హర్మూజ్ క్లోజ్ అయితే పరిస్థితేంటి?

posted on: Mar 3, 2026 1:26PM

హర్ముజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు దాన్ని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పు పెడతామని  ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని అల్టిమేటమ్ ఇచ్చింది.  ఇంతకీ హర్మూజ్ బ్లాక్ అయితే అంటే మూతపడితే పరిస్థితేంటి?  కెప్లర్ సంస్థ వివరాల ప్రకారం 150 ఆయిల్‌ ట్యాంకర్లు ఇప్పటికే ఈ హర్ముజ్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.  మరోవైపు హర్ముజ్‌ తూర్పువైపున 60 ట్యాంకర్లు ఎదురు చూస్తున్నాయి. ఇదిలాఉంటే, ఫిబ్రవరి మధ్యలో సైనిక విన్యాసాల కోసం జలసంధిలో కొంతభాగాన్ని ఇరాన్ మూసివేయగా.. అప్పుడే చమురు ధరలు 6 శాతం మేర పెరిగాయి.

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడుల వల్ల పశ్చిమాసియాలో  అలజడి చెలరేగింది. ఈ ప్రభావం కేవలం ఈ ప్రాంతంపై మాత్రమే కాకుండా.. ప్రపంచ ఇంధన మార్కెట్లపైనా పడుతుంది. మరీ ముఖ్యంగా భారత చమురు, ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అన్నదిప్పుడు  చర్చనీయాంశంగా మారింది. భారత్   ముడి చమురు దిగుమతుల్లో సగానికి పైగా ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. ఇదే ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ చమురు రవాణాకు ఏ మాత్రం ఆటంకం ఏర్పడినా.. ఇంధన, సరుకు రవాణా వ్యయాలు భారీగా పెరుగుతాయి. ఇరవై శాతం వాణిజ్యానికి  ఈ మార్గమే కీలకం. దీంతో భారత ఆర్ధిక వ్యవస్థకు హర్మూన్ జలసంధి మూత పెను భారం కానుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. 

ఇరాన్ ని ఒమన్, యూఏఈ ల నుంచి వేరు చేసే ఈ హార్మూజ్ జలసంధి నుంచి ప్రపంచ చమురు వాణిజ్యంలోని 20 శాతం రవాణా సాగుతోంది. క్లేపర్ నివేదిక ప్రకారం..  2025 చివరి నాటికి 40 శాతంగా ఉన్న భారత చమురు దిగుమతులు.. 2026 జనవరి- ఫిబ్రవరి నాటికి 50 శాతానికి పెరిగాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించి..  మధ్యప్రాచ్య దేశాలపై భారత్ ఆధారపడ్డం మొదలైంది. దీంతో భారత్ రాక్, సౌదీ అరేబియా, యేఏఈ, కువైట్ నుంచి రోజుకు 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఈ జలసంధి గుండానే  దిగుమతి చేసుకుంటోంది. సగటున రోజుకు 74 వేల బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను కూడా భారత్ ఈ మార్గం నుంచే ఎగుమతి చేస్తోంది. 
అమెరికా బలగాల మోహరింపుతోనే ముడి చమురు ధరలు సుమారు 10 శాతం మేర పెరిగాయి. ఈక్విరస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం.. ఒక వేళ రోజుకు 33 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురు ఉత్పత్తికి అంతరాయం కలిగితే.. బ్యారెల్ ధర.. 9 నుంచి 15 శాతం పెరిగి.  76 నుంచి 81 డాలర్లకు పెరగొచ్చు. హార్ముజ్ జలసంధికి పాక్షిక ఆటంకం ఏర్పడితే.. అదనంగా 20 నుంచి 40 శాతం పెరిగి ఏకంగా 95 నుంచి 110 డాలర్లకు చేరుకుటుందని అంచనా. 

