political-news-img

జీవన్ రెడ్డి ఆ దుర్మార్గుడితో జతకట్టాడు : సీఎం రేవంత్ రెడ్డి

జగిత్యాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను పంచుకోవాలనే ఉద్దేశంతో మీతో ఈ సమావేశం నిర్వహించానని తెలిపారు.మేము ఎప్పుడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదు. ఆయన మర్యాదను దెబ్బతీసేలా ఎప్పుడూ ఆయన మర్యాదను దెబ్బతీసేలా ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదని రేవంత్ వెల్లడించారు. 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం మనమంతా కృషి చేశాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన్ని కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించాం. అయితే ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనే అభ్యర్థన మేరకు పార్టీ టికెట్ ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి సూచించిన అభ్యర్థులకే టికెట్లు కేటాయించాం. భవిష్యత్తులో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చినా ఆయన వినలేదు. మొండి పట్టుదలతో జీవన్ రెడ్డి పార్టీని వీడారు. 40 ఏళ్లుగా ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను నిరాశపరుస్తూ, కేసీఆర్‌తో కలిశారని ముఖ్యమంత్రి అన్నారు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ వద్ద చేతులు కట్టుకుని నిలబడటం బాధాకరం. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఆయన కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టినట్లైందని.. ఆయన వయస్సుకు, అనుభవానికి ఇది తగినది కాదు. అయినప్పటికీ, ఈనాటికీ ఆయన గౌరవానికి భంగం కలిగేలా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదని ముఖ్యమంత్రి తెలిపారు. మనం కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఆయన వెళ్లి అక్కడ చేరడం బాధాకరం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడటం తప్పా అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. నేను చేస్తున్నది మంచిదా చెడా అన్నది మీరు నిర్ణయించండి. ఎవరు ఏమిటి అన్నది కాలమే తేలుస్తుంది. మీరు అందరూ అండగా నిలవాలి. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి. ధైర్యంగా ఉండండి. త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తాను. మనమంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం. వ్యక్తికంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరినీ అభినందిస్తున్నాని సీఎం రేవంత్ తెలిపారు

Publish Date: Apr 14, 2026 10:47PM

political-news-img

ఔటర్‌ రింగురోడ్డుపై ప్రేమజంటల ప్రమాదకర బైక్ స్టంట్స్

భాగ్యనగర వాసుల జీవనాడి, అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వేదికైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి నిబంధనలు తుంగలో తొక్కారు. అత్యంత భద్రత కలిగిన ఈ రహదారిపై ద్విచక్ర వాహనాల ప్రవేశం నిషిద్ధమని తెలిసినా, ప్రేమజంటలు బరితెగించి బైక్ రైడింగ్‌కు దిగారు. తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి వేళ పోలీస్ అకాడమీ వైపు నుండి పుప్పాలగూడ (నానక్‌రాంగూడ) టోల్ గేట్ వైపు రెండు జంటలు ద్విచక్ర వాహనాలపై యథేచ్ఛగా ప్రయాణించాయి. ఈ క్రమంలో వారు వాహనాలపై విన్యాసాలు చేస్తూ ఇతర ప్రయాణికులను భయాందోళనకు గురిచేశారు. ఈ దృశ్యాలను అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా "దమ్ముంటే పట్టుకోరా షెకావత్" అనే రీతిలో పోలీసులకే సవాల్ విసిరేలా కామెంట్లు రావడంతో అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. వంద కిలోమీటర్ల పైచిలుకు వేగంతో కార్లు, భారీ వాహనాలు ప్రయాణించే ఓఆర్‌ఆర్‌పై ఇలా టూవీలర్లతో ప్రవేశించడం ఆత్మహత్య సదృశ్యమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఘటనపై స్పందించిన నార్సింగి ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా ఆయా వాహనాల నంబర్లను గుర్తించినట్లు సమాచారం. నిబంధనలను అతిక్రమించి రహదారి భద్రతకు విఘాతం కలిగించిన సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, లైసెన్సుల రద్దు దిశగా కూడా ఆలోచిస్తున్నారు. అయితే, ఈ ఘటనలో భద్రతా లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు టూవీలర్లకు అనుమతి లేని ఓఆర్‌ఆర్‌పైకి వారు ఎలా ప్రవేశించగలిగారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఎంట్రీ పాయింట్ల వద్ద ఉండే టోల్ గేట్ సిబ్బంది ఏమరపాటుగా ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన టోల్ గేట్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. సాధారణంగా ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చిన్నపాటి అజాగ్రత్త కూడా భారీ ప్రాణనష్టానికి దారితీస్తుంది. గతంలోనూ ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి ఎంట్రీ పాయింట్ వద్ద నిఘా పెంచాలని, అక్రమంగా ప్రవేశించే వారిపై కఠినంగా వ్యవహరించాలని వాహనదారులు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హైవే పెట్రోలింగ్ బృందాలను అప్రమత్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, సీసీటీవీ కెమెరాల నిఘా ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిని త్వరలోనే పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు నార్సింగి పోలీసులు వెల్లడించారు.

Publish Date: Apr 14, 2026 10:24PM

political-news-img

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు కొరడా ఝళిపించారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుండి భారీగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.మలక్‌పేటలోని కోటక్ మహేంద్ర బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ రేపాలా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 7న బ్యాంక్‌లోని క్యాష్ రీసైక్లర్ మెషీన్‌లో జమ చేసిన నోట్లను పరీక్షించగా 500 ముఖ విలువ కలిగిన 10 నకిలీ నోట్లను గుర్తించారు. UV లైట్ పరీక్షలు, నోట్ల స్కానింగ్ యంత్రాలు కూడా అదే విషయాన్ని నిర్ధారించడంతో వెంటనే బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంక్ ట్రాన్సాక్షన్లను పరిశీలించగా, ఈ నకిలీ నోట్లను మార్చి 27న చంద్రాయణగుట్ట హఫీజ్ బాబా నగర్‌కు చెందిన అహ్మద్ పాషా(33) అనే వ్యక్తి ఖాతాలో జమ చేసినట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే అహ్మద్ పాషా ను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వృత్తిరీత్యా కసాయిగా పని చేసే అహ్మద్ పాషా, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి నుంచి నకిలీ కరెన్సీ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అసలు డబ్బుగా చలామణి చేయాలనే ఉద్దేశంతో షాద్‌నగర్ వద్ద మొత్తం 94,000 విలువైన నకిలీ నోట్లను సేకరించినట్లు వెల్లడించాడు. అందులో రూ. 5,000 బ్యాంకులో జమ చేయగా, మిగిలిన 89,000 విలువైన 178 నకిలీ నోట్లు అతడి ఇంటి వద్దే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపైu/s179,318(4)BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాల ప్రకారం ఈ నకిలీ కరెన్సీ సరఫరా గుజరాత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించినట్లుగా తేలింది. ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నగరంలో నకిలీ కరెన్సీ చలామణి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Publish Date: Apr 14, 2026 10:02PM

