Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ కేబినెట్ లో మహిళా మంత్రులు ముగ్గురూ.. ముగ్గురే!
posted on: May 13, 2022 12:41PM
పెట్టే చేయి కంటే..తిట్టే నోటితోనే కొంచం జాగ్రత్తగా ఉండాలని భావించారేమో ఏపీ సీఎం జగన్. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి మంత్రి వర్గంలో బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబులకు కీలక పోర్ట్ పోలియోలు కేటాయించారు. వారిరువురూ కూడా గతంలో జగన్ పై విమర్శనాస్త్రాలూ, వ్యంగ్యాస్త్రాలూ సాధించిన వారే. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ఆయన అదే సూత్రాన్ని పాటించారు. తన కేబినెట్ లో కీలక పదవులలో నియమించిన ముగ్గరు మహిళా మంత్రులూ ఒకప్పుడు తననూ, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డినీ నోరారా విమర్శించిన వారే. జగన్ తన కేబినెట్ లో కీలక పోర్టు పోలియోలు కేటాయించిన ముగ్గురు మహిళలూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన వారే. తెలుగుదేశం పార్టీలో ఉండగా వైఎస్ పై అంతకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డిపై విమర్శలు గుప్పించిన వారే. సరే దరిమిలా గోడ దూకి వైసీపీలో చేరారు. ఆ ముగ్గురూ ఆర్కే రోజా, విడదల రజనీ, తానేటి వనితలు. వారు గతంలో జగన్ పై విమర్శలను ఇప్పుడు వైసీపీ శ్రేణులు గుర్తు చేసుకుని ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడమంటే ఇదేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ముగ్గురు మహిళా మంత్రులూ కూడా తెలుగుదేశం పార్టీలో చురుకుగా వ్యవహరించిన వారే. పసుపు కండువా కప్పుకుని జగన్ పై నిప్పులు చెరిగిన వారే. ఆ తరువాత పార్టీ మారి ఫ్యాన్ గాలికి సేదతీరుతున్నవారే. కేబినెట్ లో తానేటి వనితకు కీలకమైన హోంశాఖ, విడదల రజనికి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్కే రోజాకు పర్యాటక శాఖ దక్కాయి.
వీరిలో తానేటి వనిత 2009లో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే మూడేళ్లలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ పంచన చేరారు. తెలుగుదేశంలో ఉండగా ఆమె జగన్ పై సుతిమెత్తటి విమర్శలే చేశారు. 2014 ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి జవహర్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికలలో అదే నియోజకవ్రగం నుంచి విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్ లో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పని చేసిన తానేటి వనతి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రమోషన్ పొంది హోంమంత్రి అయ్యారు. ఇక విడదల రజనీ విషయానికి వస్తే..
2018లో ఇలా జగన్ పార్టీలో చేరి.. అలా ఎమ్మెల్యే టికెట్ అందుకొని చిలకలూరి పేట ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. విడదల రజినీ 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున చురుకుగా ప్రచారం చేశారు. ఆ సమయంలో వైసీపీ అధినేత జగన్ పై విమర్శల బాణాలను గురిపెట్టారు. అప్పట్లో జగన్పై విడదల రజినీ విమర్శల నిప్పులు చెరిగారు. ఆ తరువాత నాలుగేళ్ల లోనే వైసీపీ గూటికి చేరారు. తాను అంతగా విమర్శించిన జగన్ చేతుల మీదుగా పార్టీ టికెట్ అందుకుని అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలి మంత్రి పదవిని సాధించారు.
ఇక రాజకీయ నాయకురాలిగా మారిన నటి ఆర్కే రోజా జగన్ పై చేసిన విమర్శల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలి హోదాలో జగన్ రెడ్డిపైనే కాదు, ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆమె వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఆ తరువాత కొద్దికాలానికే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కాంగ్రెస్ లో ఆమె ఉన్నది చాలా కొద్ది కాలమే. ఆ కొద్ది కాలం కూడా ఆమె ఉనికి కాంగ్రెస్ లో పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. ఆ తరువాత రోజా జగన్ తో పాటే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో వైసీపీ విపక్షానికే పరిమితం అయ్యింది. ఆర్కే రోజా మాత్రం నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో తెలుగుదేశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఆమె విమర్శలన్నీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు టార్గెట్ గానే ఉండటంతో జగన్ ఆమెను బాగా ప్రోత్సహించారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా జగన్ తొలి కేబినెట్ లో ఆమెకు స్ధానం దక్కలేదు. కానీ కీలకమైన ఊపీఐఐసీ చైర్మన్ పదవిని దక్కించుకో గలిగారు. ఇక తాజా కేబినెట్ విస్తరణలో రోజాకు కీలకమైన పర్యాటక శాఖ మంత్రిగా పదవి దక్కింది. తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం వైసీపీలో మాత్రం అసంతృప్తి పేరుకు పోయంది. ప్రత్యర్థి పార్టీలో ఉండి అధినేతపై తీవ్ర విమర్శలు గుప్పించి.. ఆ తరువాత పార్టీ మారి వచ్చిన వారికి కీలక పదవులు దక్కడంపై పలువురు నేతలు తమ ఆగ్రహాన్ని పెదవి మాటునే దాచేసుకుని రగిలి పోతున్నారు. మొదటి నుంచీ పార్టీలో ఉండి.. అధినేతకు విధేయంగా మెలిగిన వారిని కాదని, పార్టీ మారి వచ్చిన వారికి పదవుల అందలాలు దక్కడం పట్ల అంతర్గత సంభాషణల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు అయితే పార్టీ కార్యక్రమాలలో నామమాత్రంగా పాల్గొంటు, ఇంచు మించు సైలెంట్ అయిపోయారు.