తాజా పరిణామాలతో భారత్ పై వివిధ రకాల ప్రతికూలతలు ఎదురయ్యేలా కనిపిస్తోంది. అందులో మొదటిది చమురు. మనం వాడే చమురులో ఎక్కువ భాగం విదేశాల నుంచే వస్తోంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కొద్దిగా పెరిగినా దేశం చెల్లించాల్సిన మొత్తం దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది.  యుద్ధ భయాలతో ముడి చమురు బ్యారెల్ ధర 90 డాలర్లు దాటితే మనకు ఇబ్బందే. చమురు ధరలు స్థిరంగా పెరిగితే.. దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. దీంతో   లోటు మరింత తీవ్రతరమవుతుంది. మపం విదేశాల నుంచి చమురు కొనుగోలు చేసినపుడు చెల్లింపులన్నీ డాలర్లలోనే చేయాలి. చమురు ధరలు పెరిగినపుడు ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇందువల్ల డాలర్ కి గిరాకీ పెరుగుతుంది. రూపాయపై ఈ ఒత్తిడి పడి విలువ మరింత పతనమవుతుంది.

ఇక భారత్ నుంచి ఇరాన్ కు ఎక్స్ పోర్ట్ అయ్యే బాస్మతీ బియ్యం, ఫార్మా, టీ, సుగంధ ద్రవ్యాలపైనా ప్రభావం పడుతుంది. చమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలపైనా ఆ ప్రభావం పడుతుంది. ఇందువల్ల దేశ వ్యాప్తంగా సరకు రవాణా ఖర్చు కూడా పెరిగే ఛాన్సుంది. రెడ్ సీలో భద్రత లేకుంటే, ఓడలన్నీ ఆఫ్రికా మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఇందువల్ల సరకు రవాణా సమయం 15 నుంచి 20 రోజులు పెరుగుతుంది. ఖర్చులు కూడా నలభై నుంచి యాభై శాతం మేర పెరిగి తడిసిమోపెడౌతాయి. ఇవన్నీ  సాధారణ వినియోగ దారుడిపై పెను భారం మోపుతాయి. 

ఇక ఇరాన్, ఇజ్రాయెల్, కువైట్ తదితర దేశాల గగనతలాలు పాక్షికంగా మూత పడ్డంతో ఎయిరిండియా. ఇండిగో విమాన యాన సంస్థలు అమెరికా, యూరప్ రూట్లను మళ్లించాయి. ఇందువల్ల ఇంధన ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగే ఛాన్సుంది. ఇప్పటికే టారీఫ్ తఖరారు నడుస్తుండగా డీలా పడ్డ మార్కెట్లకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరం కానుంది. ఈ ఉద్రిక్తతలు ఎంత కాలం కొనసాగితే.. అంతకాలం మార్కెట్లపై ఆ ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో ఎంత త్వరగా యుద్ధ మేఘాలు వీడితే మార్కెట్లకు అంత మేలు జరుగుతుంది. యుద్ధ భయాల నుంచి బయట పడేందుకు భారత్ ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు ఎనలిస్టులు.

ఇక వెండి బంగారం ధరలు కూడా భారీ ఎత్తున ప్రభావితమయ్యేలా కనిపిస్తోంది. గోల్డ్, సిల్వర్ రేట్స్ దూకుడు పెరిగేలా ఉందని అంటారు విశ్లేషకులు. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినపుడు ఇన్వెస్టర్లు సురక్షిత మార్గాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో బంగారు, వెండి ధరలు అమాంతం పెరిగిపోతాయి. లైఫ్ టైం హై రేట్స్ కి పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే రోజుల్లో గోల్డ్ పది గ్రాములు లక్షా 70 వేలు దాటే అవకాశం కనిపిస్తోంది. ఇక కిలో వెండి కూడా 3 లక్షలకు చేరొచ్చని ఎస్ఎమ్ సీ గ్లోబల్ సెక్యూరిటీస్ అంచనా వేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...