ఆరోపణలు చేసి పారిపోయిన విపక్ష నేతను సభకు పిలిపించాలి.. నారా లోకేష్

posted on: Feb 13, 2026 12:08PM

వైసీపీ అబద్ధాలు చెప్పి, అబద్ధపు ఆరోపణలు చేసి వాకౌట్ చేస్తోందనీ, ఆ పార్టీకి అబద్ధాలు చెప్పడం తప్ప నిజం వినే ధైర్యం లేదనీ లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇంటర్ విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా వాకౌట్ అంటూ వైసీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. విద్యపై దృష్టి పెట్టడం లేదని వైసీపీ అంటోందనీ,   ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 70వేల మంది విద్యార్థులు పెరిగారు. అదీ ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి అన్నారు లోకేష్.

వైసీపీ ఐదేళ్ల  హయాంలో కనీసం పుస్తకాలు, బ్యాగ్స్ ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనం రద్దు చేసి వెళ్లిపోయారు. అటువంటి వైసీపీకి ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటర్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్దరించామనీ,  పుస్తకాలు ఇస్తున్నామనీ చెప్పారు. టెన్త్ , ఇంటర్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు.  వాకౌట్ అంటూ ఈ తలుపు నుంచి వెళ్లి,  టీ తాగి ఆ తలుపు నుంచి వస్తారంటూ ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.  సమస్యలు లేవని మేం చెప్పడం లేదు, ఉన్నవాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నామని నారా లోకేష్ అన్నారు.

మేం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పరదాలు కట్టుకుని తిరిగారన్న లోకేష్.. అప్పట్లో సీఎం అసెంబ్లీకి వస్తుంటే 3 వేల మంది పోలీసులు రోడ్లపై ఉండేవారనీ, ఇప్పుడు సీఎం చంద్రబాబు అసెంబ్లీకి  వస్తుంటే ప్రజలు నవ్వుతూ చేతులు ఊపుతున్నారన్నారు.  ఇప్పుడు జనం ప్రశాంతంగా, హాయిగా తిరుగుతున్నారన్నారు.  ఆరోపణలు చేసి పారిపోయిన విపక్ష నేతను సభకు పిలిపించాలని డిమాండ్ చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...