కాంగ్రెస్ లో పీకే చేరికను అడ్డుకున్నదెవరు?.. 2024ఎన్నికల్లో పీకేది ప్రేక్షక పాత్రేనా?

posted on: May 5, 2022 1:40PM

కాంగ్రెస్ పార్టీలో పీకే చేరికకు మోకాలడ్డిందెవరు? ఎవరికి పీకే రాకవల్ల నష్టం జరుగుతుంది? అంతా సిద్ధమయ్యాకా చివరి క్షణంలో పీకే కాంగ్రెస్ కు ఎందుకు దూరం జరిగారు? అసలింతకీ పార్టీలో చేరికకు పీకే పెట్టిన కండీషన్స్ ఏమిటి? సాధికారిక కమిటీలో భాగం కమ్మంటూ సోనియా బిగ్ ఆఫర్ ఇచ్చినా పీకే ఎందుకు వెనక్కు తగ్గారు. కాంగ్రెస్ కు దగ్గరై పీకే కోల్పోయిందేమిటి? గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరడం లేదని ఆయన ప్రకటించినా నష్ట నివారణ కాకపోవడానికి కారణమేంటి. దేశంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా గుర్తింపు పొందిన పీకే నేడు ఏకాకిగా మిగిలిపోవడానికి కారణమేమిటి?

ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు ఈ అంశాలపైనే చర్చలు చేస్తున్నారు. ఎవరికి వారుగా తమదైన విశ్లేషణలు చేస్తున్నారు. అసలింతకీ ఈ మొత్తం వ్యవహారం వెనుక జరిగిందేమిటి? కాంగ్రెస్ లో అధిష్టానానికి దగ్గరగా ఉండే వర్గాల కథనం ప్రకారం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి, ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్రియాశీలం అయిన ప్రియాంకా వధేరా గాంధీలే పీకే చేరికకు మోకాలడ్డారు.

 కాంగ్రెస్ లో గాంధీల ప్రాభవానికి చెక్ పెట్టి పార్టీని గుప్పెట్లో పెట్టుకుని చక్రం తిప్పాలనుకున్న పీకే కిశోర్ వ్యూహాలు బెడిసి కెట్టడానికి గాంధీ కుటుంబం ప్రతి వ్యూహమే కారణమని ఆ వర్గాలు చెబుతున్నాయి.  ముఖ్యంగా రాహూల్‌,ప్రియాంక   పీకే స్పీడుకు బ్రేకులు వేశారని చెబుతున్నాయి.   5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రియాంక వాద్రా ద్వారా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని పీకే భావించారు. ప్రియాంక ఒత్తిడి మేరకే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజు సమావేశంలో పాల్గొన్న తర్వాత రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు. పీకే నియామకం జరగదని తేలడంతో ప్రియాంక కూడా విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు.

పార్టీ విజయానికి వ్యూహాలు రూపొందించాలని ప్రియాంక గాంధీ పీకేను కోరితే ఆయన అంతకు మించి..అన్నట్లుగా వ్యవహరించారనీ, రాహుల్ ప్రాధాన్యతను తగ్గించేలా పీకే చేసిన ప్రతిపాదనలను ప్రియాంక అంగీకరించలేకపోయారని అంటున్నారు. రాహుల్ ను పార్టీ పార్లమెంటరీ బోర్డుకే పరిమితం చేసి..ప్రియాంకను పార్టీ అధ్యక్షురాలిని చేయాలన్న పీకే ప్రతిపాదన తమ కుటుంబంలో చీలిక తేచ్చే వ్యూహంలా ఉందని ప్రియాంక తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. 

పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత రాహుల్ గాంధీ క్రియాశీలంగా పని చేస్తున్నారు. రాష్ట్రాల పర్యటనలతో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ పీకే మాత్రం రాహుల్ లో నాయకత్వ లక్షణాలు లేవని బహిరంగంగా చేసిన ప్రకటన ప్రియాంక, రాహుల్ ఆగ్రహానికి కారణమైందని, అందుకే ఎన్నికల వ్యూహానికి మించి పార్టీ వ్యవహారాలలో వేలు పెట్టడానికి వీల్లేదని గట్టిగా చెప్పారనీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే పీకే పార్టీ విజయానికి చేసిన ప్రజంటేషన్ నచ్చిన సోనియా గాంధీ పార్టీ అంతర్గత వ్యవహారాల జోలికి కాకుండా సాధికార కమిటీలో భాగం అయ్యి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి వ్యూహరచనకే పరిమితం కావాలని పీకేకు ప్రతిపాదించినట్ల తెలుస్తున్నది. అదే సమయంలో పీకేను రాకను పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్రాల అధ్యక్షులు వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేయడం వెనుక రాహుల్, ప్రియాంక వ్యూహం ఉందని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. చివరకు సోనియా మొహమాటంతో సాధికార కమిటీలో సభ్యుడిగా పరిమితం కావాలని సూచించడంతో పీకే కాంగ్రెస్ చేరిక వ్యూహం బెడిసికొట్టిందంటున్నారు.

ఇక్కడి దాకా ఒకెత్తయితే..ఈ మెత్తం ఎపిసోడ్ లో పీకేకు రాజకీయంగా జరిగిన నష్టం మాత్రం అపరిమితం అనే చెప్పాలి. పీకే కాంగ్రెస్ గూటికి చేరేందుకు చేసిన ప్రయత్నాలు, గాంధీ కుటుంబంతో, పార్టీ అగ్ర నేతలతో ఆయన వరుస భేటీలూ ఆయనకు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో అంతవరకూ ఉన్న సత్సంబంధాలు బెడిసేలా చేశాయంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఇలా ఆయన ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న పార్టీలు పీకేను దూరంపెట్టాలని నిర్ణయించుకున్నాయి. పీకే కాంగ్రెస్ కు దగ్గర కావడానికి చేసిన ప్రయత్నాల కారణంగా ఆయన వ్యూహకర్తగా పార్టీకి సేవలందిస్తే బీజేపీకి ఆగ్రహం కలుగుతుందన్న బెదురుతో జగన్ ఆయన సేవలను వచ్చే ఎన్నికలలో ఉపయోగించుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 
ఇలా   వ్యూహాల బేహారికి దారులు మూసుకుపోవడంతో సొంత పార్టీ ప్రకటనతో రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఆయన పార్టీ ప్రకటనకు ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పీకే ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాదయాత్ర పేరుతో ప్రజా సమస్యలు తెలుసుకుంటానంటూ చేసిన ప్రకటన కేవలం ఫేస్ సేవింగ్ ప్రయత్నంగా వారు అభివర్ణిస్తున్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానంటూ చెప్పుకొచ్చిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు కేవలం సొంత రాష్ట్రం బీహార్ కే పరిమితం అని అంటున్నారు. బీహార్ లో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉండే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...