల్లో పనిచేసింది. ఈ సమయంలో తాను పనిచేసే ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు ఈమె ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ ఇంజక్ట్ చేసేది. ఈమె అలా మొత్తం 22 మందికి చేసింది. దాని వల్ల 17 మంది మరణించారు. ఇన్సులిన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల హైపోగ్లైసీమియాకి దారి తీస్తుంది. దానివల్ల గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. గుండె పోటు వస్తుంది. ఈ హత్యలు చేసినట్టు నిందితురాలు ఒప్పుకుంది. ఎక్కువ ఇన్సులిన్ ఇచ్చి ఇద్దరిని హత్య చేసినట్టుగా ఈమె మీద గతంలో కేసు నమోదైంది. అయితే పోలీసుల విచారణలో ఈమె చంపింది ఇద్దర్ని కాదు పదిహేడు మందిని అని తేలింది. ప్రెస్డీ రోగులతో, వారి బంధువులతో చాలా దురుసుగా ప్రవర్తించేదని, ఆమె తన తల్లికి ఫోన్లో మెసేజ్‌లు పెడుతూ, తన చుట్టూ వున్న పేషెంట్లు తనకు ఎంతమాత్రం నచ్చడం లేదని, వాళ్ళందర్నీ చంపేయాలని అనిపిస్తోందని పేర్కొనేదని పోలీసులు తెలిపారు. ఆమె మానసికంగా బాగానే వుందని, ఉద్దేశపూర్వకంగా ఈ హత్యాకాండ చేసిందని పోలీసులు వెల్లడించారు. 
పుస్తకాలతో కుస్తీ పడాల్సిన యువత జీవితాలు మత్తులో సుస్తీ అవుతున్నాయి. ఉన్నతంగా ఎదగాల్సిన జీవితాలు, గంజాయి కూపంలో కూరుకుపోతున్నాయి. బిడ్డలపై తల్లిదండ్రుల ఆకాంక్షలు, గుప్పుమనే గంజాయికి నిప్పులా కాలిపోతున్నాయి. బతుకు మార్గం తెలుసుకోవాల్సిన జీవితాలు, గంజాయికి మత్తుకు అర్థంతంగా ముగిసిపోతున్నాయి. ఇవన్నీ కళ్లారా చూసి చలించిపోయారు గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని. గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు.  గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమ‌ర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.  బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న 25వేల కిలోల డ్రగ్స్ రాకెట్ ను సీబీఐ ప‌ట్టుకుంది. ఈ డ్ర‌గ్స్‌ కేసు వైసీపీ చుట్టూ తిరుగుతోంది. గ‌తంలో ముంద్రా పోర్టులో ప‌ట్టుబ‌డిన హెరాయిన్ మూలాలు, వివిధ రాష్ట్రాల‌లో ప‌ట్టుప‌డుతున్న గంజాయి స‌ర‌ఫ‌రా మూలాలు అన్నీ ఏపీ వైపే వేలెత్తి చూపుతున్నాయి. గ‌తంలో ప‌ట్టుబ‌డిన హెరాయిన్ సరుకు మీద ఉన్న ఆషి ట్రేడింగ్ కంపెనీ విజయవాడ అడ్ర‌స్‌లో న‌మోదైంది. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీగా దొరికిన హెరాయిన్ విజయవాడ అడ్రస్ తో ఉండడంతో, ఆ సరుకు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చింది కావడంతో, ఇక జీఎస్టీ నెంబర్ కూడా దానికి ఉన్న నేపథ్యంలో ఏపీకి చెందిన అధికార పార్టీ నేత‌ల హ‌స్తం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపించాయి.  అలాగే బెంగుళూరులో పట్టుబడిన సింథటిక్ డ్రగ్స్ మూలాలు ఏపీలో ఉన్నాయని క‌ర్ణాట‌క పోలీసులు తేల్చారు.   యువ‌త‌ను టార్గెట్ గా చేసుకుని గంజాయి ముఠాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెచ్చిపోతున్నాయి. మైన‌ర్లు కొంద‌రు త‌మ‌కు తెలియ‌కుండానే ఈ రొంపిలోకి దిగుతున్నారు.  