రాష్ట్రానికి ర‌సాయ‌న గండం ప‌ట్టిందా!?

posted on: Feb 24, 2026 8:13PM

 

ర‌సాయ‌నం- ర‌సాయ‌నం- ర‌సాయ‌నం. తిరుమ‌ల  శ్రీవారి ల‌డ్డూలో ర‌సాయ‌నం. ఇప్పుడు రాజ‌మండ్రి పాల‌లో ర‌సాయ‌నం. ఏపీకి ఏదో కెమిక‌ల్ గండం త‌గిలిన‌ట్టుంది. రాజ‌మండ్రి  క‌ల్తీ పాల‌లో ఇథ‌లిన్ గ్లైకాల్ అనే  ర‌సాయ‌నం క‌ల‌వ‌డం వ‌ల్లే ఇంత మంది చ‌నిపోయిన‌ట్టు చెబుతున్నారు డాక్ట‌ర్లు. మొన్న శ్రీవారి  ల‌డ్డూలో క‌లిసిన  ర‌సాయ‌నాల‌ను ద‌క్షిణ  కొరియా నుంచి తెప్పించార‌ని అన్నారు. అది ఏకంగా  బాత్రూమ్ లు క‌డిగే.. యాసిడ్ గా చెప్పుకొచ్చారు. ఈ విష‌యంలో చాలా పెద్ద చ‌ర్చే జ‌రిగింది. 

ఇప్పుడు చూస్తే ఇథ‌లిన్ గ్లైకాల్.. ఇంత‌కీ ఈ ర‌సాయ‌నం రాజ‌మండ్రి పాల‌ల్లో ఎలా క‌ల‌సింది?  ఇది ఎలాంటి విష ప‌దార్ధం? అని ప‌రిశీలిస్తే.. పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, దాని చిక్కదనాన్ని పెంచడానికి  ఈ ప్రమాదకరమైన రసాయనాన్ని కలిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇథ‌లిన్ గ్లైకాల్ పాల‌లో ఎలా క‌లిసిందో గ‌మ‌నిస్తే..  

సాధారణంగా పాల డైరీలలో పాలను చల్లబరచడానికి వాడే రిఫ్రిజిరేషన్ వ్యవస్థల్లో.. ఇథలిన్ గ్లైకాల్‌ను  ఒక‌ కూలెంట్ గా వాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో చిల్లర్ పైపులు లీక్ అవ్వడం వల్ల, పొరపాటున ఈ కూలెంట్ పాలలో కలిసే అవకాశం ఏర్ప‌డుతుంది. పాలు గడ్డకట్టకుండా ఉండటానికి లేదా పాలను ప్రాసెస్ చేసే సమయంలో లాభాల కోసం ఉద్దేశపూర్వకంగా తక్కువ ధరలో దొరికే ఇలాంటి రసాయనాలను కలుపుతున్నారనే ఆరోపణలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

ఇథలిన్ గ్లైకాల్ అంటే ఏమిటి? అని  చూస్తే ఇది రంగు, వాసన లేని ఒకానొక‌ ద్రవ పదార్థం. ఇది రుచికి కొంచెం తియ్యగా ఉంటుంది. దీన్ని ముఖ్యంగా కార్ల ఇంజన్లలో యాంటీ-ఫ్రీజ్ గాను వాడుతుంటారు. పారిశ్రామికంగా ద్రావణి గాను ఉప‌యోగిస్తారు.ఇది ఆహార పదార్థం కాదు, అత్యంత ప్రమాదకరమైన విష పదార్థం. ఇది ఎంత ప్రమాదకరం?  సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివో చూస్తే.. 

ఇది పాలలో కలిసి మన శరీరంలోకి చేరితే అది తీవ్రమైన దుష్ప్రభావాలను చూపిస్తుంది. మ‌రీ ముఖ్యంగా మూత్రపిండాల వైఫల్యం జ‌రుగుతుంది. ఈ రసాయనం శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్‌గా మారి, కిడ్నీల్లో రాళ్లను త్వ‌ర త్వ‌ర‌గా పెంచుతుంది. ఇది మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినడానికి కారణమవుతుంది. దీని కార‌ణంగా మెదడు పనితీరు మందగించడం, మత్తుగా ఉండటం, వాంతులు రావ‌డంతో పాటు.. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు కలుగుతాయి.

ఈ ర‌సాయ‌నం క‌లిసిన పాలు ఎక్కువ‌గా తాగితే గుండె వైఫ‌ల్యం చెంది ప్రాణాలు కోల్పోయే ప్ర‌మాద‌ముంది. రాజమండ్రి పరిసరాల్లో సేకరించిన పాల శాంపిల్స్‌ను ఇప్పటికే ల్యాబుల‌కు పంపారు అధికారులు. ఆ నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు.ఇక ప్ర‌జ‌లు తీసుకోవ‌ల్సిన జాగ్ర‌త్త‌లు ఏంటంటే.. న‌మ్మ‌క‌మైన డ‌యిరీల నుంచి లేదా సీల్ చేసిన ప్యాకెట్లు మాత్ర‌మే వాడాలి. పాల రుచిలో ఏదైనా తేడా క‌నిపిస్తే.. అతి తియ్య‌గా ఉన్న‌ట్ట‌యితే.. వెంట‌నే ఆ పాల‌ను వాడటం ఆపేయాలి. ఆ పాల వాస‌న కూడా ఇట్టే తెలిసి  పోతుంది కాబ‌ట్టి తస్మాత్ జాగ్ర‌త్త! అంటున్నారు నిపుణులు.
 
ఇక రాజ‌మండ్రి పాల వ్యాపారి గ‌ణేష్ విష‌యానికి వ‌స్తే.. అత‌డు త‌న సొంత ప‌శువుల ద్వారా ఈ పాలు సేక‌రించ‌డం  లేద‌ని అన్నారు ఎంపీ పురంధేశ్వ‌రి. గ‌ణేష్ రోజూ.. 120 లీట‌ర్ల పాల సేక‌ర‌ణ చేసి.. వాటిని పూర్తి చిల్లింగ్ చేసి ఆ మ‌ర్నాడు జ‌నానికి పోస్తార‌ని చెప్పుకొచ్చారామె. ఇక ఇదే అంశంపై స్పందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అయితే, గ‌ణేష్ ఇప్పుడే కాదు.. 

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో, అంత‌క‌న్నా ముందు నుంచే పాలు పోస్తున్నాడు. జ‌నం ఆయ‌న‌కు పాలు చేదుగా ఉన్న‌ట్టు చెప్పారు. కానీ, ఆయ‌న ఇదంతా  గేద‌ల ద్వారా వ‌చ్చిన స‌మ‌స్య‌గా భావించారు. కానీ త‌న ఫ్రిడ్జ్ నుంచి ఎదురైన స‌మ‌స్య‌గా ఆయ‌న గుర్తించ‌లేక పోయారు. అందుకే వారు చేదుగా  ఉంద‌ని చెప్పినా.. వ‌ద‌ల‌కుండా  పాలు పోయ‌డం ఇప్పుడు చేటు తెచ్చింద‌ని అన్నారు ఎమ్మెల్యే. 

ఇది ఒక ప్రైవేటు పాల వ్యాపారి త‌ప్పిద‌మే అయినా.. ప్ర‌భుత్వం బాధ్య‌త తీసుకుంటుంద‌ని.. బాధిత కుటుంబాల‌కు ఎక్స్ గ్రేషియా ఇవ్వ‌డం మాత్ర‌మే  కాకుండా.. మిగిలిన వారి ఆస్ప‌త్రి ఖ‌ర్చులు కూడా చూసుకుంటుందని భ‌రోసా ఇచ్చారు రాజ‌మండ్రి ఎమ్మెల్యే, ఎంపి. ఏది ఏమైనా రాష్ట్రానికేదో ర‌సాయ‌న గండం ప‌ట్టింద‌ని.. గ‌త కొంత కాలంగా ఈ ర‌సాయ‌నాల గొడ‌వ రాష్ట్రంలో  చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌ని వాపోతున్నారు ప‌లువురు.

google-ad-img
    Related Sigment News
    • Loading...