దిగ్విజయ్: తెలంగాణ తేలికైన విషయం కాదు?
posted on Jul 9, 2013 10:06AM
డా. ఎబికె. ప్రసాద్
(సీనియర్ సంపాదకులు)
"చల్లకోసం వచ్చి ముంత దాచటం" సాధ్యం కాదన్న సామెతకు చాలా అర్థం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎంత క్లిష్టమైనదో తెలిసి ఉండి కూడా, అందులోనూ ఏక భాషా సంస్కృతులు ఆధారంగా ఒక జాతిని రెండు రకాల పరాయి పాలకుల మధ్య (బ్రిటిష్, మొగలాయీ పాలకుల కింద), వాళ్ళ సామ్రాజ్య ప్రయోజనాల మధ్య పరాయి ప్రాంతాల్లో పుట్టకొకరు, చెట్టుకొకరుగా చెల్లా చెదరై ఉన్న తెలుగువారందరినీ భాషా ప్రయుక్త, రాష్ట్ర ప్రాతిపదికపైన ఒక్క గొడుగు కిందకు చేరుకోవటానికి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ మౌలిక లక్ష్యానికే చేటు తెచ్చే విభజన వాదన వల్ల మొత్తం తెలుగు జాతి ఉనికికే రాగల నష్టమెంతో తెలిసి ఉండి కూడా - కేవలం ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కోసం జాతీయ కాంగ్రెస్ నాయకత్వం 'రెండు ఆవుల దూడలా', రెండు నాల్కలతో తప్పుడు రాజకీయాలకు తెరలేపి కూర్చుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానంలో ఒక ముఖ్యుడు, నిన్నమొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాలు చూస్తూ వచ్చిన కేంద్ర మంత్రి అజాద్ స్థానంలో, అంతకు ముందు కొన్నాళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చూసి చాలించుకున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దౌత్య సంప్రదింపుల్లో మంచి లౌకికం ప్రదర్శించగల నేర్పుగల దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారకర్తగా నియమితులయిన తరువాత రాష్ట్రానికి వచ్చి, "రాష్ట్ర విభజన సమస్యపై" స్థానిక ప్రజల అవకాశవాద నాయకుల అభిప్రాయాలు తెలుసుకుని తిరిగి డిల్లీ వెళ్లారు. కాని ఏ "సమస్య" పరిష్కారం పేరుతో కేంద్రం తరపున (యు.పి.ఎ) దిగ్విజయ్ వచ్చారో, ఏ రకమైన తాత్కాలిక "మాండేట్"తో వచ్చారో, ఆ మాండేట్ లక్ష్యమేమిటో చెప్పకుండానే మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టారు. అందరి మాటలూ వినడమైతే విన్నారు. విభజనకు అనుకూల ప్రతికూల వర్గాల కబుర్లు విన్నారు; ప్రాంతాల్లోని అవకాశవాదుల మాటలు విన్నారు; అధికారంలో ఉన్నా ఊడినా కూడా నిత్యం కొట్లాడుకునే ఏకైక జాతీయ రాజకీయ పక్షంగా కొన్ని దశాబ్దాలుగా మనుగడసాగించుకుంటున్న కాంగ్రేస్లోని రాష్ట్ర శాఖీయుల మధ్య కుమ్ములాటలూ చూశారు. కొందరి దృష్టిలో ‘సిద్దడు వేమారం వెళ్లనూ వెళ్లాడు, తిరిగి రానూ వచ్చాడ’న్న సామెత ప్రకారం దిగ్విజయ్ కనిపించవచ్చు! కాని, అసహజమైన రాష్ట్ర విభజన ప్రతిపాదనపైన ఈనాడు కాదు ముప్పయ్యేళ్లనాడే (1972లో) నాటి ప్రధానమంత్రి దివంగతురాలు కాకముందు ఇందిరాగాంధి భారత పార్లమెంటు నిండు పేరోలగంలో నిష్కర్షగా నీజాయితీతో చేసిన విస్పష్టమైన ప్రకటనకు విరుద్ధంగా వెళ్ళడం సాధ్యపడదన్న అవగాహన ఉన్న అగ్రనాయకుల్లో దిగ్విజయ్ ఒకరు. నేడు ఇందిరాగాంధీ సజీవురాలై ఉండి ఉంటే 1972 నాటి ప్రకటనకు విర్ధుంగా వెళ్ళదు. సోనియా మౌనం వీడితేగాని విషయాలు మరింత సుబోధికం కావు!
