అమానుషం.. విద్యార్థుల చేత బెంచీలు మోయించిన గురువులు

posted on: Apr 25, 2022 4:37PM

ఆంధ్రప్రదేశ్ లో ఏ వ్యవస్థా సరిగా లేదు. భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దాల్సిన వ్యవస్థ కూడా అధ్వాన స్థితిలోకి వెళ్లిపోయింది. అలాగే గురువులు కూడా తమ సహజసిద్ధ బాధ్యతను విస్మరించి విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అసలు తల్లీ, తండ్రీ తరువాతి స్థానాన్ని గురువుకు ఇచ్చారు. విద్యార్థలకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు వారి బాగోగులు చూడాల్సిన బాధ్యతా గురువులదే. అటువంటి గురువులు తమ బాధ్యతను విస్మరించి పిల్లల చేత బల్లలు మోయించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. అమానవీయమైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

ఈ నెల 30 నుంచి రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఉరవ కొండ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులు కూర్చునేందుకు పాఠశాలలో బెంచీల కొరత ఉంది. అందుకోసం వారు బెంచీల గురించి వాకబు చేయగా పక్కనేఉన్న రేకుమాకుల పల్లి ప్రభుత్వ పాఠశాలలో బెంచీలు అదనంగా ఉన్నాయని తెలుసుకున్నారు. అంతే వెంటనే ఆ బెంచీలు తీసుకువచ్చే పనిని విద్యార్థులకు అప్పగించేశారు. 

పిల్లలు వారి చేత అటువంటి పనులు చేయించకూడదన్నఇంగితాన్ని మరచిపోయి తమ వద్ద చదువకునే విద్యార్థులను కూలీలుగా భావించి పొరుగూరి పాఠశాల నుంచి బెంచీలు మోసుకురావాలని పురమాయించారు. విద్యార్థులు గురువుల ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించారు. ఈ ఘటన సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం కావడంతో సదరు ఉపాధ్యాయులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల చేత పనిచేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...