Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇదేం భాష.. మర్యాదుండక్కర్లే?.. రాజకీయాలలో దిగజారుతున్న సంస్కారం
posted on: Oct 19, 2022 12:10AM
నాడు...
-ఒక రైలు ప్రమాదం జరిగిందని బాధ్యత వాహిస్తూ రైల్వే మంత్రి పదవికి
రాజీనామా చేసి ఆఫీస్ బయటకు వచ్చి అధికారిక వాహనం వదిలేసిన
లాల్ బహదూర్ శాస్త్రి.
-ఎమర్జెన్సీ అనంతరం మురార్జీ దేశాయ్ ప్రధానిగా జనతా సర్కార్
ఏర్పాటైంది. మురార్జీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఫెర్నాండెజ్ ఒక
సభలో ఇందిరాగాంధీని నిరంతర అబద్ధాల కోరు అని విమర్శించడాన్ని
స్వయంగా మురార్జీ తప్పుపట్టారు. ఆ విమర్శ ఆమె రాజకీయ
అనుభవాన్ని కించపరిచేదిగా ఉందని ఫెర్నాండెజ్ ను మందలించారు.
- పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు, విపక్ష నేతగా ఉన్న
అటల్ బిహారీ వాజ్పేయి పీవీ విధానాలపై నిత్యం విమర్శలు
కురిపించేవారు.అయితే, ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ సమస్యపై
మాట్లాడేందుకు దేశ ప్రతినిధిగా పీవీ వాజ్పేయినే పంపారు.
నేడు...
-ఈడీలు కాదు బోడిలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో.. ఈడీ వస్తే
నాకే చాయి తాపీ పోవలె.. మోడీ నువ్వు గోకినా.. గోకక పోయినా నేను
గోకుతూనే ఉంటా
-మునుగోడు ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్
చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా పర్వాలేదు. చంద్రబాబుకు కళ్లు
నెత్తికెక్కాయి.. ఉరిశిక్ష వేసినా తప్పు లేదు
-విపక్ష నేతగా ఉండగా వేర్వేరు రోడ్ షోలలో జగన్
సమస్యలు, కష్టాలు ఇవేవీ నన్ను కదిలించలేవు, నన్ను బెదిరించలేవు.
దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఉన్నంతకాలం వాళ్లు నా
వెంట్రుక కూడా పీకలేరు.
- సీఎం జగన్
-
ఒరేయ్ వెధవల్లారా, సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా.. నా సహనమే రా
ఇంత కాలం మిమ్మల్ని రక్షించింది. ఏరా వైసీపీ గూండాల్లారా.. ఒంటి
చేత్తో వస్తాం మెడ పిసికి కింద తొక్కేస్తాం కొడకల్లారా
-జనసేన అధినేత పవన్ కల్యాణ్
రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్లా కాకుండా శత్రువుల్లా మారిపోతున్నారనడానికి తెలుగు రాష్ట్రాలలో నాయకుల మాటలే తిరుగులేని నిదర్శనం. అందరు నాయకులూ ఇలాగే సభ్య సమాజం ఆమోదించని భాషతో ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోస్తున్నారని అనడానికి లేదు. గంజాయివనంలో తులసి మొక్కల్లా చంద్రబాబు వంటి నేతలూ ఉన్నారు. ఆయన విమర్శలు వాడిగా ఉంటాయి, సూటిగా ఉంటాయి. అయితే ఎన్నడూ వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భం లేదు. అయితే ఆయన సమకాలీనుడై తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ, జూనియర్లైన జగన్, పవన్ కల్యాణ్ లు కానీ ఆ పరిణితిని, సంయమనాన్ని పాటించడం లేదు. నాటి రాజకీయ నాయకుల హుందాతనం, పరస్పరం గౌరవించుకునే సంస్కారం నేడు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి.