ఆ మౌనాన్ని చేదించడానికే దిగ్విజయ్ యాత్ర. ఆ పూర్వా పరాలేగాదు, ఒక పెద్ద రాష్ట్ర (మధ్యప్రదేశ్) ముఖ్యమంత్రిగా విభజన వాదం వల్ల తన రాష్ట్రానికి కలిగిన కష్ట, నష్టాలన్నీ ఎలాంటివో కూడా ఆయనకు తెలుసు. అందుకనే తాజాగా మన రాష్ట్ర పర్యటన సందర్భంగా దిగ్విజయ్ అవకాశవాద రాజకీయాలకు పలు రకాల ప్రశ్నలను గుచ్చి గుచ్చి అడుగుతూ వచ్చారు. వాటిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న, ఆదాయ వ్యయాలకు సంబంధించిన ప్రశ్న (వినతి పత్రాలను పక్కన పెట్టించి) ‘ప్రస్తుతం రాజధాని హైదరాబాద్ నగరం నుంచే ర్ఱాష్ట బొక్కసానికి అత్యధికంగా ఆదాయం వస్తోందని లెక్కలు సృష్టంగా నిరూపిస్తున్నాయి. హైదరాబాద్ నగరం ఏ ఒక్కరిదో కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారూ, ఇతర రాష్ట్రాలకు చెందినవారూ, అనేక పరిశ్రమలు, కంపెనీలు ఇక్కడ స్థిరపడిపోయి ఉన్నందున అది అందరికీ చెందిన రాజధాని అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడం ఎలాగో ఎవరైన ఆలోచించారా’’ అని దిగ్విజయ్ ప్రశ్నించారని పత్రికా వార్తలు! ఈ ప్రశ్నకు పదవీకాంక్షలో ఉన్న రాజకీయ నిరుద్యోగులెవ్వరూ సరైన సమాధానంయివ్వలేకపోయారు. ఎందుకంటే ‘ఆంధ్రప్రదేశ్ అవతరణకు ఒకవైపు నుంచి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం కారణం కాగా మరొకవైపు నుంచి ఆంధ్ర, హైదరాబాద్ స్టేట్ శాసనసభలు మెజారిటీ సభ్యుల సంయుక్త తీర్మానాలు కారణమయ్యాయన్న సత్యాన్ని మరవరాదు. కనుకనే దిగ్విజయ్ కూడా రాష్ట్రంలోనూ, దేశంలోనూ నెలకొని ఉన్న పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే రాష్ట్ర విభజన సమస్యపైన కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
అంతకు ముందు శ్రీకృష్ణ కమిటీ నివేదిక తన ప్రాధాన్యం సమైక్య రాష్ట్రమే ననీ, తెలుగు ప్రజల భావి భాగ్యోదయానికి అదే శ్రీరామరక్ష అని అభిప్రాయం ప్రకటిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ (కోస్తా, రాయలసీమ, తెలంగాణా) అన్నింటి కంటే ఎక్కువగా వెనుకబడి ఉన్నది ఒక్క రాయలసీమ ప్రాంతమేననీ, అభివృద్ధికి సంబంధించి ఏ అంశాన్ని తీసుకున్నా రాయలసీమ వెనుకబాటు తనానికి లెక్కలన్నీ దాఖలాలుగా నిలిచాయనీ సృష్టం చేసినప్పుడు ‘మాకు లెక్కలతో, వాదనలతో పనిలేదు. మా (తెలంగాణా) రాష్ట్రం మాకిచ్చేయండి’’ అని రాజకీయ నిరుద్యోగ నాయకులు ఎదురు వాదించడం జరిగింది! కాని అప్పుడు ‘మాకు లెక్కలతో, వాదనలతో’ నిమిత్తం లేదన్నవీరు, ‘రేపు ఏర్పడే రెండు రాష్ట్రాల రాజధానుల్లో ప్రభుత్వాలకు ఆధాయ వనరులు ఒకే విధంగా ఉంటాయనీ, ఆధాయ పంపిణీ విషయంలో విభజన ఇబ్బందీలేమీ ఉండవనీ’ ఏభరోసాతో, ఏలెక్కమీద, ఏ గణాంకాల మీద ఆధారపడి చెబుతున్నారో కనీసం ‘కాకిలెక్కల్ని’ అయినా చూపి దిగ్విజయ్ ముందు నిరూపించలేకపోయారు! అదే సమయంలో వీరు, తోటి తెలుగువారిపై విద్వేష ప్రభావాన్ని (వాళ్ల ఆస్తులన్నీ మనం ఆక్రమించవచ్చు, వాళ్లను హైదరాబాద్ నుంచి, తెలంగాణా నుంచి తరిమివేస్తే, వాల్ల ఇళ్లూ, భుమూలూ సర్వస్వం ఆక్రమించుకోవచ్చు, ఫలితంగా ఉద్యోగాలన్నీ తెలంగాణా యువతకే దక్కుతాయ’న్న ప్రచారం) ముమ్మరం చేసి, ఒక భయ కంపిత వాతావరణాన్ని సృష్టించడం ద్వారా కల్పించిన ఆశలు నెరవేరకపోయేసరికి, తెలంగాణా బిడ్డల్ని ఆత్మహత్యలవైపునకు రాజకీయ నిరుద్యోగులైన నాయకులు బలవంతంగా నెట్టారు. ఈ తమ నేరస్త మనస్తత్వాన్ని తోటి తెలుగు ప్రజలపైకి నెడుతూ ఇప్పుడు ‘కేంద్రం నుంచి తెలంగాణా ఏర్పాటు నిర్ణయం రావడం ఆలస్యమవుతున్న కారణంగా ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయ’ని కేంద్రంపైకి నిందను నెట్టడానికి కూడా జంకలేదు!
అంతే కాదు, ‘‘2009 డిసెంర్ 9’’ ప్రకటన గురించి ప్రస్తావించినప్పుడు కూడా దిగ్విజయ్ సింగ్ సమాధానమిస్తూ ‘‘ఆ ప్రస్తావనలో చర్చ ప్రక్రియ ప్రారంభమైనదని చెప్పడంతో పాటు ఆ ప్రకటనలో సమస్యను రాష్ట్రా అసెంబ్లీ నివేదించి, అక్కడ తీర్మానం చేయాలని కూడా ఉందని’’ గుర్తుచేశారు! అంటే, ఇన్నాళ్లూ ఏర్పాటు వాదులయిన రాజకీయ నిరుద్యోగులు ‘అసెంబ్లీ తీర్మానం’ అవసరమని ‘‘2009 డిసెంబర్ 9’’ ప్రకటనలో ఉన్న షరతును కావాలనే మభ్యపెడుతూ వచ్చారని గమనించాల్సి ఉంది! అంతేగాదు, గతంలో బిజెపి వారి వేర్పాటు రాజకీయంతో ఎన్.డి.ఎ` బిజెపి సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రాలను చీల్చి ఏర్పాటు చేసిన ఛత్తీస్ఘడ్, ఉత్తారాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలను సహితం అసెంబ్లీ తీర్మానాల ద్వారా ఏర్పాటయినవేనని దిగ్విజయ్ గుర్తు చేయాల్సి వచ్చింది. అలాగే తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం మధ్యప్రదేశ్ను విచ్చిన్నంచేసి ఛత్తీస్ఖడ్ను ఏర్పరచడం వల్ల తామెన్ని కష్ట, నష్టాలకు, వేదనకు గురి అయ్యామో ఆయన మన రాష్ట్రంలోని మందమతులకు పదవీ కాంక్షపరులకూ గుర్తు చేయాల్సి వచ్చిందని మరచిపోరాదు, అందుకే ‘విభజన’ అనేది ‘అతిక్లిష్టం, బాధాకరం’ అని ఆయన పాఠం చెప్పాల్సి వచ్చింది! అందుకే దిగ్విజయ్ మరొక హెచ్చరిక కూడా ఈ పర్యటనలో చేయాల్సి వచ్చింది. కేంద్రం ఇంతకూ ‘ఏ నిర్ణయం’ తీసుకోబోతోందన్న విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఇలా హెచ్చరించారు.
