Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ కూడా లాలూప్రసాద్లా జైలుకే వెళ్తాడు
posted on: Dec 3, 2018 9:12AM

అనంతపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసైనికులతో కవాతు నిర్వహించారు. గుత్తి రోడ్డులోని మార్కెట్యార్డు నుంచి సప్తగిరి సర్కిల్ వరకు యువతతో భారీ ర్యాలీగా వెళ్లారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ప్రధానంగా టీడీపీ, వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సీఎం కావాలని తానెప్పుడూ కలలు కనలేదన్నారు. రాజ్యాంగం తనకు ఆ అవకాశం కల్పించే సమయమొచ్చిందని చెప్పారు. జగన్ తనకు శత్రువూ కాదని, సీఎం చంద్రబాబు మిత్రుడూ కాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మనల్ని ఏ కులమో, ఏ మతమో అని చూడకుండా ఆంధ్రులుగా చూసి తెలంగాణ నుంచి తన్ని తరిమేశారని అన్నారు. ఏపీ ప్రజలను తెలంగాణ నాయకులు దోపిడీదారులుగా చిత్రీకరించారన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు ఎన్నికల పనిమీద హైదరాబాద్లో ఉన్నారని, పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి రావాల్సిన కర్మ ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. ఇవన్నీ ప్రశ్నించాల్సిన జగన్ ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ నేరాలు చేశాడు. ఎప్పటికైనా లాలూప్రసాద్ యాదవ్లా జైలుకే వెళ్తాడు అని విమర్శించారు.
అప్పట్లో చంద్రబాబు జనసేన సాయం అడిగారు. నేనేమీ ఆశించకుండా సహకరించా. రాష్ట్రాన్ని అవినీతిరహితంగా ఉంచాలని ఆయన్ను కోరా. నోట్లో వెన్నముద్ద పెట్టినా కొరకలేడని చెప్పే మంత్రి లోకేష్ రాష్ట్రంలో ఇసుకను మింగేశారు. 2016లో అమరావతి రాజధాని నిర్మాణానికి భూముల కోల్పోతున్న రైతుల తరఫున చంద్రబాబును కలిసి భూసేకరణను ఆపాలని కోరాను. అప్పట్లో రెడ్డి సామాజిక వర్గ రైతులకు జగన్ గుర్తుకు రాలేదు. పవన్ గుర్తుకొచ్చాడు. మళ్లీ ఇప్పుడు భూసేకరణ ప్రక్రియ సాగిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు నా వద్ద ఆధారాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అధికారంలోకి రావు. 2019 నుంచీ 2021 వరకూ సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి. యుద్ధానికి యువత సన్నద్ధంగా ఉండాలి అన్నారు.
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నా గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. విజయనగరం వచ్చి ఆయన సంగతి తేలుస్తా. నేనేమంత మంచివాడిని కాదు అని హెచ్చరించారు. పవన్ బీజేపీకి వత్తాసు పలుకుతున్నాడని చంద్రబాబు, లోకేష్ అంటున్నారు. నేనెప్పుడూ బీజేపీకి, మోదీకి భయపడను. ఆయన మహా అయితే కేసులు పెట్టి జైల్లో పెడతారు. మోదీ అంటే జగన్తోపాటు చంద్రబాబు, లోకేష్ కూ భయమే. వారంతా పాత దొంగలు. అందుకే భయపడుతున్నారు అని విమర్శించారు. రాష్ట్రంలో ముగ్గురే నాయకులున్నారు. వారిలో అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోయిన జగన్ ఒకరయితే మళ్లీ తనకు అధికారం ఇవ్వాలని అడిగే చంద్రబాబు మరొకరు. ఓట్లు వేయకపోయినా ప్రజలకు అండగా ఉంటానని చెప్పే పవన్ ఇంకొకరు. పంచాయతీ ప్రెసిడెంటు కూడా కాకుండా కొందరు సీఎం కావాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోయకపోతే మాది జనసేన పార్టీయే కాదు. జనసేన అధికారంలోకి వస్తే విదేశీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పరుగెత్తుకొస్తారు. సీఎం, లోకేష్ మాదిరిగా నేను లంచాలడగను అని పవన్ విమర్శించారు.






