రాహుల్ గాంధీ ప్రధాని.. చంద్రబాబు కేంద్ర మంత్రి

 

వైసీపీ నేత దాడి వీరభద్రరావు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆయన కేబినేట్ లో మంత్రి అవుదామని చంద్రబాబు తాపత్రాయపడుతున్నారంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ పొరపాటున గెలిస్తే చంద్రబాబు కేంద్రమంత్రి అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదన్నారు. తెలుగు వారి అభ్యున్నతి కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు భ్రష్టు పట్టించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అత్యధిక సార్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించింది చంద్రబాబేనని ఆరోపించారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించడం నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబుని కొనసాగించడం సరికాదన్నారు. గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని చంద్రబాబును సీఎంగా తొలగించాలని దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు.