TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పులివెందులలో రీపోలింగ్.. తాడేపల్లిలో వైసీపీ అభ్యర్థి!

Published on: Wed Aug 13, 2025 3:32PM

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీ డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. ఈ ఉప ఎన్నికలో ఏకంగా 11 మంది అభ్యర్థులు రంగంలోకి దిగడంతోనే ఇంత కాలం మా కంచుకోట, అడ్డా.. ఇక్కడ మాకు ఎదురే లేదు అంటూ వైసీపీ పలుకులన్నీ ఉత్త డొల్లేనని అవగతమైపోయింది. మూడు దశాబ్దాలుగా ఏకగ్రీవం వినా ఎన్నిక అంటూ జరగని ఈ స్థానంలో ఎన్నిక జరగడమే ప్రజాస్వామ్య విజయంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.

అసలు ఎన్నిక జరగడమే వింత అనుకుంటే ఉప ఎన్నిక ప్రచార పర్వం నుంచీ వైసీపీ బేలతనం అక్కడ ఆ పార్టీకి తిరుగులేని బలం ఉందన్నదంతా ఉత్తుత్తి ప్రచారార్భాటమే అని తేలిపోయిం దంటున్నారు. ఇక పోలింగ్ రోజున అక్రమాలు, అధికార పక్షం దాష్టీకం అంటూ ఆరోపణల పర్వానికి దిగడంతోనే అక్కడ వైసీపీ పరాజయాన్ని అంగీకరించేదిందని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. అయినా దింపుడు కళ్లెం ఆశతో రీపోలింగ్ కు డిమాండ్ చేసి రెండు కేంద్రాలలో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేయించుకున్న వైసీపీ తీరా రీపోలింగ్ ప్రారంభమైన తరువాత బహిష్కరణ అంటూ చేతులెత్తేయడం వింతల్లోకల్లా వింతగా చెబుతున్నారు.

అయితే వీటన్నిటికీ మించిన వింత ఏమిటంటే ఓ వైపు పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ జరుగుతుంటే అక్కడ వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నహేమంత్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రత్యక్షమైపోయారు. అక్కడ జగన్ మీడియాతో మాట్లాడుతుంటే.. ఆయన పక్కన ఒదిగి ఒదిగి కూర్చోవడం కనిపించింది.