Latest News
జగన్కు షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేత...
posted on: Apr 29, 2022 6:24PM
ఆయన ఓ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేత. వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు. స్థానిక ఎమ్మెల్యేతో వేగలేకపోయారు. జగన్కు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదు. ఎన్నిసార్లు విన్నపాలు వినిపించినా.. మొర ఆలకించలేదు. ఇక చాలని.. వాళ్లతో వేగలేనంటూ.. పార్టీని వీడారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన వెంట వందలాది మంది అనుచరులు పసుపు కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం అన్నమయ్య జిల్లాలో సంచలనంగా మారింది. పార్టీ మారడంపై జగన్ సైతం ఆరా తీశారు. ఎమ్మెల్యేను మందలించారని తెలుస్తోంది. ఇంతకీ ఆ నేత ఎవరంటే....
తంబళ్లపల్లె నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేత, తంబళ్లపల్లె జడ్పీటీసీ సభ్యురాలు గీత భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డి మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వైసీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడిగా కొండ్రెడ్డి ఉన్నారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, కొండ్రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు వచ్చాయి. తనకు వైసీపీలో జరుగుతున్న అన్యాయం, కక్ష సాధింపులపై అప్పట్లో కొండ్రెడ్డి.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. కొండ్రెడ్డి పలుమార్లు విలేకరుల సమావేశం పెట్టి మరీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేశారు. చివరికి టీడీపీలో చేరాలని నిర్ణయించుకుని.. పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి వచ్చి చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొండ్రెడ్డిని కలుపుకుని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. కొండ్రెడ్డి టీడీపీలో చేరడం.. రాజంపేట పరిధిలో జగన్కు బిగ్ షాకే అంటున్నారు.


.webp)



