TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా?.. అర్థంతరంగా ముగిసిన కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటన

Published on: Tue May 24, 2022 7:05AM

ఎంతో ఆర్భాటంగగా మొదలైన కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటన అర్థంతరంగా ముగిసింది. ఆయన  తన పర్యటనను ముందుగానే ముగించుకుని వెనుదిరగడంపై రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. విపక్షాలు విమర్శలతో కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. కారణాలేమైతేనేం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన అర్ధంతరంగా ముగిసింది. వారం రోజులకు పైగా షెడ్యూల్ వేసుకుని దేశ వ్యాప్తంగా పర్యటించి జాతీయ రాజకీయాలలో గ్రాండ్ లా ల్యాండ్ అవ్వాలన్న వ్యూహంతో బయలు దేరిన కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్ కు పీఛేముఢ్ అంటూ వెనుదిరిగి వచ్చేశారు.

ఇంతకీ ఆయన తన దేశ వ్యాప్త పర్యటనలో ఇంత వరకూ కలిసినదెవరంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లను మాత్రమే షెడ్యూల్ ప్రకారం పంజాబ్ , కర్నాటక తదిత రాష్ట్రాలలో కూడా పర్యటించాల్సి ఉన్నా, పంజాబ్ లో రైతులకు సాయం అందించడంతో తన పర్యటనను ముగించారు. దీనికి కారణాలేమిటన్నదానిపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి.  పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండటం, తానూ విదేశీ పర్యటనలో మరిన్ని రోజులు ఉంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారుతాయన్న భయంతో తిరిగి వచ్చేశారనీ, కేటీఆర్ దావోస్ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే మళ్లీ దేశ వ్యాప్త పర్యటనను కొనసాగిస్తారనీ తెరాస వర్గాల కథనం.

 మరో వైపు దేశంలో ఏ పార్టీ అధినేత కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ తో భేటీకి పెద్దగా సుముఖత చూపడం లేదనీ, ఆ కారణంగానే దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రయోజనం లేదన్న భావనతోనే కేసీఆర్ తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని వెనుదిరిగారనీ విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నారు.

కేసీఆర్ జాతీయ అజెండా పేరుతో  రచించిన వ్యూహం ఏమిటన్నదానిపై స్పష్టత లేకపోవడం, ఆయన చెబుతున్నట్లుగా రాష్ట్రపతి ఎన్నికలో జరగబోయే సంచలనమేమిటన్నది అర్ధం కాకపోవడంతో రాజకీయ పార్టీల నేతలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆయనతో భేటీ వల్ల ఏం ఒరుగుతుందన్న భావనతోనే దూరంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే కేసీఆర్ పర్యటన  అర్ధంతరంగా ముగించుకుని వెనుదిరిగారని వారు చెబుతున్నారు.