‘రాష్ట్ర విభజన సమస్యపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన వ్యక్తులతో (కోర్కమిటీ) కూడిన సంఘం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. అన్నీ ఆలోచించాకనే కమిటీ ఒక నిర్ణయానికి వస్తుంది. రాష్ట్రాన్ని విభజించినా, యధాతథంగా సమైక్యరాష్ట్రంగానే కొనసాగించినా అందుకు రాష్ట్ర నాయకులంతా కట్టుబడి ఉండాల్సిందే, ఆ తరువాత జరగబోయే పరిణామాలను ధైర్యంగా ముందుండి ఎదుర్కొవడానికి కూడా మీరంతా సిద్ధంగా ఉండాలని’’ ఆయన హెచ్చరించారు! ఎందుకంతగా దిగ్విజయ్ ముందస్తుగా హెచ్చరించాల్సి వచ్చింది? అందుకూ ఆయన స్వయానుభవంతో యిలా స్వష్టం చేయాల్సి వచ్చింది.
'రాష్ట్ర విభజన అనేది చాలా క్లిష్టమైనది, బాధాకరమైనదీ, ఆ బాధేమిటో నేను స్వయంగా అనుభవించాను. నేను మధ్యప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగి ఛత్తీస్గఢ్ ఏర్పడిరది. అప్పట్లో చాలా ఇబ్బందులు కళ్ళారా చూశాను. అందువల్ల రాష్ట్రాన్ని విభజించడం ఆషామాషీ వ్యవహారం కాదు. బల్లలు, కుర్చీలు మొదలుకుని నీళ్లు, విద్యుచ్చక్తి, అప్పులు, ఆదాయాల దాకా ఎన్నెనో పంపిణీ చేయాల్సి ఉంటుంది. సమస్యలు కూడా చాలా ఉంటాయి. మధ్యప్రదేవ్ విభజన జరిగినప్పుడు విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఛత్తీస్ఖడ్లో ఉంటే వాడకందార్లందరూ మధ్యప్రదేశ్లో ఉండి పోయారు. అలాగే పంజాబ్ను వీడగొట్టినప్పుడూ ఈ బాధలనే ప్రజలు చావి చూడాల్సి వచ్చింది!
ఇదే (పంజాచ్ విభజన) సమస్యను ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగాను ప్రసిద్ధ పాత్రికేయులు, ఇంగ్లాండ్లో భారత మాజీ హైకమిషనర్ అయిన కులేదీప్నయ్యార్ కూడా పంజాబ్ విభజనవల్ల హర్యానా, పంజాబ్ పూచిరువురూ ఎలా దెబ్బతిన్నావో వివరించి, ఆంధ్రప్రదేశ్కు అలాంటి పరిస్థితిని కోరికోరి కొని తెచ్చుకోవద్దని హెచ్చరించి పోయాడని మరవరాదు! ఇదే స్ఫూర్తితో బహుశా దిగ్విజయ్సింగ్ కూడా స్వీయానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర పర్యటనలో ప్రాంతీయ రాజకీయ నిరుద్యోగుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ‘సమస్యను పరిశీలించబోమని’ ప్రత్యక్షంగా అనకుండా పరోక్షంగా విభజనవల్ల రాబోయే పరిణామాల గురించి పరోక్షంగా చెప్పక చెప్పక చెప్పాడు.
ఇంతకూ విచారకరమైన అసలు విషయం ` విజయాన్ని గాకుండా విషాన్ని పంచే విభజన సూత్రానికి 1969`71మధ్య కాలంలో తెలంగాణాలో భుస్వామ్య, జాగిర్దారీ దాష్టికాలతో పేద, మధ్యతరగతి ప్రజాబాహుళ్యాన్ని దోచుకు తినడంలో నిజాం ప్రభువుల కనుసన్నల్లో కీలకమైన పాత్రవహించిన కె.వి.రంగారెడ్డి కుటుంబీకుడు తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి కాగా ఈసారి ప్రాంతీయ రాజకీయ నిరుద్యోగులుగా కోస్తాంధ్ర నుంచి వలసవచ్చిన ‘బొబ్బిలి దొర’ కె.సి.ఆర్ కుటుంబం మచిలీపట్నం పూర్వ రంగంగా తెలంగాణాలో తిష్టవేసిన కె.కే. (కేశవరావ్) ఉద్యమ శల్య సారధులు కావటం!
‘ఛత్తీస్గడ్, ఉదాహరణ ‘వేరట, తెలంగాణా ‘సమస్య’ వేరట! కెసిఆర్ స్థానిక పార్టీతో పడని ‘తెలంగాణా సంయుక్త కార్యాచరణ సంఘం’ (టి.జె.ఎ.సి)లో మళ్లీ లుకలుకలు, ఆ రెండిరటికీ పడకపోగా, పరస్పరం అలకలు, ఖండన మండనలతో కాలక్షేపం చేస్తూ ఉస్మానియా విశ్వవిధ్యాలయ ఆచార్య పదవికి సెలవుపెట్టి, ఇన్నాళ్లుగానూ నెలవారీ జీతం సజావుగానే పొందుతూ మాత్రం ఢోకా లేకుండా పొందుతూ ‘టి’ జాక్ ఉద్యమానికి మాత్రం నాయకత్వం వహిస్తున్న కోదండరామరెడ్డితో దళిత, బహుజన వర్గాల నాయకులకు పడకపోవడం మరో ‘ఫార్సు’, ‘సామాజిక తెలంగాణా’ వాదులలో పెక్కుమందికి కెసిఆర్, కోదండరామ్ విభాగాల పొడగిట్టదు. అందుకని రాజకీయ ‘దుకాణాలు’ మారిపోతున్నాయి! వందలకోట్ల రూపాయలను కెసిఆర్ ‘ఉద్యమం’ పేరిట వసూళ్లు చేసుకుని కుటుంబాన్ని మల్టీనేషనల్ కంపెనీగా మార్చాడని దళిత వర్గ నాయకురాలు గజ్జెల కాంతం దండోరా వేస్తుండగా, కె.సి.ఆర్ ‘సకల జనుల సమ్మె’ను రూ.50 కోట్లకు అమ్మేశాడని స్వయాన కె.సి.ఆర్. సోదరుడి కూతురు రమ్య చాటుతోంది!
ఇక కోదండరామ్ తరపున వెలువడుతున్న విచిత్ర ప్రకటనల్లో తాజా వార్త - వాళ్లూ వీళ్లూ కాదు సరాసరి సోనియాగాంధీ నుంచే కోదండరామ్కు పిలుపు రానున్నదన్న ప్రచారం. ఇది ప్రధానంగా స్థానిక బడా పెట్టుబడిదారుడైన రాజాం నేతృత్వంలో నడుస్తున్న పత్రికలో తప్ప ఇతర పత్రికల్లో రాలేదు. ‘తెలంగాణా రాష్ట్రం’ ఏర్పాటుకోసం ఉద్యమాన్నిమోపుచేసే పేరిట ప్రస్తుతం కోదండరామ్ ఢిల్లీలో విభజన ప్రేమికులయిన కొన్నిచిల్లర పార్టీల నాయకులతో ఓ రౌండ్ టేబుల్ సమావేశం జరిపారు. ఇది ఇలా ఉండగానే లోకసభ మాజీ స్వీకర్ సంగ్మా రెండవ ఎస్.ఆర్.సి. (రాష్ట్రాల పునర్విభజన పరిశీలనా సంఘం)ని ఏర్పాటు చేయడం ఉత్తమమని ప్రతిపాదించారు. అయితే చరిత్ర తెలియని కొందరు ప్రాంతీయ రాజకీయ నిరుద్యోగనాయకులు పూర్వపు తెలంగాణా రాష్ట్రమే తమకు అభిలషణీయమని దిగ్విజయ్కు ఒక నివేదిక అందజేశారు! చారిత్రక అజ్ఞానానికి హద్దులుండవు. ఎందుకంటే తెలంగాణా ఏనాడూ రాష్ట్రంగా లేదు. అది హైదరాబాద్ సంస్థానపు పరాయి పాలకుల (మోగలాయిల`బహమనీల`నిజాముల)పాలనలో నలిగిపోయిన ప్రాంతాలలో ఒక భాగం మాత్రమే! ఈ విషయం కోదండరామ్ ప్రభృతులకు తెలియక పోవచ్చునేమోగాని, తెలంగాణా సాయుధపోరాటానికి నాయకత్వం వహించిన అగ్రశ్రేణి తెలంగాణా నాయకులయిన దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణరెడ్డి ఎట్టి అనుమానాలకు తావులేకుండా స్పష్టం చేశారు.
దేవులపల్లి వెంకటేశ్వరరావు ‘తెలంగాణా ఒక రాష్ట్రంగా ఏనాడూ లేదు. తెలంగాణా ఆంధ్రప్రదేశంలో ఒక భాగం. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడేదాకా తెలంగాణా జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నాయి. భారతదేశంలో బ్రిటీష్ పాలన ఏర్పడిన తర్వాత హైదరాబాద్ సంస్థానం ఎన్నడూ స్వతంత్ర రాజ్యంగా లేదనేది ఒక వాస్తవ విషయం. (అంతేగాదు) తెలంగాణా ప్రజలు ఆంధ్రజాతిలో ఒక భాగమే కాని, ప్రత్యేక జాతి కాదు. కనుక స్వయం నిర్ణయహక్కు ఉండేది ఆంధ్రజాతికే గాని, తెలంగాణా ప్రజలకు కాదు. పాలక వర్గాలలో తెలంగాణాకు చెందిన ఒక బలమైన భుస్వామ్య వర్గం, వర్తక వ్యాపారాలలో ఒక భాగం, ఉద్యోగస్తులు అంతా ఆంధ్రప్రజదేశ్ ఏర్పడడాన్ని వ్యతిరేకించారు. ప్రత్యేక తెలంగాణా కామ్, యిలాంటి చిన్న రాష్ట్రాల నిర్మాణానికేమీ నేటి పాలక వర్గాలు వ్యతిరేకమనే భావం తప్ప. తమ స్థానాన్ని బలపర్చుకోవటానికి ఒకే భాషా ప్రాంతాన్ని కూడా విడదీసి చిన్న రాష్ట్రాలు ఏర్పరచడానికి వారు ఎప్పుడూ వెనుకాడరు. ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక రాయలసీమ నినాదాలను కూడా మరికొన్ని పాలక వర్గ ముఠాలు లేవనెత్తుతున్నారనేది గమనించాలి. బడా బూర్జారా వర్గం, విదేశీ పెట్టుబడి, భుస్వామ్య వర్గాల పాలనే సమస్యలన్నింటికీ మూలకారణమనేది స్పష్టం. దేశ సమస్యల నుంచి ఆంధ్రప్రదేశ్ సమస్యలను విడదీసి చూడటం అవాస్తవికమవుతుంది. అశాంతి, అలజడులకు ప్రాంతీయ అసమానతలు, నిరుద్యోగం మూల కారణాలు. ఈ సమస్యలు అటు ప్రత్యేక రాష్ట్రంలోగాని, ఇటు సమైక్య రాష్ట్రంలో గానీ పరిష్కరింపబడజాలవు. (‘జాతీయ సమస్య’ డాక్యుమెంటు నుంచి)!
ఈ వివరణలకు తాజాగా ఇటీవల కాలంలో గులామ్నబీ అజాద్ అధికార హూదాలో చేసిన ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములన్నవి ‘విభజన’పైన ఆధారపడి వుండబోవని గుర్తు చేస్తూ లడక్ ప్రాంత అనుభవాన్ని ఇలా పూసగుచ్చి చెప్పారు.‘లడఖ్ ప్రాంతాన్ని మూడు జిల్లాలుగా విభజించాలని నాలుగు దశాబ్ధాలుగా డిమాండ్ ఉండేది. కాంగ్రెస్కు కలిసి వస్తుందని నేను ముఖ్యమంత్రిగా ఉండగా వాటిని ఏర్పాటు చేయించాను తీరా ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్కు ఒక్కటంటే ఒక్క సీటూ రాలేదు’’! అనుభవం అమృతం లాంటిదంటారు! అందుకేనేమో!