అందుకే గంజాయి, కొకైన్ లాంటి మ‌త్తు ప‌దార్థాల ర‌వాణా  సులువుగా సాగిపోతోంది. వీరి వెనుక రాజ‌కీయ నాయకుల అండ‌దండ‌లు ఉన్నాయంటారు పెమ్మ‌సాని. ఏపీకి దిగుమతి అవుతున్న నిషేధిత డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింద‌ని పెమ్మ‌సాని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హెరాయిన్ కేసులో కానీ, విశాఖ భారీ డ్ర‌గ్స్ కేసులోకానీ కింగ్‌పిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఇంకా తేల‌లేదు. ఏపీలో మ‌ద్యాన్ని ఇష్టం వ‌చ్చిన ధ‌ర‌ల‌కు అమ్ముకుంటున్నారు. 60 రూపాయ‌లు ఉన్న చీప్ లిక్క‌ర్‌ను రూ.200ల‌కు విక్ర‌యిస్తున్నారు. రాజ‌ధాని లేదు కానీ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ పేరుతో మ‌ద్యం బ్రాండ్ల‌ను జ‌గ‌న్ అమ్ముతున్నారని పెమ్మ‌సాని మండిప‌డ్డారు. గత దశాబ్దకాలంగా భారతదేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా పెరిగింద‌ని పెమ్మ‌సాని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దాంతోపాటే వినియోగమూ విప‌రీతంగానే పెరిగింది. ఏదో ఒక మూలనుంచి మన దేశానికి మాదకద్రవ్యాలు చేరుతూనే ఉన్నాయి. డ్రగ్స్ కు బానిసలవుతున్నవారిలో యువతదే సింహభాగం.  ప్రపంచంలోనే ఓపియం (నల్లమందు)ను అధికంగా సాగు చేసే మయన్మార్, ఆప్ఘనిస్తాన్ దేశాలకు సమీపంలో ఉండటం కూడా భారత్ కు శాపంగా పరిణమించింది. ఆప్ఘన్ లో సాగయ్యే ఓపియంను పాకిస్తాన్ హెరాయిన్ గా మార్చి ఇండియాలోకి అక్రమంగా రవాణా చేస్తోంది. మయన్మార్ లోని షా, కచిన్ రాష్ట్రాలలో తయారయ్యే హెరాయిన్, మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను భారత్ లోకి అక్రమంగా రవాణా చేసేందుకు స్థానిక తిరుగుబాటు ముఠాలను చైనా ప్రోత్సహిస్తోంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అంచనాల ప్రకారం భారతదేశానికి అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్ లో 70 శాతం అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతం ద్వారా చేరుతున్నాయి.  త‌న‌ను గెలిపించి పార్ల‌మెంట్‌కు పంపిస్తే, ఈ డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిని దేశం నుంచి త‌రిమేయ‌డానికి పార్ల‌మెంట్‌లో పోరాడ‌తాన‌ని పెమ్మ‌సాని గ్యారెంటీ ఇస్తున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం అనలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వివాహేతర సంబంధాన్ని నేరం అనలేమని చెప్పింది. వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధం వుండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమం మాత్రమేనని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.  కోర్టు ఈ వ్యాఖ్యలను ఒక కేసు విషయంతో తీర్పు ఇస్తూ చేసింది. ఒక మహిళ కొంతకాలంగా ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంది. అయితే ఆ వ్యక్తి తనకు పెళ్ళి అయిన విషయం దాచి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ కోర్టు మెట్లు ఎక్కింది. అతనితో శారీరక సంబంధాన్ని ఇష్టపూర్వకంగానే కొనసాగించి, అతనికి ముందే పెళ్ళయింది కాబట్టి తనను నమ్మించి మోసం చేశాడని అనడంలో అర్థం లేదని జస్టిస్ అమిత్ మహాజన్ స్పష్టం చేశారు. తనను బలవంతం చేసి లొంగదీసుకున్నాడని చెప్పినప్పటికీ దీన్ని నేరంగా పరిగణించలేమని అన్నారు. 
