కథ… స్క్రీన్ ప్లే… దర్శకత్వం .. దాసరిదేనట..
posted on: Feb 10, 2016 3:25PM

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఎలాగొలా సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ అధికారులు ఆయన డిమాండ్లకు ఒప్పుకోవడంతో ముద్రగడ కూడ దీక్ష విరమించేశారు. ఇక ఈవ్యవహారం సద్దుమణిగిపోయింది. అయితే ఇప్పుడు ముద్రగడ దీక్షతో రాజకీయాలు చేద్దామనుకున్న నేతలకు మాత్రం ఆఖరికి మిగిలింది సున్నా.. పైగా వారి అటు ఇటు కాకుండా అయిపోయింది వారి పరిస్థితి. ఇంతకీ ఆ వారు ఎవరనేది ఇప్పటికే పూర్తిగా అర్ధమై ఉంటుంది. ఇంకెవరూ వైసీపీ పార్టీ నేతలు.
ఏదో ఇప్పుడు ముద్రగడ దీక్ష విరమించడంతో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది కానీ.. దీనికి వేయాల్సిన స్కెచ్ ముందే వేశారంట వైసీపీ అధినేత జగన్ అండ్ బ్యాచ్. అయితే కథ… స్క్రీన్ ప్లే… దర్శకత్వం మాత్రం దాసరిదేనని అంటున్నారు రాజకీయ వర్గాలు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న దాసరిని జగన్ కలవడంతో ఆయన కదిలిపోయి.. జగన్ తో కలిసి కాపులకి నేనే ఐకాన్ అంటూ ఆయన రంగంలోకి దిగేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. దీనిలో భాగంగానే దీక్ష చేస్తున్నప్పుడు ముద్రగడకు మద్దతు తెలపడానికి కిర్లంపూడిలోకి ఆయన నివాసానికి రావడానికి కూడా బయల్దేరారు. కానీ పోలీసులు మాత్రం ఆయనను రానివ్వకుండా అక్కడే ఆపేశారు. దీనికి గాను దాసరి ప్రభుత్వంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
మరోవైపు జగన్ ఎలాగూ అటు సీమలో ప్రత్యేక నిప్పు పెట్టే ప్రయత్నాలు ఎలాగూ చేస్తున్నాం.. ఇటు కోస్తాలో కాపు రచ్చ రగిల్చి వాడుకోవాలి అనుకున్నారు. అందుకనే దీక్ష చేపట్టిన ఆందోళన కారుల దగ్గరకు తమ నేతలను పంపించి మరీ మద్దతు తెలిపారు. అలా కాపులకు మద్దతు తెలిపి టీడీపీని ఇరకాటంలో పెట్టాలని చూసింది. కానీ ముద్రగడ దీక్ష విరమించేసరికి సీన్ రివర్స్ అయింది. మరోవైపు కాపు దీక్షకు ఓపెన్ గా మద్దతు తెలపడంతో బీసీ సంఘాలనుండి వ్యతరేక భావం ఏర్పడిందని.. బిసిలకు దూరం కావాల్సి వచ్చిందని వైసిపి నేతలు వాపోతున్నారు. దీంతో వైకాపా పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. మరి ఇప్పుడు బీసీ సంఘాల ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో బీసీ సంఘాలకు సపోర్ట్ చేసి వారి నుండి బలాన్ని పొందుతారో లేదో చూడాలి.




.jpg)


