TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూటమి ఏడాది పాలన భేష్.. కొందరు ఎమ్మెల్యేలపైనే అసంతృప్తి!?

Published on: Sat Jun 14, 2025 9:37AM

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది.  అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సర్కార్ పని తీరు పట్ల జనం సంతృప్తిగానే ఉన్నారు. అయితే ఆల్ ఈజ్ వెల్ అన్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదని కూటమి వర్గాలలోనే గట్టిగా చర్చ జరుగుతోంది. కూటమి పార్టీల నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేల పని తీరు పట్ల ఇటీవల సీఎం చంద్రబాబు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొందరి పని తీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్న సంగతి తెలిసిందే.  

అలాగే కొందరు మంత్రులు కూడా ప్రజలలో మమేకం అవ్వడం లేదనీ, పూర్తిగా కార్యాలయాలకే పరిమితమౌతున్నారనీ చంద్రబాబు పేర్కొన్నారు. జనాభిప్రాయం కూడా ఇలాగే ఉంది.  కొందరు జనాలకు దూరంగా ఉంటున్నారనీ, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో చొరవ చూపడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొందరైతే ఇసుక, మైనింగ్ వ్యవహారాలలో పూర్తిగా తలమునకలై ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో  వందలాది లారీల ఇసుక తరలి పోతోందని ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ పిఠాపురం వర్మ ఇటీవల ఒకింత అసహనం వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.  గత వైసీపీ హయాంలో ఎవరైతే ఈ దందాలో కీలకంగా ఉన్నారో.. వారే ఇప్పుడు యథేచ్ఛగా ఈ దందాను నడిపిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ విషయాన్ని చంద్రబాబు, పవన్ దృష్టికి తీసుకువెడతానని చెప్పారు. 

అయితే మొత్తం మీద ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలలో సానుకూలత ఉన్నా కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు పట్ల మాత్రం ప్రజలలో అసంతృప్తి వ్యక్తమౌతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పారు. తాన సేకరించిన సమాచారం మేరకు కొందరి తీరు బాగా లేదనీ, వారిలో మార్పు రాని పక్షంలో చర్యలు తప్పవనీ కుండబద్దలు కొట్టారు.  చంద్రబాబు వ్యాఖ్యలు, హెచ్చరికల తరువాత రాష్ట్రంలో కూటమి పార్టీలో ఎమ్మెల్యేల పనితీరు పై చర్చ మొదలైంది.  ఏడాది కాలంలోనే కొందరు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలలో అసంతృప్తి పీక్స్ కు చేరిందన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇలా ఆరోపనలు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు తొలి సారి ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. వీరిపై ప్రధాన ఆరోపణ   ప్రజలకు అందుబాటులో  ఉండటం లేదు అన్నది. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి వారిని పనితీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు చెబు తున్నారు.