TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అప్పులు చేస్తే తిప్పలు తప్పవు

Published on: Sat Aug 27, 2022 10:44PM

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయింది. ఇదేమి రహస్యం కాదు. అందరికీ తెలిసిన వాస్తవం. నిజానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మొదలు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రులు, బీజేపీ కేంద్ర నాయకులు ఇదే మాట.. మళ్ళీ మళ్ళీ చెపుతున్నారు. అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నది లేదు. కొత్త కొత్త మార్గాలలో కొత్త అప్పులు చేస్తూనే ఉన్నారు. సంక్షేమం పేరుతొ పందారం కానిచ్చేస్తున్నారు. ప్రజల సొమ్ములతో ప్రజల ఓట్లను కొల్లగొట్టే ఓటు బ్యాంకు రాజకీయాలకు సంక్షేమం ముసుగేసి, మోసం చేస్తున్నారు. 

అదలా ఉంటే ఇప్పుడు తాజగా కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్’ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు హద్దులు లేకుండా పోయాయని, విమర్శించారు. శ్రీ లంక పరిణామాల నుంచి, ఏపీ ముఖ్యమంత్రి గుణ పాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. లోక్‌సభ ప్రవాసీ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి విశాఖలో పర్యటించారు. పక్క దేశాల్లో అప్పు పెరిగితే ఏ రకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయో గమనించాలని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికిసూచించారు. 

చివరకు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి మరీ, ఎక్కడంటే అక్కడి నుంచి  అప్పు తీసుకుంటున్నారని అది మంచి పద్ధతి కాదన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు కూడా ఇది వ్యతిరేకమని వివరించారు. ప్రభుత్వం చట్టబద్ద పరిపాలనా పద్దతులను పాటించాలని చెప్పారు. ప్రభుత్వ భూములను, ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు.  ప్రభుత్వాలు ప్రజల ఆస్తులకు ట్రస్టీలుగా ఉండాలే తప్ప యజమానుల్లా వ్యవహరించరాదని హెచ్చరించారు.

అలాగే, ప్రభుత్వ పథకాలకు ముఖ్యమంత్రి పేరు లేదంటే ముఖ్యమంత్రి  కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోవడం మంచి పద్దతి కాదన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు కుటుంబ పాలనను తిరస్కరిస్తున్నారని స్పష్టం చేశారు. మూడేళ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిని పూర్తిగా వదిలేసిందని, ఈ ప్రభుత్వ హయాంలో విశాఖలో భూకబ్జాల సంస్కృతి, కమిషన్లు, లంచాలు ముట్టజెప్పితే భూములను క్రమబద్ధీకరిస్తామనడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇది చాలా సిగ్గుచేటని, ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగితే ఈ రకమైన ఫిర్యాదులపైన విమర్శలపైన వెంటనే విచారణ నిర్వహించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు