రెండురాష్ట్రాల నీటి సమస్య తీర్చిన పోలీసులు?

posted on: Aug 21, 2012 8:54AM

కర్నాటక రైతులు బరి తెగించి నీటిని మళ్లించుకోవటం కోసం మూసేసిన షట్టర్లను పోలీసులు తెరిపించటంతో తుంగభద్ర నీటిపై ఆధారపడిన ఆంధ్రారైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్నాటక ఆంధ్రా సరిహద్దుల్లో తుంగభద్ర నదిపై నిర్మించిన ఎల్‌ఎల్‌సి 33వ డిస్ట్రిబ్యూషన్‌ ఛానల్‌ ఆరు షట్టరు గేట్లలో ఐదింటిని కర్నాటక రైతులు మూసేసి నీటిని మళ్లించు కుంటున్నారు. దీని వల్ల ఇదే నీటిపై ఆధారపడిన ఆంధ్రా రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. దీంతో రెండు రాష్ట్రాల రైతులు నిత్యం గొడవపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ నీటి కోసం ఎదురుచూస్తున్న మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, కోడుమూరు నియోజకవర్గాల రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగారు. ప్రభుత్వయంత్రాంగంపై వీరు సమరభేరిని మోగించారు. తమకు జరుగుతున్న అన్యాయం గురించి కర్నాటక రైతులను నిలదీసేవారే కరువయ్యారని వాపోయారు. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఆ ఆయకట్టులో నీరు లేకపోతే తమ కుటుంబాలు వీధిన పడతాయని నిరసనల్లో స్వరం పెంచారు. దీంతో దిగివచ్చిన యంత్రాంగం పోలీసులను రంగంలోకి దింపింది. వారు నేరుగా ఛానల్‌ వద్దకు వెళ్లి ఐదుగేట్లు తెరిపించారు. దీంతో నీరు ఆంధ్రాప్రాంతంలోకి రావటం ఆరంభమైంది. ఆంధ్రారైతులు పోలీసులు షట్టర్లు ఎత్తివేసినందుకు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ నీరు పూర్తిగా కాలువల్లోకి ప్రవహిస్తే సాగుకు ఉపక్రమించాలని రైతులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...