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి  కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరి కొన్నాళ్లు కొనసాగించాలని  తెలుగుదేశంనాయకుడు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని హరీష్ రావు  తాజాగా ఆరోపించారు.ఇవి తెలంగాణ భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని తెలంగాణను కాపాడుకోవాలంటో లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఓట్లేయాలని పిలుపునచ్చారు. తెలంగాణ అస్థిత్వం కోసం ఢిల్లీలో కొట్లాడాలంటే తగిన ఎంపీ స్థానాలు అవసరమని కేటీఆర్,హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు.   జూన్ 1వతేదీతో 10ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బీఆర్ఎస్ వినా ఎవరూ ఉమ్మడి రాజధాని గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. అధికారానికి దూరమైన బీఆర్ఎస్ కు, ఈ నెలలో జరిగే ఎన్నికలలో ఓటమి భయంతో వణికి పోతున్న జగన్ పార్టీకీ మాత్రమే ఉమ్మడి రాజధాని గుర్తుకు వచ్చింది. వాస్తవానికి ఏపీలో జగన్ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఈ ఐదేళ్లలో  హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయమే ఆయనక గుర్తులేదు. ఇప్పుడు ఎన్నికల ముంగిట ఓటమి భయం వెంటాడుతుంటే.. ఆయన ఉమ్మడి రాజధానిని వదిలేసి వచ్చి చంద్రబాబు తప్పు చేశారంటూ విమర్శలు ఎత్తుకున్నారు. వాస్తవానికి  చంద్రబాబు హయాం లోనే ఏపీకి సంబంధించిన కార్యాలయాలన్నీ దాదాపుగా ఏపీకి తరలి వచ్చాయి. మిగిలిన కార్యాలయాలు కూడా జగన్ అధికారం చేపట్టిన తరువాత ఏపీకి తరలివచ్చాయి.  జూన్ 1వ తేదీ తరువాత హైదరాబాద్ కేంద్రం చేతిలోకి వెళుతుందన్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ లు తెలంగాణలో ఎన్నికల హీట్ పెంచాలనీ, ఐటీ బూచిని చూపి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందాలనీ చూస్తున్నారు.   బీజేపీ నుంచి హైదరాబాద్ యూటీ అన్న ప్రతిపాదన ఏదీ రాకుండానే బీఆర్ఎస్ కీలక నేతలు ఎందుకు ఆ అంశాన్ని లేవనెత్తారన్నది బహిరంగ రహస్యమే. తెలంగాణ సెంటిమెంట్ ఒక్కటే తమను లోక్ సభ ఎన్నికలలో జీరో స్థానాల పరాభవం నుంచి గట్టెక్కగలదని బీఆర్ఎస్ భావిస్తుండటమే యూటీ బూచిన ఎన్నికల అంశంగా మార్చాలని బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు కారణం.   తెలంగాణ ఉద్యమం సమయంలో, రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ యూటీ ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే. అప్పట్లో ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రజలు ,నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన అప్పట్లోనే అటకెక్కింది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ యూటీ ప్రతిపాదనకు అప్పట్లో కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.  ఆ తరువాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను నిర్ణయించినా, దానిని ఎవరూ కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఉత్తరాది,దక్షిణాది అంశాలు   తెరపైకి వచ్చిన నేపథ్యంలో కొంత కాలం కిందట హైదరాబాద్ ను ఢిల్లీ తరువాత దేశానికి రెండవ రాజధానిగా మార్చాలన్న ప్రతిపాదన వచ్చింది. శీతాకాలపార్లమెంటు సమావేశాలు  దక్షిణాదిలో హైదరాబాద్ లో జరపాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే.  రాజ్యాంగంలో కూడా  రెండవ రాజధాని ప్రస్తావన ఉందని కొందరు చెబుతున్నారు కూడా. మొత్తం మీద తెలంగాణలో కనీస స్థానాలను దక్కించుకుని పరువు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ రాష్ట్రాల మధ్య సెంటిమెంటు మంటలు రగల్చడానికి ఉన్న ఏ అవకాశాన్నీ వదలడం లేదు. అయితే సెంటిమెంట్ రగిల్చేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలైతే ఇసుమంతైనా కనిపించడం లేదు. దీంతో ఎలాగైనా బీజేపీ మద్దతు పొందాలన్న తహతహ బీఆర్ఎస్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే కేసీఆర్ బీజేపీకి గెలుపు అవకాశాలున్న ఐదు నియోజకవర్గాల గురించి పట్టించుకోవడం లేదనీ, తన ప్రచారంలో కేవలం 12 స్థానాల్లో విజయం అనే అంటున్నారని చెబు తున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలలో  పెను మార్పులు అంటూ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారీ ఒప్పందానికి సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలలో జీరో కాకూడదని బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కపపడానికీ, తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికీ కూడా వెనుకాడటం లేదని అంటున్నారు. 
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు పెట్టిన పూలే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెడుతున్నారు. ఎందుకంటే, ఆ పూలు పెట్టక తప్పని పరిస్థితి. విభజన చట్టం ప్రకారం పోలవరం పరిసరాల్లోని కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యాయి. 2014లో ఈ విలీనం జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రక్రియకు మద్దతు పలికారు. అది జరగక తప్పని అంశం అని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ మాట మార్చారు. ఆంధ్రాలో కలసిన గ్రామాలను తిరిగి తెలంగాణకు తెస్తాం అని చెప్పడం మొదలుపెట్టారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చి పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ అండ్ కంపెనీ విలీన గ్రామాలు అనే పాయింట్‌ని పట్టుకుని మొన్నటి వరకూ వేలాడింది. ఇప్పుడు అదే పాయింట్‌ని పట్టుకుని రేవంత్ రెడ్డి వేలాడ్డం ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రీసెంట్‌గా విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ఈ హామీ చేశారు. ఏపీలో విలీనం అయిన గ్రామాలను వెనక్కి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణకు రావాల్సిన 1. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, 2. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, 3. హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), 4. హైదరాబాద్-విజయవాడ రహదారి వెంటే వేగవంతమైన రైల్వే ప్రాజెక్టు, 6. మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు... ఇవన్నీ సాధిస్తామని రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సినవి ఇవ్వాల్సిందే అని అడగడంలో న్యాయం వుంది. కాకపోతే అదే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే కదా... తెలంగాణలోని గ్రామాలను ఆంధ్ర్రపదేశ్‌లో కలిపింది. మాకు రావలసినవి అడుగుతాం.. ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వం అనే సిద్ధాంతం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. పైగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే.  కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే జనాన్ని మభ్యపెట్టడానికి గ్రామాలను తిరిగి తెచ్చే హామీ ఇస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడవాలని అనుకుంటే ఆయన ఇష్టం. ఎవరు కాదంటారు?
ALSO ON TELUGUONE N E W S
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'విశ్వంభర'. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ లో త్రిష కథానాయికగా నటిస్తోంది. నేడు(మే 4) త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమెకి విషెస్ తెలుపుతూ చిత్రం బృందం ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'విశ్వంభర' చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె. నాయుడు, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో ఆయన నటిస్తున్న సినిమాలు ఆలస్యమవుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీ 'ఓజీ'.. సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ తేదీకి 'ఓజీ' విడుదల కావడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి, రాబోయే ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తారనే అంచనాలున్నాయి. అదే జరిగితే ఆయన సినిమా షూటింగ్ లకు తక్కువ సమయం కేటాయిస్తారు. దాంతో 'ఓజీ' సహా చేతిలో ఉన్న మిగతా సినిమాలన్నీ మరింత ఆలస్యమవుతాయి. అయితే ఒకవేళ 'ఓజీ' వాయిదా పడినా మెగా అభిమానులు మాత్రం నిరాశ చెందాల్సిన అవసరంలేదు. ఎందుకంటే, ఆ తేదీకి పవన్ కళ్యాణ్ స్థానంలో రామ్ చరణ్ (Ram Charan) రాబోతున్నాడట. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే దర్శకుడు శంకర్ 'ఇండియన్-2'తో బిజీ కావడంతో 'గేమ్ ఛేంజర్' ఆలస్యమవుతూ వస్తోంది. అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న 'ఓజీ' విడుదల కావడం కష్టమేనని తెలియడంతో.. 'గేమ్ ఛేంజర్' టీం ఆ డేట్ పై కర్చీఫ్ వేసిందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
తాజాగా బన్నీ  పుష్ప 2 తో ఒక నయా రికార్డుని సృష్టించాడు. ఆల్రెడీ  ఇప్పటికే  ఎన్నో రికార్డులు తన ఖాతాలో ఉన్నాయనుకోండి. బట్ ఇది మాత్రం వెరీ వెరీ స్పెషల్ రికార్డు. అంతే కాదు తనని ఎందుకు ఐకాన్ స్టార్  అంటారో మరో సారి నిరూపించాడు  మొన్న పుష్ప 2 నుంచి  సాంగ్ రిలీజ్ అయ్యింది. పుష్ప.. పుష్ప  అనే లిరిక్ తో కూడిన  ఆ సాంగ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పలు సంచలనాలకు నిలయంగా మారింది.  అతి త్వరగా యాభై  మిలియన్ వ్యూస్ ని సాధించిన పాటగా నిలిచింది. మొత్తం ఆరు భాషల్లో కలిపి ఆ ఘనతని సాధించింది. అలాగే ఇనిస్టాగ్రమ్ లో కూడా  100 కె  రీల్స్ ని సాధించింది.  దీన్ని బట్టి బన్నీ మానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఆ రికార్డు అంతటితో ఆగేలా లేదు.  మిగతా సాంగ్స్ కోసం  కూడా అందరు వెయిట్ చేస్తున్నారు. మరి అవి ఎంతటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి  పుష్ప 2  వరల్డ్ వైడ్ గా అగస్ట్ 15 న విడుదల కానుంది.  ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆ రోజు కోసం  వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్న బన్నీ తో జత కట్టగా  ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ లాంటి నటులు  కీలక పాత్రలని పోషిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప పార్ట్ వన్ ని మించి  ఉండేలా తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్  సంగీతాన్ని అందిస్తున్నాడు  
ఇటీవల 'ఫ్యామిలీ స్టార్'తో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).. తన తదుపరి సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత విజయ్ చేయబోయే మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వచ్చింది. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమైన 'రాజా వారు రాణి గారు' చిత్రంతో రవికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2019 లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత కిరణ్ హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే.. రవికిరణ్ మాత్రం ఐదేళ్లు అవుతున్నా దర్శకుడిగా తన రెండో సినిమా చేయలేదు. మధ్యలో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రానికి మాత్రం రచయితగా వ్యవహరించి ఆకట్టుకున్నాడు. అయితే లేట్ గా అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా.. దర్శకుడిగా తన రెండో సినిమాని విజయ్ తో చేస్తున్నాడు. నిజానికి దర్శకుడిగా రవికిరణ్ రెండో సినిమా ప్రకటన గతేడాది సెప్టెంబర్ లోనే వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ సమయంలో ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నాడని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. విజయ్ దేవరకొండ పేరు వచ్చేలా 'VD' అని హింట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.59వ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా మే 9న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ ద్వారా తెలుగు సినీ సీమకి పరిచయం అయ్యాడు. వరుస హిట్లతో మామలకి తగ్గ అల్లుడు అని అనిపించుకున్నాడు. ఇప్పటి వరకు పదహారు సినిమాలో నటించిన తేజ్  టూ డే టాక్ అఫ్ ది డే గా నిలిచాడు  తేజ్ తన మావయ్య పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రచార బాధ్యతలని తీసుకున్నాడు. మే నాలుగున మచిలీపట్నంలో, ఐదున పిఠాపురంలో, ఆరున కాకినాడ లో జనసేన అభ్యర్థుల గెలుపు కోరుతు  ప్రచారం చెయ్యబోతున్నాడు. ఈ మేరకు అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది.సదరు ఏరియాల్లో భారీ ఎత్తున రోడ్ షో లు కూడా నిర్వహించబోతున్నాడు. ఏపి లో పొలిటికల్ హీట్ పెరిగిన నేపధ్యంలో  తేజ్ వార్త  మరింత  పొలిటికల్ హీట్ ని పెంచింది  ఇక  కెరీర్ విషయానికి వస్తే వరుస ప్లాప్ ల తర్వాత విరూపాక్ష తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బ్రో కూడా మంచి  విజయాన్నే  సాధించింది. బ్రో లో  తమ మామ పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం గాంజా శంకర్ అనే ఫుల్ మాస్ మూవీ చేస్తున్నాడు. రామ్ చరణ్ కి  రచ్చ తో బ్లాక్ బస్టర్  హిట్ ఇచ్చిన సంపత్ నంది ఆ మూవీకి దర్శకుడు   
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. మే 13నే పోలింగ్ జరగనుంది. పోలింగ్ కి ఇంకా వారం రోజుల సమయమే ఉండటంతో.. కొందరు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హీరో అక్కినేని నాగార్జున పేరుతో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. "సినిమా వాళ్ళం హైదరాబాద్ లో ఉంటూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదు. నన్ను టీడీపీ తరపున మాట్లాడమని ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడ జగన్ గారి గవర్నమెంట్ బాగానే ఉంది. అందుకే ఇండస్ట్రీ నుండి ఎవరు ముందుకు వచ్చి మాట్లాడడం లేదు." అని నాగార్జున అధికార పార్టీకి అనుకూలంగా కామెంట్స్ చేసినట్లుగా ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. అసలు నాగార్జున ఇలాంటి స్టేట్ మెంటే ఇవ్వలేదు. నాగార్జునపై వస్తున్న రూమర్ పూర్తిగా అవాస్తవం అని ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకుండా ఉండాలని కోరింది.
"ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు" అన్నారు పెద్దలు. "ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి" అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో 'లగ్గం' మూవీని మొదలుపెట్టి, శరవేగంగా నిన్నటి(శుక్రవారం)తో టాకీ పార్ట్ పూర్తి చేశారు. “మన తెలుగు కల్చర్ తో జరిగే పెళ్ళిలలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు  ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలాచేస్తుందని” ప్రొడ్యూసర్ వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు.  "లగ్గం చిత్రంలో అంతర్లీనంగా మనసుకు హత్తుకునే భావోద్వేగాలు  నిండి ఉన్నాయని, ఇది  చక్కటి ప్రేమ కథ చిత్రమని"  రాజేంద్ర ప్రసాద్ అన్నారు.  ఎల్.బి. శ్రీరామ్, రోహిణి, రఘు బాబు గార్ల నటన సినిమా చూసే ప్రేక్షకులని కట్టి పడేస్తుందని, తన స్టైల్ ఆఫ్ మేకింగ్, స్క్రీన్ ప్లే ప్రజంటేషన్ ఇందులో చూడబోతున్నారని దర్శకుడు రమేశ్ చెప్పాల కాన్ఫిడెంట్ గా చెప్పారు. పెళ్ళి, షాదీ, లగ్గం, వివాహం ఎలా  పిలిచినా జంట ఒకటవ్వడమే. ఒక్కో  ప్రాంతంలో ఒక్కోక్క పిలుపు, ఒక్కోక్క ఆచారం. ఈ లగ్గం సినిమా అన్ని వర్గాలను అలరిస్తుంది. తెలుగు సాంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను చిత్రీకరించారని నిర్మాతలు చెబుతున్నారు. చరణ్ అర్జున్ ఈ సినిమా కోసం అద్భుతమైన బాణీలను సమకూర్చారు, 'బేబీ' ఫేమ్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి లగ్గం సినిమాకు అదనపు ఆకర్షణ కానుందని చిత్ర బృందం చెబుతోంది.  సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, రఘుబాబు, కృష్ణుడు, రచ్చ రవి తదితరులు నటిసున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ కల్కికి ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టే.జూన్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీంతో ప్రభాస్ నెక్స్ట్ ఏ మూవీలో చేస్తాడనే  ఆసక్తి అందరిలో ఉంది.