గంభీర్పై నెట్టింట విమర్శల వెల్లువ
posted on: Feb 23, 2026 4:56PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భారత్ తన తొలి మ్యాచ్లోనే ఘోర పరాజయాన్ని చవిచూసింది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఓడింది. అయితే తుది జట్టులో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుందర్ అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ విఫలమయ్యాడు. దీంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక నిర్ణయాల్లో తప్పిదాలపై మరోసారి చర్చ మొదలైంది.
భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ అక్షర్ పటేల్ను ఆడించకపోవడంపై స్పందించాడు. జట్టు ఎంపిక పూర్తిగా ‘కాంబినేషన్’ ఆధారంగా జరిగిందని తెలిపారు. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్లో క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్, డేవిడ్ మిల్లర్ వంటి ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో ఆఫ్ స్పిన్నర్ అవసరమని భావించామని చెప్పారు. పవర్ప్లేలో ఎడమచేతి బ్యాటర్లపై ప్రభావం చూపగల బౌలర్ అవసరమయ్యాడని, వాషింగ్టన్ ఆ దశలో బౌలింగ్ చేయగలడని భావించామని, అందుకే అక్షర్కు బదులుగా అతడిని ఎంచుకున్నట్లు వెల్లడించాడు.
సౌతాఫ్రికా టాప్ ఆర్డర్లో ఎడమచేతి బ్యాటర్లను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం ఫలించలేదు. పవర్ప్లే లెక్కలు సరైనప్పటికీ, మధ్య ఓవర్లలో అక్షర్ లాంటి అనుభవజ్ఞుడి కొరత స్పష్టంగా కనిపించిందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుందర్ కంటే అక్షర్ పటేల్ అన్ని విషయాల్లోనూ బెటర్. ఈ విషయాన్ని గౌతమ్ గంభీర్కు ఎవరూ చెప్పలేదా? ప్రధాన కోచ్ ఇకనైనా తీరు మార్చుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.




.webp)


