ముఖ్యమంత్రి పదవిపై టీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

 

ముఖ్యమంత్రి పదవిపై ఓ టీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ వ్యాఖ్యలు చేసింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పైన.టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పోటీ పై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండు జాబితాల్లోనూ స్పష్టత ఇవ్వలేదు.దీనిపై టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు."కాంగ్రెస్‌లో బి-ఫాం తెచ్చుకోలేనోడివి రాష్ట్రానికి ముఖ్యమంత్రివి ఎలా అవుతావు పొన్నాల.. ఏం బతుకు నీది" అంటూ ముత్తిరెడ్డి ఘాటుగా విమర్శించారు.మంత్రిగా పని చేసిన పొన్నాలకు టికెట్‌ రాకపోవడం ఆయన పని తీరుకు నిదర్శనమన్నారు.మహా కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలిపివేసి రా ష్ట్రాన్ని మరో 20 ఏళ్లు వెనక్కి తీసుకెళతారని ఆరోపించారు. ఎన్ని కూటములు ఏర్పడినా టీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని ఆపలేరన్నారు. దేశంలోనే నెంబర్‌వన్‌ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్‌ను మరోమారు తెలంగాణ ప్రజలు సీఎంగా కోరుకుంటున్నారన్నారు. జనగామ ప్రాంతంలో సీఎం కేసీఆర్‌ చేయూతతో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు,ప్రజల ఆదరణతో మరోసారి గెలిచి తీరుతానని ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.