వేధింపులు... విద్యార్థిని ఆత్మహత్య...

 

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో టీటీసీ శిక్షణ పొందుతున్న సుభాషిణి అనే విద్యార్థిని శనివారం నాడు ఒంటిపైన కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకి పాల్పడింది. తాను చదువుతున్న విద్యాసంస్థకు చెందిన సిబ్బంది వేధింపులకు పాల్పడటంతో.. వాటిని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె స్నేహితురాళ్ళు చెబుతున్నారు. తీవ్రమైన కాలిన గాయాలకు గురైన సుభాషిణి తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాలు వదిలేసింది. కళాశాలలో రికార్డులు సమర్పించే విషయంలో ఆమెను కొంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు వేధించారని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. అధ్యాపకులు, సహ విద్యార్థుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు మరణించేముందు పోలీసులకు తెలిపినట్టు సమాచారం.