ప్రచారం కోసం అతి తెలివి ప్రదర్శన

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకున్న అతి తెలివితేటల్ని చాలా తెలివిగా ప్రదర్శిస్తోంది. ఎన్నికల ప్రచార గడువు ముగిసినా ఇంకా కక్కూర్తితో ప్రచారం చేయాలని ప్రయత్నిస్తోంది. డబ్బు, మద్యం పంపిణీతో సరిపోదన్నట్టు ఏకంగా పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రంలోనే ప్రచారం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రంలో ఈరోజు ఉదయం నుంచీ వైకాపా గుర్తు అయిన ఫ్యాన్ ముద్రించి వున్న కప్పులతో టీ పంపిణీ జరుగుతోంది. పోలింగ్ కేంద్రం సమీపంలోనే వున్న ఎచ్చెర్ల శివానీ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంటిన్ నుంచి ఈ టీ కప్పులు సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని కప్పుల మీద ఫ్యాన్ గుర్తు వుంటే, మరికొన్ని కప్పుల మీద వైకాపా తరఫున ఎస్.కోట, బొబ్బిలి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫొటోలు ముద్రించి వున్నాయి. వైకాపా చేస్తున్న ఈ చీప్ ట్రిక్స్ ని చూసి పోలింగ్ సిబ్బంది నోరు తెరిచారు.