నల్గొండ జిల్లాలో పత్తిరైతు ఆత్మహత్య
Published on: Sat Oct 25, 2014 9:31AM

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ రైతుల ఆత్మహత్యల ఉదంతాలు నమోదవుతూనే వున్నాయి. ఒక్కోరోజు అయితే ఐదారుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ వుండటం భయాందోళనలు కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రైతుల ఆత్మహత్యలు మూడు వందలకు దాటిపోయాయన్న వార్తలు వస్తున్నాయి. అయితే రైతుల ఆత్మహత్యల మీద ప్రభుత్వం నుంచి స్పందన లభించడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాడు మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాణిలో రామకృష్ణారెడ్డి అనే పత్తిరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోవడం, అప్పుల బాధ పెరిగిపోవడం వల్ల రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.


