రైతును చెప్పుతో కొట్టి.. ఏంట్రా నా కొడకా అని తిట్టి.. ఎమ్మెల్యే వీరంగం

posted on: Jan 8, 2022 11:15AM

అతనో అధికార పార్టీ ఎమ్మెల్యే. ప్రజలకు అండగా నిలవాల్సిన గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు. కాని అతనే సాయం కోసం వచ్చిన వాళ్లపై తిరగబడ్డాడు. నానా బూతులు తిడుతూ వీరంగం వేశాడు. రైతుపై తన కాలి చెప్పుతో దాడికి ప్రయత్నించి.. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే. రైతుపై ఎమ్మెల్యే దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 

గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు మొదటి నుంచి నోటి దురుసు నేతగా పేరుంది. ఆయనో  మరో రచ్చ చేశారు. వరికి గిట్టుబాటు ధర లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా కొనడం లేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి వచ్చిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల ఎదుట వాపోయారు. అయితే అక్కడే ఉన్న  స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రెచ్చిపోయారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ ఎదుటే తన కాలుకున్న చెప్పును తీసి రైతును కొట్టే ప్రయత్నం చేశారు. అయితే సదరు రైతు ధైర్యంగా ఎదురుతిరిగాడు. దీంతో ఎమ్మెల్యే ఆయనను లాక్‌పలో వేయించి వేధింపులకు గురి చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో వైసీపీకి చెందిన ఓ నేత కుటుంబ సభ్యుడు చనిపోయారు. దీంతో ఈ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు, రైతు గడిపూడి నరేంద్ర వరి రైతుల ఇబ్బందులను ఎంపీకి విన్నవించారు. రైతు భరోసా కేంద్రాల్లో రూ.1,450 ధర కల్పించినా కొనడం లేదని ఎంపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీ ఫోన్‌లో జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే ఆయన వ్యవసాయ శాఖ అధికారులను అక్కడికి పంపించారు. ఎంపీ వారితో మాట్లాడి రెండు రోజుల్లో ఆర్‌బీకే ద్వారా ఆ గ్రామంలో వరిని కొనుగోలు చేస్తామని అధికారుల చేత చెప్పించారు. అయితే అదే సమయంలో రైతు నరేంద్ర మాట్లాడుతూ.. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి డబ్బులు ఇస్తామనే భరోసా ఎవరు ఇస్తారని ఎంపీని ప్రశ్నించారు. 

ఈ సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే బొల్లా ఒక్క ఉదుటన లేచి ‘ఎంట్రా... నా.. కొడకా నీకు భరోసా ఇచ్చేది’ అంటూ తన కాలి చెప్పును తీసుకొని నరేంద్రను కొట్టేందుకు దూసుకువెళ్లారు. అయితే, నరేంద్ర కూడా ఎదురు తిరిగి ‘‘మేమూ కొట్టగలం’’ అనడంతో ఎమ్మెల్యే పోలీసులను పిలిపించి రైతును లాక్‌పలో వేయించారు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా శుక్రవారం రాత్రి వరకు కూడా రైతును పోలీసులు విడిచిపెట్టలేదని తెలిసింది. ఈ ఘర్షణను అక్కడున్నవారు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించే ప్రయత్నం చేయగా, వారి నుంచి ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా ఫోన్లు లాక్కొని వాటిని డిలీట్‌ చేసినట్లు సమాచారం. 

google-ad-img
    Related Sigment News
    • Loading...