వంగవీటి రాధాతో మంత్రాంగం.. వదిలేది లే.. తగ్గేదే లే అంటున్న సుబ్బారావు గుప్తా

posted on: Jan 6, 2022 9:59AM

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అంటే అభిమానం.. ఆయన తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటే ఇంకాస్తా అభిమానం. ఆ అభిమానమే.. సొమిశెట్టి సుబ్బారావు గుప్తాను కొలుకోలేని దెబ్బ తీసిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ బాగుంటే.. తామంతా బాగుంటామనే ఓ చిన్న ఆశ... ఆ క్రమంలోనే జగన్ పార్టీ బాగు కోసం నాలుగు మంచి మాటలు చెప్పడమే తప్పు అయిందనే భావనలో సుబ్బారావు గుప్తా కురుకుపోయారని వారు పేర్కొంటున్నారు. ఆ క్రమంలో గుప్తా ఆత్మాభిమానం బాగా దెబ్బతిందని వారు చెబుతున్నారు. 

తాజాగా స్వర్గీయ వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాతో సుబ్బారావు గుప్తా భేటీ కావాడం... ఈ సందర్భంగా వారిరువురి మధ్య పలు అంశాలు చర్చకు రావడం... ఆ క్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్బంగా తాను మాట్లాడిన అంశాలు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను సైతం వంగవీటి రాధకు సుబ్బారావు గుప్తా ఈ  సందర్బంగా వివరించినట్లు తెలుస్తోంది. 

ఆ తర్వాత సుబ్బారావు గుప్తా ఆధ్వర్యంలో విజయవాడలో ఆర్య వైశ్య ఐక్యత సభ నిర్వహించారని.. ఈ సభకు రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన ఆర్య వైశ్య నేతలంతా హాజరయ్యారని సమాచారం. ఈ సందర్భంగా సుబ్బారావు గుప్తా.. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఒంగోలులో చోట రాజన్, డీ గ్యాంగులు దిగాయని... పద్దతి మార్చుకోవాలంటూ సదరు పార్టీ నేతలకు ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని... అలాగే తనకు ముఖ్యమంత్రి వైయస జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని.. కానీ తనపై దాడి చేసిన వారిని శిక్షించకుండా.. వారితో తనకు క్షమాపణలు చెప్పించకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను తాను కలిసేదే లేదని సుబ్బారావు గుప్తా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా తనపై రాజకీయ, భౌతిక దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈ సందర్భంగా సుబ్బారావు గుప్తా ప్రకటించారని.. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. తనపై దాడి చేసిన వారిని.. పోలీసులు అరెస్ట్ పేరుతో రాచమర్యాదలు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారంటూ తన సన్నిహితుల వద్ద సుబ్బారావు గుప్తా వాపోయినట్లు సమాచారం. అలాగే అర్థరాత్రి తన నివాసంపై దాడి చేసిన వారిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదని... ఈ నేపథ్యంలో తాను చేపట్టనున్న కార్యక్రమాల్లో ఈ అంశాలన్నీ ప్రస్తావించనున్నట్లు సుబ్బారావు గుప్తా వెల్లడించారని తెలుస్తోంది. 

అయితే సుబ్బారావు గుప్తాకు ఇప్పటికే ఆర్య వైశ్య సంఘాల నేతల మద్దతు లభించిందని.. అందుకే ఆయన ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా సుబ్బారావు గుప్తాపై దాడి అంశం.. అధికార జగన్ పార్టీకీ ముఖ్యంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పొలిటికల్‌గా పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...