political-news-img

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మంత్రి లోకేష్

- ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయ సాధనే మన మార్గం - పార్టీ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి టీడీపీ బలోపేతానికి కృషి చేయండి "కాఫీ కబుర్లు" కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్చార్జిల‌కు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జుల‌ శిక్షణ తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలుగుజాతి విశ్వఖ్యాతి అంటే గుర్తుకు వచ్చేది అన్న ఎన్టీఆర్. తెలుగు జాతి శక్తి ఏంటో ప్రపంచానికి చూపించిన వ్యక్తి చంద్రబాబు. వీరిద్దరూ బలమైన సిద్ధాంతాలతోనే విజయం సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని నేతలకు మంత్రి సూచించారు. సిద్ధాంతాలే నాయకత్వానికి బలం “ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరించడం అత్యంత కీలకం. కార్యకర్తల మధ్య ఐక్యత, క్రమశిక్షణ ఉంటేనే పార్టీ మరింత బలపడుతుంది. సిద్ధాంతాలపై ఆధారపడి ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటేనే దీర్ఘకాలిక రాజకీయ విజయాలు సాధ్యమవుతాయి. సిద్ధాంతపరంగా ఎదిగిన నాయకత్వమే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది” అని మంత్రి తెలిపారు. ఆరు ముఖ్య సిద్ధాంతాలు గ్రామ‌స్థాయికి తీసుకెళ్లాలి “ఎన్ని ప‌నులున్నా సీఎం , నేను ప్రతి వారం ఏదో ఒక‌ ఒక రోజు పార్టీ కార్యాలయంలో గడుపుతూ ప్రజా సమస్యలను వింటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రత్యేక సమయం కేటాయించాలి. పార్టీ ప్రవేశపెట్టిన ఆరు ముఖ్య సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించాలి” అని సూచించారు. పార్టీతో కార్య‌క‌ర్త‌ల‌ను అనుసంధానం చేసేది మై టీడీపీ యాప్ “ప్రతి బూత్, క్లస్టర్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం అత్య‌వ‌స‌రం. రాజకీయాల్లో కొత్త త‌రాన్ని ప్రోత్సహిస్తూ, సిద్ధాంతపరంగా శిక్షణ పొందిన నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. “మై టీడీపీ” యాప్ ద్వారా కార్యకర్తలు తమ కార్యకలాపాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ప్రతి ఒక్కరి పనితీరును పార్టీ అధినేత పర్యవేక్షిస్తున్నారు. వ్య‌క్తిగ‌త ప‌నులు పూర్తిచేసుకుని కొంత స‌మ‌యం కేటాయించి క్షేత్ర‌స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేయండి. సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించండి. కష్టపడిన వారికి తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది” అని హామీ ఇచ్చారు. రెడ్ బుక్ స‌మాజ బాగు కోసం..రాజారెడ్డి రాజ్యాంగంతోఈ విధ్వంసం “గతంలో దేవాలయంలాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపై, నాయకులపై వైసీపీ నాయకులు దాడులు చేశారు. కార్య‌క‌ర్త‌ల‌ను హింసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దమనకాండకు పాల్ప‌డ్డారు. అమర్నాథ్ గౌడ్‌, అబ్దుల్ సలాం, తోట చంద్రయ్యల‌ను వెంటాడి మ‌రీ చంపారు. డా.సుధాకర్‌, కోడెల శివప్రసాద్, మిస్బా అనే చిన్నారిల‌ను వేధించి మ‌ర‌ణానికి కార‌కుల‌య్యారు. అధికారంలో ఉన్న‌ప్పుడు విధ్వంసం-దాడులు-హ‌త్య‌లు-అవినీతితో చెల‌రేగిపోయిన జ‌గ‌న్..అధికారం పోయాక కూట‌మి ప్ర‌భుత్వంపై విష‌ప్ర‌చారాల‌తో విరుచుకుప‌డుతున్నాడు. ఐక‌మ‌త్యంగా పోరాట స్ఫూర్తితో వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వ‌చ్చే ఫేక్ స‌మాచారాన్ని తిప్పికొట్టండి. నా రెడ్ బుక్‌ సమాజ బాగు కోసం అయితే, రాజారెడ్డి రాజ్యాంగంతో జ‌గ‌న్‌ సమాజాన్ని నాశ‌నం చేయాల‌నుకున్నాడు. ఏ ఆత్మ చెప్పిందో కానీ మావిగ‌న్ అంటూ క‌ల‌వ‌రిస్తున్నాడు జ‌గ‌న్‌. `` నేతల మధ్య సఖ్యత ముఖ్యం “రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే అమరావతికి చట్టబద్ధత వచ్చింది, విశాఖ ఉక్కు పరిరక్షణ జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక నిధుల సాధన వంటి విజయాలు సాధ్యమవుతున్నాయి. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయాలి. కుటుంబంలా ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య కలహాలు వస్తే అంతా క‌లిసి కూర్చుని మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకున్న‌ట్టే, కూట‌మి నేత‌లు కుటుంబంలా కూర్చొని చ‌ర్చించుకుని విభేదాలు విడ‌నాడ‌లి`` అని సూచించారు.

Publish Date: Apr 14, 2026 9:24PM

political-news-img

దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ

నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఏకాభిప్రాయ సాధన ద్వారానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం కలిగించే అంశమైనందున బాధ్యతతో అత్యవసరంగా ఈ లేఖ రాసినట్లు తెలిపారు. ప్రస్తుతం మహిళల రిజర్వేషన్, పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను ఒకదానితో ఒకటి ముడి పెట్టి ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారని, అవి పూర్తిగా వేర్వేరు విషయాలని స్పష్టం చేశారు. మహిళల రిజర్వేషన్ బిల్లుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లలోనే 33 శాతం మహిళల రిజర్వేషన్‌ను యథాతథంగా వెంటనే అమలు చేయాలని, అన్ని రాష్ట్ర అసెంబ్లీల్లో కూడా అమలు చేయాలని కోరారు. మహిళల రాజకీయ సాధికారత కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యానికి ఒక నైతిక అవసరమని పేర్కొన్నారు. పునర్విభజనకు సంబంధించి గతంలో కూడా సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మార్చుతూ డిలిమిటేషన్ నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్టవచ్చని తెలిపారు. లోక్‌సభ సీట్లను 850కు పెంచే ప్రతిపాదన అసలైన వివాదాస్పద అంశమని పేర్కొన్నారు. ప్రస్తుత సీట్లను పెంచి వాటిని ప్రోరాటా పద్ధతిలో కేటాయించే ఆలోచనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రిజర్వేషన్‌కు పూర్తి మద్దతు ఇవ్వటంతో పాటు, సీట్ల సంఖ్య పెంపు లేకుండా డిలిమిటేషన్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. జనాభా లేదా ప్రోరాటా పద్ధతిలో లోక్‌సభ సీట్ల పెంపు ప్రతిపాదనను అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించబోవని తెలిపారు. ప్రోరాటా పద్ధతిలో అమలు చేస్తే దేశంలో తలెత్తబోయే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 1970ల నుంచి దేశం జనాభా నియంత్రణ విధానంపై దృష్టి పెట్టినప్పటికీ, రాష్ట్రాల వారీగా జనాభా నియంత్రణ అమలు జరిగిన తీరు భిన్నంగా ఉందన్నారు. జనాభాలో తేడాల వల్ల జాతీయ ఐక్యతపై ప్రభావం పడే ప్రమాదాన్ని గుర్తించి, ఇందిరా గాంధీ, అటల్ బిహారి వాజ్‌పేయి వంటి నాయకులు ఈ అంశాన్ని ఒక్కోసారి 25 సంవత్సరాల పాటు వాయిదా వేసినట్లు తెలిపారు. ఆర్థిక సహకారం, సామాజిక, మానవ అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రోరాటా పద్ధతిలో సీట్ల పెంపు చేస్తే దేశ ఫెడరల్ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అన్ని ప్రాంతాల సమాన ప్రాతినిథ్యం దేశానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. సీట్ల పెంపుతో దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని కేంద్రం పూర్తిగా విశ్లేషించలేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు దశాబ్దాలుగా జనాభా స్థిరీకరణ, ఆరోగ్యం, మానవ అభివృద్ధి రంగాల్లో కృషి చేశాయని తెలిపారు. ఇవన్నీ జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రతిపాదనతో ఈ రాష్ట్రాలన్నీ నిర్మాణాత్మకంగా నష్టపోతాయని, రాజకీయంగా బలహీనపడే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ప్రోరాటా మోడల్ కేవలం గణాంకాల మార్పుగా కాకుండా, రాజకీయ అసమతుల్యతకు దారి తీస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీలో ఇప్పటికే పక్షపాతం, వివక్ష ఉన్నట్లు తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎక్కువ నిధులు పొందుతుంటే, తెలంగాణకు తక్కువ నిధులు వస్తున్నాయని ఉదాహరణగా చెప్పారు. ఇది దక్షిణాది-ఉత్తరాది అసమానతకు సంకేతమని పేర్కొన్నారు. నిధుల వివక్షకు అదనంగా ఇప్పుడు సీట్ల పెంపు కారణంగా రాజకీయంగా అన్యాయం జరుగుతుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరించినప్పటికీ, పార్లమెంట్‌లో వారి ప్రాధాన్యం తగ్గిపోతుందని, జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది-మధ్య ప్రాంత రాష్ట్రాలు లాభపడతాయని తెలిపారు. అభివృద్ధిలో పాలుపంచుకున్న రాష్ట్రాలకు శిక్ష పడుతుందని, జనాభా పెరిగిన రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది అంకెల విషయం కాదని, దేశ సమగ్రత, సమానత్వం, న్యాయానికి సంబంధించిన ప్రాథమిక అంశమని స్పష్టం చేశారు. దక్షిణ రాష్ట్రాలు జాతీయ ఆదాయానికి నిరంతరం సహకరిస్తూ, సుపరిపాలన, అభివృద్ధి ప్రమాణాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ కృషిని పట్టించుకోకుండా దేశ ఐక్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.ప్రోరాటా మోడల్‌ను దక్షిణ రాష్ట్రాలు అంగీకరించవని, ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నమవుతుందన్నారు. అందరికీ న్యాయం జరిగేలా ఒక స్థిరమైన పరిష్కారం అవసరమని సూచించారు. హైబ్రిడ్ మోడల్‌ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. అందరి ప్రాతినిధ్యంతో పాటు అన్ని రాష్ట్రాల సహకారాన్ని ఈ మోడల్ సమతుల్యం చేస్తుందని వివరించారు. సుప్రీంకోర్టు సూచించిన 50 శాతం– 50 శాతం విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.హైబ్రిడ్ మోడల్ ప్రకారం, కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ప్రోరాటా పద్ధతిలో, మిగతా సగాన్ని రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం (GSDP), అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు. స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా, మన ఆలోచనలకు తలుపులు తెరిచి కొత్త భావనలు స్వీకరిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థ మరియు ప్రక్రియ అందరికీ న్యాయంగా, ఆమోదయోగ్యంగా ఉండే ఉత్తమ పరిష్కారాన్ని కనుగొంటుందని పేర్కొన్నారు. హైబ్రిడ్ మోడల్ ద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండటంతో పాటు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందన్నారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, అన్ని రాష్ట్రాలు మరియు రాజకీయ పార్టీలతో కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. భారతదేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని, ఇలాంటి కీలక నిర్ణయాలు ఆ ఏకత్వాన్ని బలోపేతం చేసేలా ఉండాలని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ న్యాయం చేసే పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు

Publish Date: Apr 14, 2026 9:08PM

political-news-img

ఇకపై లోక్ సభలో 850 స్థానాలు

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్దమైంది. ఈ నెల 16 రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దానిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంపీలకు సమాచారం ఇచ్చి, బిల్లు ప్రతులను వారికి పంపింది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాల్లో 815 వరకు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు లోక్‌సభ స్థానాలు పెరగనున్నాయి. అంటే లోక్‌సభ స్థానాలు 543 నుంచి 850కి పెరుగుతాయని తెలుస్తోంది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని చూస్తోంది.సీట్ల పెంపుతో దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. జనగణన తర్వాత అందలో వచ్చిన లెక్కల ఆధారంగా సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశముందని దక్షిణాది రాష్ట్రాలు ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాంతో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వల్ల అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతధంగా కొనసాగే అవకాశం ఉంటుందంటున్నారు.

Publish Date: Apr 14, 2026 8:03PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img