Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్రిటీషు వారిని గడగడలాడించిన బోస్ గురించి తెలియని రహస్యాలు!
posted on: Jan 23, 2026 1:19PM

సుభాష్ చంద్రబోస్ పేరు వెంటే భారతీయుల ఒళ్ళు పులకరిస్తుంది. ముఖ్యంగా భారత యువతలో దేశ భక్తి పొంగుతుంది. భారతీయులను బానిసలుగా చేసుకుని దేశాన్ని దోచుకున్న బ్రిటీషు వారిని గడగడలాడించిన వ్యక్తిగా సుబాష్ చంద్రబోస్ అందరికీ సుపరిచితం. అందరూ బోస్ అని ముద్దుగా పిలుచుకునే చంద్రబోస్ జనవరి 23వ తేదీ, 1897లో జన్మించారు. ఈయన జన్మస్థలం కటక్.. జానకీనాథ బోస్, ప్రభావతి దేవి ఈయన తల్లిదండ్రులు. సుభాష్ చంద్రబోస్ జయంతి రోజును పరాక్రమ్ దివస్ గా జరుపుకుంటారు. ఆయన దైర్యం, త్యాగానికి ప్రతీకగా ఈ రోజును జరుపుకుంటారు. ఆయన జీవితం అంతా తెలిసినదే అనిపించినా, బయటికి ఎక్కువగా రాని రహస్యమైన, కీలకమైన, లోతైన విషయాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి స్పష్టంగా తెలుసుకుంటే..
బ్రిటీష్ ఇంటెలిజెన్స్ విషయంలో..
గాంధీజీని బ్రిటిష్లు “నెగోషియబుల్ శత్రువు”గా చూశారు. కానీ సుభాష్ చంద్రబోస్ను మాత్రం “నియంత్రించలేని విప్లవకారుడు”గా పరిగణించారు.
బ్రిటిష్ MI5, MI6 ఫైళ్లలో ఆయన పేరు మీదే అత్యధిక నిఘా నివేదికలు ఉన్నాయి. ఆయనపై నిఘా భారతదేశంలోనే కాదు.. జర్మనీ, ఇటలీ, జపాన్లలో కూడా సాగింది.
ఈ వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యానికి చాలా ప్రమాదకారి అని ఒక బ్రిటిష్ అధికారి వ్యాఖ్యానించారంటే బోస్ వారిని ఎంత భయపెట్టి ఉంటాడో ఊహించుకోవచ్చు. అంటే బ్రిటిష్లు నిజంగా భయపడింది గాంధీజీ కంటే ఎక్కువగా నేతాజీకే.
జర్మనీ–హిట్లర్ సంబంధం.. నిజానిజాలు..
చాలామంది నేతాజీ హిట్లర్తో కలిసి పనిచేశాడు బోస్ గురించి అపార్థం చేసుకున్నారు. కానీ నేతాజీకి హిట్లర్ జాతి సిద్ధాంతాలపై తీవ్ర అసహ్యం ఉంది. భారతీయులు ఆర్యులు కాదు అన్న హిట్లర్ వ్యాఖ్యను నేతాజీ తీవ్రంగా ఖండించాడు. హిట్లర్ను కలవడానికే నేతాజీ పెద్దగా ఆసక్తి చూపలేదు
కాకపోతే ఆయన చెప్పింది మాత్రం ఒక్కటే.. బ్రిటిష్ శత్రువు – నా మిత్రుడు అని. ఇది వ్యూహం మాత్రమే, సిద్ధాంతం కాదు.
ఆజాద్ హింద్ ప్రభుత్వం..
ఇది కేవలం ప్రతీక కాదు. 1943లో నేతాజీ స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ప్రకటించారు. జపాన్, జర్మనీ, ఇటలీ సహా 9 దేశాలు అధికారికంగా గుర్తించాయి.
ఆయన వద్ద స్వంత కరెన్సీు, పోస్టల్ స్టాంపులు, న్యాయస్థానాలు, మహిళా సైన్యం కూడా ఉన్నాయి. భారతదేశానికి గాంధీజీ కంటే ముందే ప్రధాని లాంటి పాత్రను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోషించాడు.
మహిళలకు యుద్ధంలో స్థానం..