ప్రశాంత్ నీల్ సలార్ 2 ,సందీప్ రెడ్డి  స్పిరిట్ లాంటి చిత్రాలు లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు హను రాఘవపూడి సినిమా కూడా ఉంది. వీటిల్లో ముందుగా  షూటింగ్ కి వెళ్లబోయే మూవీ ఏంటో తెలిసింది హను రాఘవపూడి మూవీ జులై నుంచి షూట్ కి వెళ్లబోతుంది. ఈ మేరకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. ప్రేమ ప్రధానంగా సాగే ఒక పీరియాడిక్ సబ్జట్ తో తెరకెక్కబోతుంది.ఈ మేరకు పూర్తి స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది. అలాగే  హీరోయిన్ ఎంపిక కూడా పూర్తయ్యింది. ఒక టాప్ హీరోయిన్ డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. త్వరలోనే మేకర్స్ ఆమె ని అధికారకంగా ప్రకటిస్తారు. ఒక పక్కన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా  జరుగుతున్నాయి. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ  మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది  ఇప్పుడు  సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త ప్రభాస్ అభిమానులని విశేషంగా ఆకరిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఎప్పటినుంచో ప్రభాస్ ఒక లవ్ మూవీ చెయ్యాలని కోరుకుంటున్నారు. వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు వాళ్ళ మైండ్ నుంచి పోవడం లేదు. పైగా ప్రేమ చిత్రాల స్పెషలిస్ట్  హను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటంతో ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడనే  క్యూరియాసిటీ  కూడా వాళ్ళల్లో  ఉంది. ఆయన గత మూవీ సీతారామం ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరకి తెలిసిందే. సో  ప్రభాస్ ప్రేమ ముహూర్తం జులై లో ప్రారంభం కానుంది.   
సినిమా పేరు: బాక్ తారాగణం: సుందర్. సి, తమన్నా, రాశిఖన్నా, కోవై సరళ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు సంగీతం: హిప్ హాప్ తమిజా సినిమాటోగ్రఫీ: కృష్ణస్వామి రచన, దర్శకత్వం: సుందర్. సి విడుదల తేదీ: మే 3, 2024 హారర్ కామెడీ ఫ్రాంచైజ్ 'అరణ్మనై' నుంచి వచ్చిన నాలుగో చిత్రం 'బాక్'. సుందర్. సి ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన ఈ తమిళ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా నటించారు. మే 3న ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ: శివశంకర్(సుందర్. సి) ఓ లాయర్. తన చెల్లి శివాని(తమన్నా) ప్రేమ వివాహం చేసుకొని, పుట్టింటికి దూరమవుతుంది. అయితే కొంతకాలానికి శివాని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పదంగా చనిపోతాడు. తన చెల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని గట్టిగా నమ్మిన శివశంకర్.. ఆ ఇద్దరి మరణాల వెనక కారణాలను తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? అసలు బాక్ అంటే ఏంటి? ఆ దుష్ట శక్తి శివాని కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? చనిపోయాక కూడా శివాని తన పిల్లలని ఎలా కాపాడుకుంది? తన చెల్లి మరణానికి కారణమైన వారిపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఇందులో రాశిఖన్నా పాత్ర ఏంటి? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: కథగా చూసుకుంటే 'బాక్'లో కొత్తదనం లేదు. ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన దుష్ట ఆత్మను హీరో ఎలా అంతమొందించాడు అనేది ఈ కథ. ఈ తరహా కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. గతంలో 'అరణ్మనై' ఫ్రాంచైజ్ లో వచ్చిన సినిమాలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి. అయితే కథలో కొత్తదనం లేనప్పటికీ.. హారర్ కామెడీ జానర్ సినిమాలతో మ్యాజిక్ చేయొచ్చు. ఓ వైపు నవ్విస్తూ, మరోవైపు భయపెడుతూ కథనాన్ని ఆసక్తికరంగా నడపవచ్చు. కానీ 'బాక్' విషయంలో ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. అటు నవ్వించడంలోనూ, ఇటు భయపెట్టడంలోనూ పూర్తిగా సక్సెస్ కాలేదు. అక్కడక్కడా మాత్రమే ఆకట్టుకుంది. శివానిది హత్యా ఆత్మహత్యా అనే విషయాన్ని బయటపెట్టే సన్నివేశాలు, బాక్ నేపథ్యం తెలిపే ఎపిసోడ్ మెప్పించాయి. తమన్నా పోషించిన శివాని పాత్రతో సెంటిమెంట్ బాగానే పండింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. సినిమాకి అవే హైలైట్ గా నిలిచాయి. విజువల్ గా కూడా ఈ సినిమా బాగుంది. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నంతగా ఉంది. కృష్ణ స్వామి కెమెరా పనితనం కట్టిపడేసింది. హిప్ హాప్ తమిజా సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. నటీనటుల పనితీరు: మరణించాక కూడా ఆత్మగా కనిపిస్తూ, పిల్లలను కాపాడుకునే శివాని పాత్రలో తమన్నా చక్కగా ఒదిగిపోయింది. డాక్టర్ మాయగా రాశిఖన్నా ఉన్నంతలో రాణించింది. శివశంకర్ గా సుందర్. సి నటన మెప్పించింది. కోవై సరళ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా.. కథాకథనాల్లో వైవిధ్యం లేదు. కొన్ని నవ్వులు, అక్కడక్కడా భయపెట్టే సన్నివేశాలు, విజువల్స్ కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. రేటింగ్: 2.5/5 
