స్పెయిన్ యువరాణి మరియా థెరిసా మృతి

కరోనా కాటుకు స్పెయిన్ యువరాణి మరియా థెరిసా (86) మృతి చెందారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్‌లో యువరాణి మారియా థెరిసా మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇక ఇప్పటికే స్పెయిన్‌లో కరోనా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని కబలించేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదలడం లేదు. 

ఐరోపా దేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు ఐరోపా దేశాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్‌లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటలీలో ఇప్పటికే కరోనా మరణాలు 10వేల దాటిపోగా, స్పెయిన్‌లోనూ మృతుల సంఖ్య దాదాపు 6వేలకు చేరింది.

యూరప్ లో ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో ఎక్కువ కరోనా మరణాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఆ దేశల్లో ఉన్న వృద్ధులే అంటున్నారు. అప్పటికే అనేక అనారోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులకు కరోనా సోకడంతో ఎక్కువ మంది చనిపోతున్నారు.