ఒక నాయకుడు తన ప్రవర్తనతో, రుజు వర్తనతో అందరికీ ఆదర్శంగా నిలిచినప్పుడే ఆయన ఆధ్వర్యంలోని పార్టీ సమాజానికి మేలు చేసేలా రూపుదిద్దుకుంటుంది. ఒక మార్గదర్శనం చేయగలుగుతుంది. యధారాజా తథా ప్రజా అన్నట్లుగా పార్టీ నాయకుడే మర్యాదను గాలికి వదిలేసి అమర్యాదకరమైన భాషను ఉపయోగిస్తే ఆయన నాయకత్వంలోని పార్టీ శ్రేణులూ అదే దారిన నడుస్తారు. అప్పుడుఅరాచకం వినా మరొకటి ఉండదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి అలాగే తయారైంది. తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోందనడానికి నాయకుల ప్రసంగాలే ప్రత్యక్ష నిదర్శనం.
రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు అంశాల వారీగా సిద్ధాంతం ప్రాతిపదికపై ఉండటం అనేది మర్యాద. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలే మర్యాద ముసుగు తీసేసి ఇష్టారీతిగా మాట్లాడుతున్న పరిస్థితి నేడు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల అధ్వాన స్థితికి అద్దం పడుతోంది. చదవేస్తే ఉన్న మతి పోయిందన్న చందంగా నేటి రాజకీయ నాయకుల తీరు ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావునే తీసుకుంటే.. ఆయనేమీ సామాన్యమైన నాయకుడు కాదు.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు నాయకత్వంలో పని చేసిన వ్యక్తి.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న మహనీయుడి వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి ఐదు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. అటువంటి నేత నోటి నుంచి నేడు గోకుడో పాఖ్యానం వినడమే రాజకీయాల నేతల భాషా దారిద్ర్యానికి, విలువల పతనానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అశేష ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు. ఆయన కూడా కేవలం అధికారమే పరమావధిగా నేలబారు మాటలతో ప్రసంగాలతో రాజకీయ మర్యాదకు తిలోదకాలిచ్చేసి ప్రసంగాలు చేయడం విలువల పతనానికి పరాకాష్టగా చెప్పాలి. ప్రత్యర్థులపై విమర్శలకు ఆయన ప్రయోగించే భాష ఉపయోగించే సంస్కార లేమికి పరాకాష్టగా ఉంటుందనీ. వెంట్రుక కూడా పీకలేరు.. కాల్చి పారేయాలి.. ఉరి తీయాలి వంటి భాషా ప్రయోగం ఆయనకే చెల్లిందని పరిిశీలకులు చెబుతున్నారు.
అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ విషయాన్నే తీసుకుంటే ఇంత కాలం పొల్లు మాటలకు దూరంగా హుందా రాజకీయ వేత్తగా గెలుపోటములకు అతీతంగా ప్రజల కోసమే నిలబడతానని చెప్పుకుంటూ వచ్చిన పవన్ కల్యాణ్ మంగళవారం (అక్టోబర్ 18)మంగళగిరిలో పార్టీ క్యాడర్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. గొప్ప గొప్ప గ్రంథాలను అధ్యయనం చేసి... ఆ స్ఫూర్తితో ప్రజా సేవ కోసం రాజకీయాలలోకి వచ్చినని చెప్పే పవన్ కల్యాణ్ వైసీపీ తీరును, వైసీపీ నాయకులతీరును ఎండగట్టడానికి ఉపయోగించిన భాష సభ్య సమాజానికి ఆమోదయోగ్యమైనది ఎంత మాత్రం కాదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఇంత కాలం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడా సంయమనం కోల్పోకుండా మంచి మాటలతోనే తన భావాలను వ్యక్త పరిచేవారు. కానీ మంగళవారం (అక్టోబర్ 18) మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ క్యార్యకర్తల సమావేశంలో ఆయన పరుష పదజాలం ఉపయోగించారు. విశాఖ ఘటనల నేపథ్యంలో వచ్చిన ఆవేశం వల్లనో, పెద్ద సంఖ్యలో తన పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించి అరెస్టులు చేసినందువల్ల వచ్చిన ఆగ్రహమో కానీ ఆయన కూడా మర్యాద గీత దాటేశారు.