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ అంటే గుర్తుకొచ్చే పేరు సుకుమార్. లాజిక్స్ తో మ్యాజిక్ చేసే ఈ జీనియస్ డైరెక్టర్.. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఇండియన్ టాప్ స్టార్స్ సైతం ఆసక్తి చూపిస్తారు అనడంలో సందేహం లేదు. అయితే సుకుమార్ మాత్రమే కాదు.. ఆయన శిష్యులు సైతం సినీ పరిశ్రమలో దర్శకులుగా సత్తా చాటుతున్నారు. ఇతర టాప్ డైరెక్టర్ల అసిస్టెంట్స్ తో పోలిస్తే.. సుకుమార్ అసిస్టెంట్స్ టాలీవుడ్ లో తమ మార్క్ చూపిస్తున్నారు. 'కరెంట్' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన పల్నాటి సూర్యప్రతాప్.. 'కుమారి 21ఎఫ్', '18 పేజెస్' వంటి చిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. 'ఉప్పెన' వంటి ఘన విజయంతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు.. దర్శకుడిగా తన రెండో సినిమాని ఏకంగా రామ్ చరణ్ తో చేస్తున్నాడు. 'దసరా'తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, హీరో నానికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల.. తన రెండో సినిమాని కూడా నానితోనే చేస్తున్నాడు. 'భమ్ బోలేనాథ్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన కార్తీక్ దండు.. 'విరూపాక్ష'తో ఒక్కసారిగా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని నాగ చైతన్యతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.  ఇలా ఎందరో సుకుమార్ శిష్యులు దర్శకులుగా తమ మార్క్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో అర్జున్ వై.కె అనే మరో దర్శకుడు చేరాడు. ఈయన సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ప్రసన్న వదనం'కి దర్శకత్వం వహించాడు. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారి.. తమ సత్తా చాటుతున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే. డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్షకు చాలా ప్రత్యేకత ఉంది. ఎండుద్రాక్షను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే నానిన ఎండు ద్రాక్షలు తిని ఆ నీటిని తాగడం వల్ల  చాలా ప్రయోజనాలు కలుగుతాయని, మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఎండుద్రాక్షనీరు తాగడం మంచిదని అంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు ఎండు ద్రాక్ష నీరు వేసవి కాలంలో తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. ఎండుద్రాక్షలో ప్రోటీన్, ఫైబర్, ఇనుము, పొటాషియం, రాగి, విటమిన్ B6 మరియు మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.ఎండుద్రాక్ష నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.  టైప్ 2 డయాబెటిస్,  అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలు పెరుగుతాయని,  మెదడు పనితీరు మెరుగుపడుతుందని నమ్ముతారు. ఎండుద్రాక్ష నీరు ఐరన్  లోపం వల్ల కలిగే  రక్తహీనత వంటి పరిస్థితులను నివారిస్తుంది.  అలసట, శ్వాస ఆడకపోవడం, చర్మం సున్నితంగా మారడం, బలహీనత వంటి లక్షణాలు రక్తహీనత ఉన్నవారిలో ఉంటాయి. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఎండుద్రాక్ష నీరు త్రాగడం మంచిది.  ఎందుకంటే ఇది కడుపులోని యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.  ఇది పేగు పనితీరును మెరుగుపరచడంలో,  పేగులోని బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే ఎండుద్రాక్ష నీరు  పొట్ట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎండుద్రాక్ష నీరు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది.  జుట్టు రాలడం సమస్యను నివారిస్తుంది. అందువల్ల జుట్టు రాలే సమస్యతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది.                                             *రూపశ్రీ.
  బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి. బాదంపప్పులో శక్తి, కొవ్వు, ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్,  ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని డైట్‌లో భాగం చేసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే రాత్రి నానబెట్టిన బాదం పప్పులు కనీసం నాలుగైనా తినమని చెబుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బాదం పప్పు తినాలా వద్దా  కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. దీని గురించి ఆహార నిపుణులు కింది విధంగా చెబుతున్నారు. బాదంపప్పును ఏ సీజన్‌లోనైనా తినవచ్చు.  అయితే ఏ సీజన్ అయినా వాటిని నానబెట్టి తినాలి.  అయితే వేసవి కాలంలో పచ్చి బాదం పప్పుులు మాత్రం తినకూడదు. ఇవి కడుపునొప్పికి కారణం అవుతాయి. బాదం పప్పు స్వభావం సహజంగా వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో బాదం పప్పులు తినడం వల్ల పిత్త దోషం సంభవించే అవకాశం ఉంటుంది.  అందుకే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును మాత్రమే తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. రాత్రి నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది.  బాదం పప్పులో ఉండే మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన బాదం పప్పు తింటే శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  బాదం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.   రోజుకు ఎవరు ఎన్ని బాదం పప్పులు తినాలంటే.. 5 నుండి 10 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజూ 2 నుండి 4 బాదం పప్పులు తినవచ్చు.  జీర్ణశక్తి తక్కువగా పిల్లలు కనీసం రెండు కూడా తినలేకపోవచ్చు. కాబట్టి పిల్లల జీర్ణశక్తి సామర్థ్యం ను బట్టి బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు తినడం కొత్తగా మొదలుపెట్టేవారు రోజూ రెండు బాదం పప్పులతో మొదలుపెట్టాలి.  అవి బాగా అలవాటు అయ్యాక వాటి పరిమాణం పెంచుకోవచ్చు. అయితే రోజుకు 8 బాదం పప్పులకు మించి ఎప్పుడూ తినకూడదు.                                                    *నిశ్శబ్ద. 
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక. వంటింట్లో ఉండే ప్రతి మసాలా దినుసు, వంటకు ఉపయోగించే ప్రతి వస్తువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయ్యుంటాయి. వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి దానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక  రెస్టారెంట్లో భోజనానికి వెళితే చివరగా వాళ్లు ఇచ్చే సొంపు  లేదా సోపు కూడా చాలా ఇళ్లలో ఉంటుంది. భోజనం తరువాత పొట్ట సమస్యలు ఏవీ ఉండకూడదని, ఆహారం బాగా జీర్ణం కావాలని సోపు ఇస్తుంటారు. అయితే అది స్వీట్ సోపు.. సాధారణంగా ఇళ్లలో ఉండే ప్లెయిన్ సోపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే దీన్ని ఎప్పుడూ లైట్ తీసుకోరు.. సోపు వంటింటి  దినుసుల మధ్య ఉండే జీలకర్రను పోలి ఉంటుంది.  కానీ దీని సువాసన నుండి రుచి వరకు, ఆరోగ్య ప్రయోజనాల నుండి ధర వరకు అన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఎండలు దంచేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సోపును తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుందని ఆయుర్వేద ఆహార నిపుణులు అంటున్నారు. సోపును వేసవి కాలంలో తీసకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. సాధారణంగా వేసవికాలంలో బయటి వాతావరణం వల్ల శరీరం కూడా వేడెక్కుతుంది. కానీ ఈ వేడిని సోపు నియంత్రిస్తుంది. సోపులో శీతలీకరణ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని శాంతపరచడంతో పాటూ హీట్ స్ట్రోక్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా మెరుగ్గా ఉంటుంది. కేవలం శరీరాన్ని చల్లబరచడం, హీట్ స్ట్రోక్ నుండి రక్షించడమే కాదు.. జీర్ణ లక్షణాలు కూడా సోపులో మెండుగా ఉంటాయి. ఈ కారణంగానే వేసవిలో ఎదురయ్యే జీర్ణ సంబంధ సమస్యలకు సోపు చెక్ పెడుతుంది. సోపును నేరుగా కానీ, సోపును నీటిలో ఉడికించి టీలా కానీ తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సోపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తగ్గించడంలోనూ, బయటకు పంపడంలోనూ సహాయపడతాయి. శరీరాన్ని శుద్ది చేసుకోవాలని అనుకునేవారు సోపు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. సోపు టీని ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.  ఇది శరీరంలోనూ, పొట్ట భాగంలోనూ పేరుకున్న అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది.                                                  *రూపశ్రీ.