వేడుకలో విషాదం

 

కడప జిల్లా నందలూరు మండలం చెన్నయ్యగారి పల్లి గ్రామంలో శ్రీరాముని ఊరేగింపు వేడుకలో విషాద ఘటన జరిగింది. బుధవారం రాత్రి సీతారాముల ఉత్సవ విగ్రహాలను ట్రాక్టర్ మీద వుంచి గ్రామంలో ఊరేగించారు. ఆ ట్రాక్టర్ మీద ఎక్కిన గణేష్, జగన్ అనే ఇద్దరు బాలురు అదే వాహనంలో నిద్రపోయారు. ట్రాక్టర్‌లో విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వుంది. అందులోంచి వచ్చిన పొగ పీల్చడంతో ఈ ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. పిల్లలు కనిపించకపోవడంతో వెతికిన ఆ చిన్నారుల తల్లిదండ్రులకు గురువారం ఉదయం ట్రాక్టర్‌లో వారు కనిపించారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో గణేష్ అనే బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. జగన్ అనే బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది.