Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ కు జిగ్రీ దోస్త్ షాక్ ! విశాఖపై నిర్ణయం మారేనా?
posted on: Jan 20, 2021 2:30PM
మూడు నిర్ణయాలు.. ఆరు కొట్టివేతలు.. తొమ్మిది చివాట్లు. ఇదీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ 20 నెలల పాలనా తీరు. అనాలోచిత, అస్తవ్యస్థ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం.. వాటిని కోర్టులు కొట్టివేయడం.. న్యాయమూర్తుల నుంచి అక్షింతలు తినడం జగన్ రెడ్డి సర్కార్ కు పరిపాటిగా మారిపోయింది. మూడు రాజధానులు.. ఇంగ్లీష్ మీడియం... వైసీపీ రంగులు.. ఇలా అన్ని అంశాల్లోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలే తగిలాయి. జగన్ సర్కార్ తీసుకుంటున్న తికమక నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుందనే ఆరోపణలు ఏపీ జనాల నుంచి వస్తున్నాయి. అయినా తన తీరు మార్చుకోకుండా ముందుకు పోతున్నారు జగన్ రెడ్డి. అయితే తాజాగా సీఎం జగన్ కు ఆయన జిగ్రీ దోస్త్ కూడా షాకిచ్చారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సరికాదంటూ ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏపీలోని విశాఖకు తరలించొద్దని తెలంగాణ తేల్చి చెప్పింది. బోర్డు హెడ్ ఆఫీసును వైజాగ్లో ఏర్పాటు చేయాలని ఏపీ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురేకు లేఖ రాశారు. 2018 జూన్లో బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామని ఏపీ ప్రతిపాదన పంపిందని లెటర్లో పేర్కొన్నారు. 2019 అక్టోబరు 9న కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలోనూ హైదరాబాద్ నుంచి విజయవాడకు బోర్డు తరలింపు ప్రతిపాదనపై చర్చ జరిగిందన్నారు. గత ఏడాది జనవరి 20న నిర్వహించిన కృష్ణా బోర్డు 12వ మీటింగ్లోనూ విజయవాడకు తరలిస్తామనే ప్రతిపాదించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ వైజాగ్కు బోర్డు తరలిస్తామని ఏపీ చెప్పలేదని, పోయినేడాది అక్టోబరు 6న నిర్వహించిన రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఏపీకి బోర్డు తరలింపుపై మాత్రమే చర్చ జరిగింది తప్ప, వైజాగ్కు తరలించాలని కాదని తన లేఖలో తెలిపారు తెలంగాణ ఈఎన్సీ. బోర్డు తరలింపు విషయంలో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.
కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్న విషయంపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. కృష్ణా బేసిన్కు సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయడమేంటనే విమర్శలు వచ్చాయి. తన నిర్ణయాలతో పాలనలో జగన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ ను మించిపోయారని కొందరు సెటైర్లు వేశారు. నదీ జలాల పంపకాల బోర్డు ఎక్కడైనా ఆ నది బేసిన్లో ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా రివర్ బోర్డు ఆ బేసిన్ పరిధిలోనే ఉన్న హైదరాబాదులో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఈ బోర్డును ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని పునర్విభజన చట్టంలో పెట్టారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాదులోనే కృష్ణానది నీటి యజమాన్య బోర్డును ఉంచడానికి తెలంగాణ సర్కార్ ప్రయత్నించింది. ఇందుకు అంగీకరించని కేంద్రం.. ఏపీలోనే బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కర్నూలులో కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. ఇక్కడి అనుకూలతల గురించి నీటి పారుదల నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, రాయలసీమ ఉద్యమకారులు పూర్తి వివరాలతో నివేదిక అందజేశారు.
కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు కర్నూలు అందుబాటులో ఉంటుంది. కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేస్తే నీటి వినియోగంలో, కేటాయింపుల్లో తరచూ వచ్చే వివాదాలను పరిష్కరించుకోడానికి అనుకూలంగా ఉంటుందని మూడు రాష్ట్రాల నీటి పారుదల శాఖ నిపుణుల అభిప్రాయం. కర్నూలు సరిహద్దుల్లోనే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉండడం వల్ల త్వరలోనే తుంగభద్ర బోర్డును రద్దు చేసి కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డులో కలిపేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చన్న వాదన కూడా ఉంది. అయితే ఇవేమి పట్టించుకోని జగన్ సర్కార్.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న తమ ప్రతిపాదనకు బలం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా తెలంగాణ సర్కార్ కూడా విశాఖకు బోర్డును తరలించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేఆర్ఎంబీకి లేఖ రాయడంతో జగన్ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది. ముఖ్యంగా జగన్ కు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తూ.. అతన్ని తన మిత్రుడిగా బహిరంగంగానే ప్రకటించారు కేసీఆర్. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారే వ్యతిరేకిస్తున్నందున కృష్ణా బోర్డు ఏర్పాటును జగన్ ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.






