చిరంజీవి సినిమా అందరివాడు,కానీ ప్రజా జీవితంలో కొందరివాడు

పవన్ కళ్యాణ్ జనసేన కవాతు అనంతరం నిర్వహించిన భహిరంగ సభలో  ఒక సీఎం కొడుకే సీఎం కావాలా? ఒక సీఎం మనవడే సీఎం కావాలా? కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా? అని ధ్వజమెత్తారు.దీనిపై ఏపీ ఆర్ధిక మంత్రి యనమల మాట్లాడుతూ ‘‘రాష్ట్రానికి ఎవరైనా సీఎం కావొచ్చు. అయితే ఆ వ్యక్తి ‘అందరివాడు’ కావాలి. మీ అన్నయ్య ‘అందరివాడు’ సినిమా తీశారు. కానీ ప్రజా జీవితంలో కొందరివాడిగానే మిగిలారు’’ అంటూ పవన్‌కల్యాణ్‌ ను ఎద్దేవా చేశారు.ప్రజారాజ్యం తరఫున పవన్‌‌ ప్రచారం చేసినా పాలకొల్లులో చిరంజీవి ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయానికి దోహదపడ్డారని.. ఇప్పుడు జనసేన ఎవరిని గెలిపించడానికి ఎన్నికల్లో పోటీ చేస్తోందని ప్రశ్నించారు యనమల. ఎన్నికల తర్వాత జనసేన ఎవరితో కలిసిపోతుందో కూడా చెప్పాలన్నారు. అందరివాడు కాబట్టే చంద్రబాబు సుమారు 14 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారన్నారు.

 

 

రాజమహేంద్రవరం కవాతు సందర్భంగా పవన్‌ చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబును విమర్శించడమే లక్ష్యంగా పవన్‌ ప్రసంగం కొనసాగిందని యనమల ధ్వజమెత్తారు.దేశమంతా రాఫెల్ స్కామ్‌పై గగ్గోలు పెడుతుంటే పవన్ మాత్రం‌ ఎందుకు ప్రశ్నించటం లేదని యనమల నిలదీశారు. అవినీతిపై పోరాటం చేయాలనుకుంటే వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైకాపా అధ్యక్షుడు జగన్‌పై చేయాలని సూచించారు. రాఫెల్ సూత్రధారి మోదీ, అవినీతి పరుడు జగన్‌లను వదిలేసి చంద్రబాబుపై ఆరోపణలు చేయడమేమిటని మండిపడ్డారు. భాజపా, వైకాపాలతో పవన్‌ లాలూచీ పడ్డారనేదానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని దుయ్యబట్టారు. రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ను పవన్‌ వెనకేసుకు వస్తున్నారని ఆరోపించారు.దేశంలో అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని, ఆ విషయం కూడా తెలియని పవన్‌.. రాష్ట్రంలో అవినీతి జరుతోందనడం ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఆఫ్‌ ఇండియా సర్వే ఏపీలో అవినీతి అతి తక్కువని వెల్లడించిన విషయం పవన్‌కు తెలియకపోవటం విడ్డూరంగా ఉందన్నారు.