జయనామ సంవత్సరంలో తెలుగుజాతి జయహో

posted on: Mar 31, 2014 11:45AM

 

తెలుగు ప్రజలు ప్రాంతాల మధ్య విభజన రేఖ గీసుకొని విడిపోతున్నప్పటికీ, అందరూ నేడు ఉగాది పండుగ జరుపుకోవడం వారిమధ్య ఎన్నటికీ విడదీయలేని బంధాలున్నాయని తెలియజేస్తోంది. ఎన్నికల భేరి మ్రోగినప్పటి నుండి అధికారంలోకి వచ్చేందుకు తహతహలాడిపోతున్న ఆంధ్ర, తెలంగాణలలో వివిధ రాజకీయ పార్టీల నేతలు మాట్లాడుతున్న మాటలు గమనించినట్లయితే, కేవలం అటువంటి స్వార్ధ రాజకీయనాయకుల వలననే తెలుగు ప్రజల మధ్య నానాటికి దూరం పెరుగుతోంది తప్ప, నిజానికి రెండు ప్రాంతాల ప్రజల మధ్యన ఎటువంటి విద్వేషాలు లేవని స్పష్టమవుతోంది. ఇంతవరకు ఆంద్రా తెలంగాణా ఉద్యమాలలో విద్యార్ధులు, ఉద్యోగులు, సామాన్య తీవ్రంగా నష్టపోయారు. కానీ, ఆ ఫలాలు కొందరు ఉద్యోగ సంఘ నేతలకు, రాజకీయ నాయకులకే దక్కబోతున్నాయి. సదరు నేతలే మళ్ళీ ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చేందుకు ప్రజల భావోద్వేగాలను వారి బలహీనతలుగా భావించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల ఈ స్వార్ధ రాజకీయ నాయకులు చేస్తున్న ఈ విద్వేష ప్రచారానికి లోనయితే నష్టపోయేది తామే తప్ప వారు కాదని గ్రహించి, తాము వారు భావిస్తున్నట్లుగా బలహీనులముకామని, అటువంటి ప్రయత్నాలు చేసే వారికి తగిన గుణపాటం చెప్పగలమని నిరూపించి తెలుగుజాతి ఔనత్యాన్ని కాపాడుకోవాలి.

 

ఇంతవరకు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఉద్యమాలు చేసిన తెలుగు ప్రజలందరూ, ఇకపై ఇరుగుపొరుగులుగా మారి ఒకరికొకరు ప్రేమ పంచుకోవాలి. ఇంతకాలంగా ఇదే స్వార్ధ రాజకీయనేతలు రెండు ప్రాంతాలలో అధికారంలో, పదవులలో ఉన్నపటికీ వారు తమ ప్రాంతాలలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, రాజకీయవ్యాపారాలు చేసుకొంటూ కేవలం తమను తాము అభివృద్ధి చేసుకోవడం ప్రజలందరూ గమనించే ఉంటారు. కనుక ఇకనైనా రెండు రాష్ట్రాలలో ప్రజలు ఈ మాటల మాంత్రికులను కాక నిజంగా తమ తమ ప్రాంతాలను అభివృద్ధి చేయగలవారినే ఎన్నుకోవలసి ఉంటుంది.

 

ప్రాంతాలు వేరయినా తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటే. ఎవరు ఎక్కడ నివసిస్తున్నా వారందరూ తెలుగువారే.. మానవత్వం పరిమళించే భారతీయులే... ఈ జయనామ సం.లో తెలుగు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కోరుకొంటూ తెలుగువన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...