జగన్ కంచుకోటలో తెదెపా విజయం
posted on Aug 1, 2013 11:18AM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచు కోటలో టిడిపి పార్టీ విజయజెండా ఎగురవేసింది. వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీ వేంపల్లెలో టిడిపి పార్టీ విజయం సాధించింది. కడప పులివెందులలో జగన్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీలో టిడిపి మద్దతుదారు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు.
వైఎస్ఆర్. కాంగ్రెస్ మద్దతుదారుడు రవి కుమార్ 2076 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారు వేంపల్లెలో గత రెండుమూడు దశాబ్దాలుగా వైయస్ కుటుంబం అనుచరులే గెలుస్తూ వస్తున్నారు. టిడిపి మద్దతుదారుగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి శాసన మండలి సభ్యుడు సతీష్ రెడ్డికి సోదరుడు.