TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేతల బూతులపై యాక్షన్ ఏదీ?

Published on: Fri Feb 20, 2026 11:53AM

వాస్తవ వేదిక తాజా ఎపిసోడ్ లో ఏపీ రాజకీయాల్లో  మారుతున్న పరిణామాలు, నాయకుల దిగజారుడు భాష,   ఎన్టీఆర్, వైఎస్ వంటి నేతల హుందాతనం గురించి  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజా వాస్తవ వేదికలో విశ్లేషణాత్మక చర్చ జరిపారు.  
రాజకీయాల్లో నానాటికీ తీసికట్టుగా మారుతున్న సంస్కారంపై డోలేంద్ర ప్రసాద్  గుర్రానికి, గాడిదకి తేడా ఏంటి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో గత జగన్ పాలనలో  చోటుచేసుకున్న పరిణామాలు, భాషా ప్రయోగం, రాజకీయాలలో హుందాతనాన్ని తిరిగి తీసుకురావడంలో  ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతలపై పలు సూచనలు చేశారు.  

రాజకీయాల్లో బూతు భాషా ప్రయోగం జగన్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాతే పరాకాష్టకు చేరిందన్నారు. గతంలో రోశయ్య, కేసీఆర్ వంటి వారు ఘాటు విమర్శలు చేసినప్పటికీ భాష పరంగా ఎక్కడా దిగజారలేదనీ, అనుచిత పదప్రయోగం చేయాలేదనీ గుర్తు చేశారు.  ఇక జగన్ హయాంలో కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వంటి వారు  వైసీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టులను చదివేవారనీ,  వారు  జగన్ నిలబెట్టిన బొమ్మలు  లేదా  రోబోల వంటి వారు మాత్రమేననీ డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిని వైసీపీయులు అవమానించడం వంటి ఘటనలు వైసీపీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని చేకూర్చాయని, ఒక స్త్రీని అవమానిస్తే ఎవరికైనా సరే రాజకీయంగా పుట్టగతులుండవన్నారు.  జగన్ హయాంలో  జరిగిన అరాచకాలు, దాడుల వల్ల విసిగిపోయిన ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చారన్నారు. 

 వైసీపీ నాయకుల ఇళ్లపై  టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్ పరిపాలనలో దాడులు జరగడం సాధారణం, కానీ చంద్రబాబు ప్రభుత్వంలో అలా జరగకూడదని హెచ్చరించారు. గాడిదకీ, గుర్రానికీ తేడా ఉంది కదా అన్నారు.  వైసీపీ చేసే అరాచకాలనే టీడీపీ కూడా చేస్తే, గుర్రానికి (టీడీపీ)  గాడిద (వైసీపీ) తేడా లేకుండా పోతుందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  
జగన్ తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ లేదా చంద్రబాబు అబద్ధాలు కారణమని నమ్ముతున్నారే తప్ప, తన అరాచక పరిపాలన వల్ల ప్రజలు ఓడించారని అంగీకరించడంలేదన్న ఆయన   జగన్ తన పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని మార్చుకోలేరని, ఆయన పద్ధతి మారకపోతే వైసీపీ గ్రాఫ్ పతనం నుంచి పతనానికి దిగజారుతూనే ఉంటుందని విశ్లేషించారు.  అదే సమయంలో ఆయన అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేశారు.   ప్రత్యర్థులపై దాడులు కాదు చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.   బూతులు తిట్టే నాయకులకు కోర్టుల ద్వారా శిక్ష పడేలా చేయాలని చెప్పారు. రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష పడిన ఉదాహరణను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

 రాజకీయ సభలు పెట్టి, వైసీపీ నాయకుల భాషా సంస్కృతిని ప్రజలకు వివరించాలని, రాజకీయాల్లో మేధావులను తిరిగి ఆహ్వానించాలనీ, అలాగే..  టీడీపీ తన పాత పద్ధతిలో కార్యకర్తలతో మమేకం కావాలని, ఎవరో తెలియని  బ్రోకర్ల'మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని సూచనలాంటి హెచ్చరిక సున్నితంగా చేశారు. రాజకీయాల్లో శాంతిభద్రతలు, సభ్యత, సంస్కారం, అభివృద్ధిని ఆశించి ప్రజలు చంద్రబాబును ఎంచుకున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందనీ డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.

వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ను తెలుగువన్ యూట్యూబ్ చానల్ లో ఈ కింది లింక్ ద్వారా చూడండి.