సూర్యాపేట నిందితుల ఎన్‌కౌంటర్

 

నల్గొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్ సమీపంలో మూడు రోజుల క్రితం పోలీసులపై కాల్పులు జరిపిన దోపిడీ దొంగలు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్ అయిపోయారు. శనివారం ఉదయం మోత్కూరు మండలం జానకీపురం శివారులో పోలీసులు ఈ ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్లో ఇద్దరు నిందితులు అక్కడికక్కడే హతం కాగా మృతుల నుంచి రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం దుండగులు జరిపిన ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందగా, ఆత్మకూరు సీఐ సిద్ధిఖీ పరిస్థితి విషమంగా ఉంది. రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. గత మూడు రోజులుగా సూర్యాపేట కాల్పుల ఘటన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. శనివారం ఉదయం దుండగులు పోలీసులకు తారసపడ్డారు. పోలీసులను నుంచి తప్పించుకున్న వారు ఓ వ్యక్తిని బెదిరించి బైక్పై పరారయ్యారు. దాంతో పోలీసులు ఛేజ్ చేసి వారిని హతమార్చారు.