పెళ్లయిన నాలుగు నెలలకే...

 

కొత్తగా పెళ్లయిన ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. పెళ్లయిన నాలుగు నెలలకే ఈ దారుణం జరిగింది. నెల్లూరు జిల్లా బోడిగారితోటలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్‌గా పనిచేసే విశ్వనాథం, కె. ప్రమీల నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే సోమవారం తెల్లవారుజామున ప్రమీల ఇంట్లో మృతి చెందింది. ఆ సమయంలో ప్రమీల భర్త ఇంట్లోనే ఉండటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ప్రమీల ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రమీల కుటుంబసభ్యులు భర్తే తమ కూతుర్ని చంపాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.