ఛైర్‌పర్సన్ దొంగ ఓటు.. పదవికి ఎసరు?

posted on: Mar 19, 2021 4:08PM

ఆమె తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్. పేరు తాటికొండ స్వప్న. మార్చి 14న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. అంత వరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే వివాదం మొదలైంది. పట్టాభద్రుల కోటాలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్వప్నకు అసలు ఓటు హక్కు లేనేలేదు. అయినా.. ఆమె ఓటు ఎలా వేశారనేదే వివాదం. 

బూత్ నెంబర్ -283. ఓటరు సీరియల్ నెంబర్ 528. పేరు తాటికొండ స్వప్న. అయితే, తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న వేరు.. ఓటరు లిస్ట్‌లో ఉన్న స్వప్న వేరు. ఆ ఇద్దరూ ఒకరు కాదు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న భర్త పేరు పరిమళ్. 528 సీరియల్ నెంబర్లో ఉన్న స్వప్న భర్త పేరు తాటికొండ అశ్విన్. ఆ ఇద్దరు స్వప్నలు తోటికోడళ్లు. అందుకే, తోటికోడలు స్వప్న పోలింగ్ చీటీతో మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్వప్న దొంగ ఓటు వేశారు. ఈ విషయం పోలింగ్ బూత్‌లో ఉన్న కాంగ్రెస్ ఏజెంట్ గుర్తించారు. 

ఛైర్‌పర్సన్ స్వప్న దొంగ ఓటు వేశారంటూ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టారు. ఆమె దొంగ ఓటు వేసినట్టు తేల్చారు. తోటికోడలు పేరుతో నమోదైన ఓటును తన ఓటుగా చూపించి దొంగ ఓటు వేశారని తేల్చారు. 

తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంగ ఓటు వేశారని తేలడంతో స్వప్న రాజీనామా చేయాలంటూ బల్దియా ఆఫీసు ముందు విపక్షాల ఆందోళనకు దిగాయి. దొంగ ఓటు వేయడం చట్టరిత్యా నేరమని.. ఛైర్‌పర్సన్ హోదాలోని వ్యక్తే దొంగ ఓటు వేస్తే.. సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నైతిక బాధ్యత వహిస్తూ.. వెంటనే తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి తాటికొండ స్వప్న రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...