జగన్ ఇప్పుడు ఎందుకు ఉలకట్లేదు.. పలకట్లేదు..
posted on Nov 25, 2015 11:14AM
వరంగల్ ఉపఎన్నిక పోరు ఎట్టకేలకు ముగిసింది. అన్ని పార్టీలను పక్కకు నెట్టి టీఆర్ఎస్ ఇంతకు ముందు మెజార్టీ కంటే ఎక్కువ సంపాదించి లోక్ సభ సీటు దక్కించుకుంది. ఎన్నికల బరిలో దిగిన దయాకర్ దాదాపు నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక్కడి వరకూ బానే ఉంది. ఇప్పుడు గెలుపు కోసం విమర్శలు చేసిన పార్టీ నేతలు గెలిచిన తరువాత కూడా విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఒకరంటే.. గ్రేటర్ ఎన్నికలు నుండి టీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమవుతుందని ఇంకొకరు అంటారు. అయితే ఇది రాజకీయాల్లో ఎలాగూ కామన్ థింగ్.. కానీ అందరూ ఎవరి ధోరణిలో వారు విమర్శిస్తుంటే ఒక్కరి గళం మాత్రం ఎక్కడా వినిపించకపోవడం గమనార్హం. అదే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.
వరంగల్ ఉపఎన్నికల్లో మొత్తం వైసీపీకి లక్ష ఓట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ వైసీపీ దక్కించుకున్న ఓట్లు మొత్తం.. 23,352 మాత్రమే. ఇంతకూ జగన్ లెక్క ఎక్కడ తప్పింది. జగన్ చెప్పినా ఆయన గారి సామాజికవర్గం.. ఆయన గారి మతం.. ఆయన గారి కులం ఓట్లేయలేదా?.. మరి ఇంత పరాభవం పొందిన జగన్ మాత్రం ఎందుకు మౌనంగా.. ఏం ఉలకకండా.. పలకకుండా ఉన్నారు. కేసీఆర్, జగన్ కొంచెం సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఏం అనట్లేదా.. అదే వేరే పార్టీ కనుకు గెలిస్తే విమర్శించేవాళ్ల? అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. లేకపోతే ఏదైనా మాట్లాడితే పరాభవం అంగీకరించినట్లౌతుందని సైలెంట్ గా ఉన్నారా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు అసలు ప్రచారానికి షర్మిళను తీసుకొచ్చి వుంటే ఇంకొన్ని ఓట్లన్న వచ్చేవి అని అనుకునే వారు కూడా ఉన్నారు.
మొత్తానికి ఏది ఏమైనా టీఆర్ఎస్ మాత్రం అన్ని పార్టీలను తుంగలో తొక్కి అత్యధిక మెజార్జీతో గెలుపొందింది. దీనికి ఏదైనా కారణం కావచ్చు.. కేసీఆర్ పాలన వరంగల్ ప్రజలకు నచ్చిఉండొచ్చు.. టీఆర్ఎస్ పై ఇంకా ప్రజల్లో వ్యతిరేక భావన రాకపోవచ్చు.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు ఉపయోగపడచ్చు.. ప్రచారంలో కేసీఆర్ మాటలకు ప్రజలు ఫిదా అయి ఉండొచ్చు. ఏదైనా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారు రుజువైంది.