తెలుగుదేశం పార్టీ 38 ఏళ్ల ప్రస్థానంలో...

తెలుగు దేశం పార్టీ ఆదివారం 39వ ఏట అడుగుపెట్టింది. 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా, ప్రజల హర్షద్వానాల మధ్య తన పార్టీ పేరు 'తెలుగుదేశం' అని ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత 9 నెలలకే టీడీపీ అధికారంలోకి రాగా.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటైన టీడీపీ.. ఆవిర్భావం నాటి నుంచి ఎన్నికల్లో వేరే పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగుతోంది. 1983 మొదలు ప్రతి ఎన్నికలోనూ టీడీపీ వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంది. 38 ఏళ్ల ప్రస్థానంలో...

టీడీపీ తొలిసారి పోటీ చేసిన 1983 ఎన్నికల్లో మేనకా గాంధీ నాయకత్వంలోని సంజయ్ విచార్ మంచ్‌తో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్‌కి ఎన్టీఆర్ ఐదు స్థానాలను కేటాయించారు. తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 201 స్థానాలను గెలుచుకుంది.

ఇందిరాగాంధీ హత్య తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పట్ల సానుభూతి వ్యక్తమైంది. కానీ ఏపీలో మాత్రం టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది.

బీజేపీకి దేశం మొత్తం మీద రెండు సీట్లు దక్కితే.. అందులో హన్మకొండ ఒకటి కావడం గమనార్హం. లోక్‌సభలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.

1989 ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ, వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి. కానీ టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది.

1994లో టీడీపీ వామపక్షాలతో మాత్రమే కలిసి పోటీ చేసింది. 216 స్థానాల్లో గెలిచిన టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ సీఎం అయ్యారు.

1995లో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.

1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బాబు నాయకత్వంలోని టీడీపీ లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసింది. కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పాటైంది.

1999లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యారు.

2004లో మరోసారి టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ గెలుపొందింది. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల తర్వాత బీజేపీకి టీడీపీ దూరమైంది.

2009లో టీఆర్‌ఎస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి మహాకూటమిగా టీడీపీ పోటీ చేసింది. కానీ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది.

2014 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ బీజేపీతో కలిసి పోటీ చేసింది. జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీకి దిగకున్నా.. టీడీపీ-బీజేపీ కూటమికి సపోర్ట్ చేసింది. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమి గెలుపొందింది. చంద్రబాబు సీఎం అయ్యారు.

2019 ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలతో క‌లిసి పోటీ చేసింది.