అయితే తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ అధమస్థాయి భాషా ప్రయోగం ఇటీవల కాలంలోనే అంటే దాదాపుగా ఓ దశాబ్దం కిందటే ఆరంభమైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజల ఆమోదంతో సంబంధం లేకుండా ప్రత్యర్థులపై దుర్భాషలాడటం, ప్రత్యర్థులను మానసికంగా బలహీనులను చేయడమే లక్ష్యంగా రాజకీయ నేతలు దిగజారుడు భాష ఉపయోగిస్తున్నరని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో అసెంబ్లీ సాక్షిగా విపక్ష నేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన అధికార పక్ష సభ్యులు కొందరు చేసిన నీచ వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. ఏపీలో అయితే వైసీపీ నేతల భాష సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ఉందనడంలో సందేహం లేదు. మాజీ మంత్రులు కొడాలి నాని, అనీల్ కుమార్ యాదవ్, మంత్రులు రోజా, అమర్ నాథ్ వంటి వారు రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, ఉపయోగిస్తున్న భాష వారి దిగజారుడు తనానికి నిదర్శనాలుగా ఉన్నాయంటున్నారు.
అయితే రాజకీయ భాష ఇంత అధమ స్థాయికి దిగజారిపోయిన తరుణంలో కూడా గంజాయివనంలో తులసి మొక్కలా కొందరు నాయకులు విలువలకు పెద్ద పీట వేస్తూ పల్లెత్తి పరుషంగా మాట్లాడకుండా సిద్ధాంతానికే కట్టుబడి మాట్లాడుతున్న వారూ ఉండటం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, ప్రజాజీవితంలో నేతలలో విలువల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న తీరు ఒక్కటే ప్రజాస్వామ్య వాదులకు ఊరటగా ఉందని పరిశీలకులు అంటున్నారు.
అలాంటి నాయకులలో మొదటి వరసలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉంటారని రాజకీయాలకు అతీతంగా సీనియర్ నాయకులు అంటున్నారు. చంద్రబాబు విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వామపక్ష నేతలు కూడా ఆయన స్టేట్స్ మన్ షిప్ ను గౌరవిస్తామని చెబుతుంటారు. అలాగే బీజేపీ సీనియర్ నేతలు సైతం చంద్రబాబు దార్శనికతకు ఫిదా అయ్యామని అంటారు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ భాష విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మాట్లాడేస్తున్నారు. పరుష పదజాలం, దూషణల ద్వారా వారు తమ పార్టీ క్యాడర్ కు కానీ, ప్రజలకు కానీ ఇచ్చే ఇస్తున్న సందేశం ఏమిటి? సంకేతమేమిటి? అన్నది ఆయా నేతలే తెలుసుకోవలసి ఉంటుంది. లేకుంటే ప్రజలే వారి నోళ్లకు తాళం వేసే రోజు వస్తుందని పరిశీలకులు అంటున్నారు.
నెహ్రూ, లాల్ బహదూర్శాస్త్రి, వాజ్ పేయి, రాజాజీ వంటి నేతలు రాజకీయ యవనికపై ఎంత హుందాగా వ్యవహరించాలో.. సైద్ధాంతిక విభేదాలపై పోరు కూడా ఎంత స్నేహపూర్వకంగా చేయవచ్చో చూపారు. ఇప్పటికైనా నేతలు తమ భాష మార్చుకుని రాజకీయ మర్యాద, హుందాను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు అంటున్నారు. లేదంటే ప్రజా క్షేత్రంలో వారికి గుణపాఠం తప్పదంటున్నారు.


.webp)
.webp)


