తిరుమలపై వైఎస్ఆర్ ఫ్యామిలీ కక్ష కట్టిందా?
posted on: Feb 12, 2026 6:25PM

తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో “వాస్తవ వేదిక” 12వ సంచిక గురువారం (ఫిబ్రవరి 12) విడుదలైంది. ఈ సంచికలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కంఠంనేని రవిశంకర్ మరియు జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ విశ్లేషణాత్మక చర్చ నిర్వహించారు. టీటీడీ ప్రసాదానికి సరఫరా చేసినది స్వచ్ఛమైన నెయ్యి కాదని, పామాయిల్తో పాటు రసాయనాలు కలిపిన నూనెనే అందించారని డోలేంద్ర ప్రసాద్ వివరించారు.
అయితే అసలు కల్తీ నెయ్యే లేదని వైసీపీ నాయకులు తెలివిగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును వదిలి సుప్రీంకోర్టులో సీబీఐ విచారణ కోరడం “దొంగనే దొంగ అని అరవడం” లాంటిదని కంఠంనేని రవిశంకర్ వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై వైసీపీ నాయకులు అపచారం చేసి ఇప్పుడు బుకాయిస్తున్నారని తెలుగువన్ ఎండీ అన్నారు.
అలాగే 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి “ఏడు కొండలు కాదు… రెండు కొండలే” అని జీఓ ఇచ్చారని కంఠంనేని రవిశంకర్ ప్రస్తావించారు. వైఎస్ఆర్ కుటుంబం తిరుమలపై ఏదైనా కక్ష కట్టిందా? అనే ప్రశ్నను రవిశంకర్ లేవనెత్తారు. తిరుమల ప్రధాన అర్చకుడిని ఎవరు భయపెడుతున్నారు? జగన్ హయాంలో జరిగిన ఈ ‘మిస్టరీ’ వెనుక అసలు నిజాలేమిటి? వంటి అనేక కీలక అంశాలపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్లో తప్పక వీక్షించండి.






