వారు పాపులు కారు: విజయమ్మ

 

ఈ రోజు హైదరాబాదులోజరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఆయన అనుచరులు తమ పరిధిని దాటి మాట్లాడుతున్నారని అన్నారు. తన కూతురు షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ లపై లేనిపోని అభాండాలు వేస్తూ వారి పరువు బజారు కీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తన కూతురు, అల్లుడు ఈ పాపమూ చేయలేదని ఆమె అన్నారు. తెలంగాణాలో ఎక్కడా కూడా తన అల్లుడు చర్చిలు నిర్మించేందుకు ఎటువంటి భూములు కొనుగోలు చేయలేదని, రక్షణ స్టీల్స్, రక్షణ టీవీ చానల్ కు తన అల్లుడు అనిల్ కుమార్ కు ఎటువంటి సంబందం లేకపోయినా, వాటితో తమను ముడిపెట్టి తమపై చంద్రబాబు బురద జల్లుతున్నారని ఆమె ఆరోపించారు.


 

అయితే, తమ సహనానికి ఒక హద్దు ఉంటుందని, ఈ విధంగా నిరంతరం బురద జల్లుతుంటే త్వరలోనే చంద్రబాబుపై పరువు నష్టం దావా వేయక తప్పదని ఆమె హెచ్చరించారు. కానీ, ఇప్పటికే అనేక కేసులతో సతమతమవుతున్న ఆమె కుటుంబ సభ్యులు మళ్ళీ మరో కొత్తకేసు మొదలు పెట్టే దైర్యం చేయరనే ధీమాతోనే తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లయితే, ఒకవేళ ఆమె నిజంగా పరువు నష్టం దావా వేసినట్లయితే అప్పుడు వారు కూడా ఇబ్బందుల్లో పడకతప్పదు. గనుక, చంద్రబాబుతో సహా ఆ పార్టీలో అందరూ కూడా వారు చేస్తున్న ఆరోపణలలో నిజానిజాలు తెలుసుకొన్న తరువాతనే చేయడం మేలు. లేకుంటే ‘ఉభయ కుశులోపరి’ అన్నట్లు అటు వైయస్సార్ కాంగ్రెస్ ఇటు తెదేపా అందరూ కూడా తమ పాదయాత్రలు పక్కన పెట్టి కోర్టు యాత్రలు మొదలు పెట్టవలసి వస్తుంది.