తోటకు అనుకూలంగా మారుతున్న సమీకరణలు?

posted on: May 10, 2012 11:10AM

త్రిముఖపోటీతో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ స్థానానికి జరుగుతున్నా ఉప ఎన్నికలు వేడెక్కాయి. ఈ స్థానంలో కాంగ్రెస్, తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బిసిలు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సమీకరణలు మారుతున్నాయి. ఇవన్నీ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులకు అనుకూలమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ తాజా మాజీ, మాజీ మంత్రి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి సుభాష చంద్రబోస్ కు అనుకూలంగా ఉందని గతంలో భావించారు.

 

 

ఇటీవల ప్రచారంలో భాగంగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన అమలాపురం ఎంపి జివి హర్షకుమార్ తన సామాజికవర్గమైన ఎస్సీ ఓట్లు ఇతర పార్టీల (కాంగ్రెస్ కు మాత్రమే ఓటు వేసేలా)కు పడకుండా కట్టడి చేశారు. దీనికి ఎస్సీ నాయకులంతా సమ్మతించి ఈ మేరకు కృషి చేస్తున్నారు. అలాన్గే కాపు సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిక్కాల రామచంద్ర రావును ఈ ఎన్నికల నుంచి తప్పుకోమని సామాజికవర్గ నాయకులు ఒత్తిడి చేశారు.

 

 

పార్టీ నిర్ణయం మేరకు పోటీలో ఉంటానని చిక్కాల చెప్పటంతో కాపులంతా సమైక్యంగా తోటకు మద్దతు ఇవ్వాలని ఆ వర్గ నాయకులు ప్రచారం చేశారు. బీసీల్లో మాజీ మంత్రి పిల్లి సుభాష చంద్రబోస్ పై అసంతృప్తి ఉన్న నాయకులను కాంగ్రెస్ అభ్యర్థి తోట పిలిపించి వారితో మంతనాలు జరిపారు. తాను కనుక విజయం సాధిస్తే బిసీలకు అవసరమైన పనులు చేసిపెడతానని హామీ ఇవ్వటంతో వారు కూడా తోటకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇలా రాజకీయ సమీకరణలు మారటంతో తోట గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు తేల్చి చెపుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...