తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు.. జాప్యం వెనుక కథేంటంటే?

posted on: Oct 13, 2022 10:36PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అనేక అంశాలకు సంబదించి ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య  విభేదాలున్నాయి. రాష్ట విభజన జరిగి ఎనిమిదేళ్ళు అయినా ఇంకా తెలుగు రాష్టాల మధ్య విబేధాలు అలాగే   కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఐదారు నెలలకు ఒక సారి  ఉభయ రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తోంది. విబేధాల పరిష్కారం కోసం కేంద్ర హోం శాఖ పరిధిలో ఏర్పాటైన కమిటీ   చర్చలు జరుపుతోంది. అయినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా విబేధాలు పరిష్కారం కావడం లేదు.

సమస్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి. ప్రతి సారి చర్చల చివరాఖరులో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు కలిసి కూర్చొని సమస్యలు పరిష్కరించుకోండని కేంద్ర ప్రభుత్వం పెదరాయుడు తరహాలో ఉచిత సలహా ఒకటి ఇచ్చి చేతులు దులుపు కుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రయత్నం చేయవు. ముఖ్యమంత్రులు మాట్లాడుకోరు.అధికారులు కలుసుకోరు. ఒకరిపై ఒకరు విమర్శలు అయితే చేసుకుంటారు.ఇద్దరు కలిసి కేంద్రంపై నెపం వేస్తారు. కేంద్ర ప్రభుత్వం తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండని తమాషా చూస్తుంది. గడచిన ఎనిమిదేళ్ళుగా ఇదే కథ. ఇలాగే  నడుస్తోంది. 

అయితే అన్ని విషయాల్లో ఎలా ఉన్నా ఉభయ  తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్ల  పెంపు విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను సంఖ్యను పెంచాలని సూచించింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఆంధ్ర ప్రదేశ్ లో  175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాలని స్పష్టంగా పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని అంత వరకు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని, పదే పదే పార్లమెంట్ సాక్షిగా  స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని, అయితే 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్ర మంత్రి గత వర్షాకాల సమావేశాల్లో మరో మారు స్పష్టం చేశారు.
 మరో వంక  ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచాలని కానీ ఇంత వరకూ ఆ ప్రక్రియను మొదలు పెట్టలేదంటూ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ కె.పురుషోత్తమ్‌ రెడ్డి సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. పురుషోత్తం రెడ్డి పిటిషన్ పై సెప్టెంబర్‌లో విచారణ జరిగింది. ఆ విచారణ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

 అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం, సుప్రీం నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు వాయిదాల మీద వాయిదాలు కోరుతోంది. తాజాగా,  గురువారం (అక్టోబర్ 13) మరో మారు   సుప్రీం  కోర్టు  తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అదలా ఉంటే  కేంద్ర ప్రభుత్వం నియోజక వర్గాల పెంపు విషయంలో జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్టాలకు  ఒక విధానాన్ని, తెలుగు  రాష్ట్రాలకు మరో పద్దతిని పాటించడం వెనక  రాజకీయం ఉందని, ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ముఖ్యంగా తెరాస  సీట్ల పెంపుకోసం గట్టిగా పట్టుపడుతోంది.  సీట్ల సంఖ్య పెరిగితే, ఎన్నికల సమయంలో అసంతృప్తుల సంఖ్యను తగ్గించుకోవచ్చని తెరాస భావిస్తోంది.  అయితే  సీట్ల పెంపు వలన  ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి ఎలాంటి ప్రయోజానం కనిపించడం లేదు. అందుకే జమ్మూకశ్మీర్ లో నియోజక వర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసి ప్రక్రియ కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం ససేమిరా అంటోంది. ఏదో ఒక సాకుతో ..మెల్లగా 2026 వరకు నెట్టుకొచ్చే ఆలోచన చేస్తోందని అంటున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా గడవు లోగా కేంద్ర ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడవలసి ఉందనీ అంటున్నారు.

అయితే,  కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే  అవకాశాలు తక్కువే అని అంటున్నారు.  కేంద్రం  సుముఖంగా ఉన్నా జమ్మూ కశ్మీర్ లో నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. అంతే కాదు, సుప్రీ కోర్టు ధర్మాసనం జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల కేసులను తెలుగు రాష్ట్రాల కేసుతో కలిపి విచారిస్తోంది. సో .. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం లేదని, కేంద్ర ప్రభుత్వం పదేపదే చెపుతున్న విధంగా 2026 వరకు ఆగక తప్పదని అంటున్నారు. అంతవరకు ఇంతే ..

google-ad-img
    Related Sigment News
    • Loading...