రాణి ఝాన్సీ రెజిమెంట్:-
ఇది పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విభాగం. అప్పట్లో యూరప్లో కూడా ఇది అసాధారణం. మహిళలు ఆయుధాలు ధరించి ముందుండాలని నేతాజీ స్పష్టంగా చెప్పారు భారతదేశంలో మహిళా సాధికారతను యుద్ధ స్థాయికి తీసుకెళ్లిన తొలి నాయకుడు ఆయన.
గాంధీజీతో విభేదాలు..
గాంధీకి, నేతాజీకి మధ్య విభేదాలు ఉన్న.. గాంధీజీ నేతాజీని దేశభక్తులలో దేశభక్తుడు అన్నారు. నేతాజీ గాంధీజీని జాతిపిత అని గౌరవించారు.
వివాదం ఒక్కటే..
గాంధీజీ అహింసనే ఆయుధంగా మార్చుకున్నాడు. అదే దిశలో పోరాటం జరగాలని అనుకున్నాడు. కానీ నేతాజీ మాత్రం.. అవసరమైతే సాయుధ పోరాటం తప్పు కాదని, సాయుధ పోరాటంతోనే బ్రిటీషర్ల నుండి దేశానికి విముక్తి సాధ్యమని స్పష్టం చేశారు.
గాంధీ,నేతాజీ మధ్య వ్యక్తిగత శత్రుత్వం ఏదీ లేదు.. రెండు మార్గాల మధ్య తాత్విక పోరాటమే వారి మీద శత్రువులు అనే ముద్ర వేసింది.
రహస్య రేడియో ప్రసారాలు..
నేతాజీ రేడియో ప్రసారాల ద్వారా భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రసారాలు జర్మనీ, జపాన్ నుంచి జరిగాయి. బ్రిటిష్లు ఆ సిగ్నల్స్ని ఆపలేకపోయారు. ఆ ప్రసారాలు వినడం నేరంగా ప్రకటించారు. సమాచార యుద్ధంలో కూడా ఆయన ముందే ఉన్నారు.
నేతాజీ మరణం.. మిస్టరీ..
నేతాజీ మరణం – ఇప్పటికీ ఓ మిస్టరీ
నేతాజీ మరణం గురించి ఒక అధికార కథ ప్రచారంలో ఉంది. 1945లో తైవాన్ విమాన ప్రమాదం జరిగిందని, అందులో బోస్ మరణించాడని చెబుతారు.
కానీ అనేక ప్రశ్నలు పజిల్స్ గా ఉండిపోయాయి..
విమాన ప్రమాదంలో శవం దొరకలేదు. ఆ శవం ఎక్కడుంని ప్రశ్న.. DNA పరీక్ష ఎందుకు జరగలేదని కూడా ప్రశ్న ఉంది.
జపాన్ రికార్డుల్లో అస్పష్టత ఉంది. భారత ప్రభుత్వం ఫైళ్లను దశాబ్దాల పాటు రహస్యంగా ఉంచింది.
అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నేతాజీ కుటుంబసభ్యులే విమాన ప్రమాద కథను అనుమానించారు. ఆయన మరణం కంటే ఆయన జీవించి ఉండవచ్చన్న సందేహమే ఎక్కువ బలంగా ఉంది.
స్వతంత్ర భారతానికి ఆయన కల..
నేతాజీ దేశం గురించి చాలా కలలు కన్నాడు. బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలని, శాస్త్రీయ, పరిశ్రమాధారిత ఆర్థిక వ్యవస్థ ఉండాలని, మతపరమైన రాజకీయాలకు స్థానం ఉండకూడదని, క్రమశిక్షణ, జాతీయవాదం ముఖ్యంగా ఉండాలని కోరుకున్నాడు.
ఆయన బతికి ఉంటే, భారత రాజకీయ దిశ పూర్తిగా వేరేలా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం.
1946లో జరిగిన రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుకి ప్రధాన ప్రేరణ.. INA ట్రయల్స్.. నేతాజీ ప్రభావమే.. ఇది బ్రిటీషర్లకు చాలా పెద్ద షాక్ ఇచ్చింది. ఈ కారణంగానే నేతాజీ భారత్ ను వదిలి వెళ్లారని అంటారు.
నేతాజీ అంటే ఒక నాయకుడు కాదు.. ఆయన శత్రువుల పాలిట సింహ స్వప్నం. దేశాన్ని దోచుకున్నవారికి ఆయన పేరు ఒక భయంకరమైన ప్రశ్న..
*రూపశ్రీ.






